మహిళలకు ఓటు హక్కు కూడా లేని రోజుల్లో ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేశారు ప్రుడెన్సియా అయాల. భారతదేశంలో స్త్రీ జనోద్ధరణకు అలుపెరగని కృషిచేశారు సావిత్రీబాయి పూలే. ఇలాంటి ఎందరో ధీర వనితలు, సంఘ సంస్కర్తల పోరాటం, కృషి ఫలితంగా మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు లభించాయి. 21వ శతాబ్దంలో విద్యావంతుల్లో అవగాహన పెరగడంతో సమాజంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో గుండె ధైర్యంతో తెగువ చూపి ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన ధీర వనిత ప్రుడెన్సియా అయాల (1885-1936). కానీ ఆమె నామినేషన్ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ఆమె మరణించిన చాలా కాలానికి (1950) ఆ దేశ మహిళలకు ఓటు హక్కు లభించింది. ప్రుడెన్సియా జర్నలిస్టుగా, కవయిత్రిగా, వ్యాసకర్తగా, స్త్రీ హక్కుల కార్యకర్తగా పనిచేశారు. మహిళా సాధికారత కోసం ఉద్యమించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సమస్యలపైనా స్పందించారు. అమెరికా ఎల్ సాల్వడార్పై సైనిక చర్య చేపట్టడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. పరిపాలనలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని, పిల్లలకు కూడా హక్కులు ఉండాలని ఉద్యమాలు చేశారు. దీంతో ఆమెను అనేకసార్లు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయినా అందుకు ఆమె విచారించలేదు.
లింగ సమానత్వ అవసరం గురించి ప్రుడెన్సియా ఇలా అంటా రు. ‘స్త్రీ, పురుషుడు ఉంటేనే ఇల్లు. స్త్రీ, పురుషులు ఉంటేనే సమా జం. స్త్రీ, పురుషుడు ఉంటేనే రాబోయే తరాలు. స్త్రీ-పురుషుడు అంటేనే జీవన సౌందర్యం! స్త్రీ-పురుషుడు ఉంటేనే అర్థం-పరమార్థం. అందువల్ల దేశంలో పౌరసత్వం అనేది ఇద్దరికీ సమానమే. ఓటు హక్కుతో పాటు ఇతర హక్కులు, బాధ్యతలు ఇద్దరికీ సమానమే. సమాజంలో సమ భాగస్వాములైన స్త్రీలను తక్కువగా చూడటం, సౌకర్యాలు కల్పించకపోవడం, విద్యనందించక పోవడం హేయమైన చర్య. సత్వరం దాన్ని సరిచేసుకోవాలి’. ఆమె కృషి కారణంగా ఆమె మరణం తర్వాత చాలాకాలానికి మార్పులు జరుగుతూ వచ్చాయి. హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీర వనితగా ప్రపంచం ఆమెను గుర్తించిన తర్వాత ఎల్ సాల్వడార్ దేశ అత్యున్నత గౌరవమైన ‘ఆర్డర్ ఆఫ్ జోస్ మాటియాస్ డెల్ గాడో’ను 2014లో ఆమెకు ప్రకటించింది.
భారత్ను పరిశీలిస్తే స్త్రీలకు విద్య నేర్పించి, వివేకవంతుల్ని చేసిన ఘనత సావిత్రీబాయి పూలేకు (1831-1897) దక్కుతుంది. ఆమె మరాఠీ కవయిత్రి, మేధావి మాత్రమే కాదు, భారత్లో తొలి ఉపాధ్యాయురాలు. భర్త జ్యోతిభా పూలే సహకారంతో ఆమె అంటరానితనం నిర్మూలనకు కృషిచేశారు. 1848లో బ్రాహ్మణేతర జాతుల బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించారు. 1873లో సత్యశోధక్ మండల్ ప్రారంభించి ఒక మహోద్యమానికి రూపకల్పన చేశారు. ఆమె తర్వాత అనేక మంది మహిళలు, సంఘసంస్కర్తలు మహిళల అభ్యున్నతి, హక్కుల కోసం పోరాటం చేశారు. మహిళలకు ఓటు హక్కు ఉండాల్సిన అవసరాన్ని 1917లో ‘ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ నొక్కి చెప్పింది. మార్గరెట్ కజిన్స్, అనిబిసెంట్, జినా రాజదాస, దోరీతి వంటివారు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ను పురోగమన దిశలో నడిపించారు.
20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారి వివిధ దేశాల్లో మహిళలకు ఎన్నో హక్కులు లభించా యి. ప్రపంచపు పనిలో మూడింట రెండు వంతులు పనిచేసేది మహిళలే. కానీ పదింట ఒక వంతు మాత్రమే సంపాదించుకొని, వందలో ఒక వంతు ఆస్తి కూడా లేనివారూ మహిళలే. ఆమె కాలాన్ని, శక్తిని, ఆలోచనలను ఇంటి పని మింగేస్తున్నది. ఆ పని ఎంత విలువైందో, అంత ‘విలువ’ లేనిది! ప్రపంచంలో గల ఆహారంలో సగానికి పైగా పండించేది స్త్రీలే. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే భూ యజమానులు. ప్రపంచ కూలీల్లో మూడు వంతులు మహిళలే. కానీ వారికి పురుషుల కంటే తక్కువ కూలీ చెల్లిస్తారు. నిన్నమొన్నటిదాకా ఉద్యోగాల్లో కూడా ఈ తేడా ఉండే ది. అయితే ఈ 21వ శతాబ్దంలో పరిస్థితులు మెరుగవుతున్నాయి. పురుషులతో పాటు స్త్రీలకూ సమాన హక్కులు లభిస్తున్నాయి. సమాజంలో కూడా ఈ మేరకు అవగాహన పెరుగుతున్నది.
(నేడు సావిత్రీబాయి పూలే జయంతి)
(వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవ శాస్త్రవేత్త)
-డాక్టర్ దేవరాజు
మహారాజు