మన దేశానికి పక్కలో బల్లెం వంటి దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా మాత్రమే. ఆ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని తీరు మాత్రం మారడం లేదు. మన దేశంపై విషం కక్కడం, మనం తీసుకునే నిర్ణయాలకు అడ్డు రావడం, ఐక్యరాజ్యసమితిలో ప్రతికూలంగా వ్యవహరించడం, మన శత్రు దేశాలకు వత్తాసు పలకడమే డ్రాగన్ పనిగా పెట్టుకున్నది. 1962 నాటి యుద్ధం నుంచి నిన్నమొన్నటి గల్వాన్ లోయ ఉద్రిక్తతల వరకు చైనా ఇదే రీతిలో వ్యవహరించింది. కానీ, ప్రసుతం చైనా తీరు కొంచెం మారినట్టు కనిపిస్తున్నది. భారత విదేశాంగ విధానాన్ని మెచ్చుకోవడమే అందుకు తాజా ఉదాహరణ. ఆ దేశ ప్రభుత్వ అజమాయిషీలో నడుస్తున్న మీడియాలో భారత్ను కీర్తిస్తూ ఒక కథనం ప్రచురితం కావడం మరో విశేషం.
చైనాలోని ‘గ్లోబల్ టైమ్స్’ అనే ఒక పత్రిక భారత్ను ప్రశంసించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఆ పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో భారత విదేశాంగ విధానం, దౌత్యపరమైన విజయాలు, ఆర్థిక విధానాలను కీర్తించడం గమనార్హం. షాంఘైలోని ఫుడాన్ వర్సిటీకి అనుబంధంగా ఉన్న సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ ఈ వ్యాసాన్ని రాశారు. గత నాలుగేండ్లలో ప్రధాని మోదీ హయాంలో భారత్ సాధించిన పలు విజయాలను ఇందులో ప్రస్తావించారు. చైనా పత్రికలో మోదీ ప్రభుత్వం, భారత ప్రగతి గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి. అరుదైన విషయం కూడా. మొదటి నుంచి భారత్తో ఉప్పు నిప్పులా వ్యవహరించే చైనా, మోదీ సర్కార్తోనూ ఇదే రీతిలో వ్యవహరిస్తూ వచ్చింది. పైగా గల్వాన్ లోయలో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆ దేశం భారత్ పట్ల ప్రతికూల వైఖరితో ఉన్న విషయం తెలిసిందే. అమెరికాతో భారత ప్రభుత్వం సత్సంబంధాలు కలిగి ఉండటంతో చైనా మనతో చాలాకాలంగా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నది. కానీ, గతేడాది ఢిల్లీ వేదికగా జరిగిన జీ-20 సమావేశాలు విజయవంతమైన తర్వాత చైనా వైఖరిలో కొంత మార్పు వచ్చిందనే చెప్పవచ్చు.
2020లో ఎల్ఏసీ వద్ద గల్వాన్ లోయ సమీపంలో చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. సరిహద్దుల వెంబడి చైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నది. రోజురోజుకూ భారత భూ భాగాలను ఆక్రమిస్తూ ఆ దేశం మరింత ముందుకు దూసుకువస్తున్నది. శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సైనికాధికారుల స్థాయిలో, దౌత్యపరమైన పద్ధతిలో అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు. సరిహద్దుల వద్ద సాధారణ స్థితిని తీసుకురావాలని భారత్పై చైనా ఒత్తిడి చేస్తునే ఉన్నది. కానీ, చైనా బలగాలను సరిహద్దు వద్ద నుంచి ఉపసంహరించకుండా తాము వెనక్కితగ్గబోమని భారత్ కూడా దీటుగా జవాబిస్తున్నది. దీంతో ఈ విషయంలో చాలాకాలంగా ప్రతిష్ఠంభన నెలకొన్నది.
