ఎంతోమంది భారతీయ యువతీ యువకుల గమ్యస్థానం అమెరికా. ఆర్థిక సమస్యలను అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని వారు అగ్రదేశం అమెరికాకు పయనం అవుతున్నారు. కానీ ఆ ఆశలు కొంత మంది జీవితాల్లో విషాదాన్ని మిగులుస్తున్నాయి. అమెరికాలో తరచూ చోటుచేసుకునే కాల్పుల ఘటనల్లో భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి విపత్కర సమయంలో, వారి కుటుంబాలు తీవ్ర నిరాశలో కూరుకుపోతుంటాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు అమెరికా ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకునే అవకాశాలున్నాయి. సరైన ప్రక్రియలో ముందుకు వెళ్తే, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం లభిస్తుంది. దీని గురించి అమెరికాలోని భారతీయులందరికీ అవగాహన ఉండటం అవసరం.
అమెరికాలో విపరీతంగా విస్తరించిన తుపాకీ సంస్కృతి ఎంతోమంది అమాయకులను బలి తీసుకుంటున్నది. వీరి లో భారతీయులు కూడా ఉంటున్నారు. ఇటీవల తెలుగు విద్యార్థి సాయిష్ వీర హత్య అం దరినీ ఎంతో కలచివేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన 24 ఏండ్ల సాయిష్ వీరను అమెరికాలోని ఓహియోలో ఒక ఫ్యూయల్ స్టేషన్లో (పెట్రోల్ బంకులో) గురువారం ఓ దొంగల గుంపు కాల్చి చంపింది. సాయిష్ అక్కడే పార్ట్టైం ఉద్యోగం చేస్తున్నాడు.
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఈ నెల 20న అర్ధరాత్రి దాటాక 12:50 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. దుండగులు కాల్పులు జరుపటంతో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిష్ను అధికారులు స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. ఆ యువకుడి ప్రాణాలను రక్షించటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ, బలమైన గాయాల కారణంగా సాయిష్ మరణించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన అనుమానితుడి ఫొటోను షేర్ చేశారు.
సాయిష్ సన్నిహితులు చెప్పిన వివరాల ప్రకారం.. తన కుటుంబంలో అమెరికాకు వచ్చిన మొదటి వ్యక్తి అతను. తండ్రి కోరిక మేరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చాడు. సాయిష్ తండ్రి ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా పని చేసేవారు. నాలుగేండ్ల కిందటే ఆయన మరణించారు. దీంతో సాయిష్ తన కుటుంబానికి పెద్ద దిక్కు కావాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు సాయిష్ కూడా అనూహ్యంగా మరణించటంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. సాయిష్ ఇప్పటికే హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో పార్ట్ టైమ్ పనికి రాజీనామా కూడా చేశాడు. మే నెలాఖరున స్వదేశానికి వచ్చి ఒక నెల రోజులు ఉండి, తిరిగి అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది.
సాయిష్లాగా హత్యకు గురైన వ్యక్తుల తాలూకు కుటుంబాలను అమెరికా ప్రభుత్వం ఆదుకుంటుంది. నష్టపరిహారం ఇస్తుంది. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. సరైన న్యాయసలహా అందించే వారు కూడా లేక అనేక మంది భారతీయులు నష్టపోతున్నారు. డబ్బు వారి బాధను దూరం చేయలేకపోయినా, కనీసం వారిని ఆర్థికంగా కష్టాల పాలు కాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ విషయం భారతీయులందరికీ తప్పక తెలియాల్సిన అవసరం ఉంది. నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు ఆ ఘటనల తాలూకు బాధితులను ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం రెండు బిలియన్ డాలర్లతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. అమెరికాలోని ఫెడరల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఈ నిధుల నుంచి పరిహారం చెల్లింపునకు బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, భారతీయులు వారి కుటుంబాలు ఈ విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఆపత్కర సమయంలో ఇది ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుంది. సాయిష్ కుటుంబ సభ్యుల ద్వారా అమెరికా ప్రభుత్వానికి అర్జీ పెట్టిస్తే వారికి దాదాపు రూ.50 లక్షల వరకు నష్టపరిహారాన్ని అందించవచ్చు.
(వ్యాసకర్త: అటార్నీ, న్యూయార్క్, అమెరికా )
శ్రీనివాస్రావు కావేటి
91 96182 84987
+19 17324 7803