గ్లోబల్ టైమ్స్లో ప్రచురితమైన వ్యాసం విషయానికి వస్తే.. ‘భారత్ నెరేటివ్’ దిశగా మోదీ సర్కార్ పయనిస్తున్నదని వ్యాస రచయిత జాంగ్ కితాబిచ్చారు. అందుకోసం వ్యూహాత్మకంగా, చురుగ్గా ముందుకెళ్తున్నదని అందులో పేర్కొన్నారు. వాణిజ్య అసమతుల్యతపై గతంలో, ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానాన్ని ఆయన ఉదహరించారు. ‘చైనా-భారత్ మధ్య వాణిజ్య అసమతుల్యత విషయంలో భారత్ విధానం గతంలో వేరుగా ఉండేది. వాణిజ్య అసమతుల్యతను తగ్గించడమే అప్పట్లో లక్ష్యంగా పెట్టుకునేది. కానీ, ప్రస్తుతం భారత్ తన విధానాన్ని మార్చుకున్నది. ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. ఇదే అప్పటికి, ఇప్పటికి ప్రధాన వ్యత్యాసం’ అని జాంగ్ తన వ్యాసంలో విశ్లేషించారు.
ప్రధాని మోదీ హయాంలో అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కూడా జాంగ్ కొనియాడారు. మల్టీ అలైన్మెంట్ అప్రోచ్ విధానాన్ని అనుసరిస్తూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అమెరికా, జపాన్, రష్యాలతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకున్నదని వ్యాస రచయిత పేర్కొన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్-గాజా పోరులోనూ భారత్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించిందని కితాబిచ్చారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని చెప్తూనే, గాజా ప్రజలకు సాయం అందాలని భారత్ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
గత నాలుగైదేండ్లుగా ప్రపంచశక్తిగా ఎదిగేందుకు భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ, 2023లో ఆ దిశగా మోదీ ప్రభుత్వం కీలక విజయాలను సాధించిందని జాంగ్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అభిప్రాయ భేదాలున్నప్పటికీ జీ-20 సమావేశాల్లో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించుకోవడం భారత దౌత్య విజయానికి ఉదాహరణ అని ఆయన కీర్తించారు. జీ-20 కూటమిలో ఆఫ్రికా యూనియన్ను చేర్చుకునే విషయంలో భారత్ చేసిన కృషి సత్ఫలితాలిచ్చిందని చెప్పుకొచ్చారు.
భారత్పై ఎప్పుడూ విషం కక్కే డ్రాగన్ తాజా వైఖరిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. భారత విధానాలను పొగుడుతూ రాత రాయాల్సిన అవసరం ఆ దేశానికి ఏమొచ్చిందనే విషయాన్ని ఆలోచించాలి. చైనా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక దాని స్వప్రయోజనాలు కచ్చితంగా ఉంటాయని మర్చిపోవద్దు. చైనా తాజా వైఖరికి, మాల్దీవులకు సంబంధం ఉండొచ్చు.
చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన మహమ్మద్ ముయిజు మాల్దీవులు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఆ ద్వీప దేశం మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. తాజాగా ఇరు దేశాల మధ్య వివాదం చెలరేగింది. అదే సమయంలో ముయిజు చైనా పర్యటనకు వెళ్లారు. చైనాకు దగ్గరవుతున్న మాల్దీవులకు భారత్ వల్ల ఎటువంటి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే చైనా ఈ విధానాన్ని అనుసరిస్తున్నదని అర్థమవుతున్నది. అందుకు బలం చేకూరే విధంగా తాజాగా ‘గ్లోబల్ టైమ్స్’లో మరో కథనం ప్రచురితమైంది. మాల్దీవులు సహా ఇతర దేశాల పట్ల భారత్ విశాల దృక్పథంతో వ్యవహరించాలని అందులో ఉపదేశం ఇచ్చింది. అందుకే ఎన్నడూలేని విధంగా భారత విధానాలను కొనియాడుతూ చైనా పత్రికలో వ్యాసం ప్రచురితమైందని స్పష్టమవుతున్నది. పాకిస్థాన్, శ్రీలంకలో పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను తనకు అనుకూలంగా మార్చుకున్న చైనా.. మాల్దీవులను కూడా భారత్కు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నదనే విషయాన్ని మరువకూడదు.
అనువాదం : మాలోతు సురేష్
అవీక్ బెనర్జీ
‘ఇండియా టీవీ’ సౌజన్యంతో…