దేశంలోని అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని, గుజరాత్ మాడలే అందుకు నిదర్శనమని 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ అనేక హామీలిచ్చారు. కానీ, భారతదేశంలోని ఏ సమస్యనూ ఆయన పరిష్కరించలేకపోయారు. ప్రజలను కొట్టి కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు పంచే గుజరాత్ మాడల్ అట్టర్ఫ్లాప్ అని తేలిపోయింది. ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, రచయిత, కాలమిస్టు అశోకా మోదీ రాసిన ‘ఇండియా ఈజ్ బ్రోకెన్; ఎ పీపుల్ బిట్రేయ్డ్, 1947 టు టుడే’ గ్రంథం దీనిని ప్రభావవంతంగా విశదీకరించింది. ఆ పుస్తకంలోని వివరాలు..
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన కొంతకాలానికే 2002 ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలో ముస్లింల ఊచకోత జరిగింది. దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చా యి. రాష్ట్రం మతపరంగా నిట్టనిలువునా చీలిన నేపథ్యంలో, పెట్టుబడులు పెట్టడాని కి భారతీయ పారిశ్రామికవేత్తలు ముందు కురాలేదు. దీంతో, మోదీకి వ్యాపారుల, పారిశ్రామికవేత్తల అనుకూలుడు అని ముద్ర వేసుకోవాల్సిన అవసరం ముందు కు వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్లో గౌతమ్ అదానీ సహకారంతో ‘వైబ్రెంట్ గుజరాత్’ అనే బ్రాండ్నేమ్ను ముందుకు తీసుకొచ్చారు. గుజరాత్లో పెట్టుబడులను ఆకర్షించటానికి రెండేండ్లకోసారి ఈ పేరుతో సదస్సులు ప్రారంభించారు. దీని కింద అదానీ, అంబానీ భారీ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. తన ప్రచారాన్ని జాతీయస్థాయికి విస్తరిస్తూ, 2004లో ‘గుజరాత్ మాడల్ అభివృద్ధి’ అనే నినాదాన్ని మోదీ తీసుకొచ్చారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున వివిధ రాష్ర్టాల్లో ప్రచారం చేశారు.
గుజరాత్లో పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్తలకు మోదీ దాదాపు ఉచితంగా భూమి, వడ్డీ లేని రుణాలు, పన్ను మినహాయింపులు ఇవ్వటమేగాక పర్యావరణ అనుమతులు అంటూ వారిని ‘కష్టపెట్టలేదు’. భారీ కంపెనీలకు రూ.750 కోట్ల మేర అనుచిత లబ్ధి చేకూర్చారని 2013లో కాగ్ నివేదిక మోదీ సర్కార్ను దుయ్యబట్టింది. వీటిలో అదానీ, అంబానీల కంపెనీలున్నాయి.
పెట్రోలియం, స్టీల్, రసాయనాలు, ఔషధాల రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టిన ఈ కంపెనీల వల్ల రాష్ట్ర జీడీపీలో వృద్ధి కనిపించింది కానీ, గుజరాతీలకు ఉద్యోగాల పరంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే, అవన్నీ క్యాపిటల్ ఇంటెన్సివ్ (పెట్టుబడి కేంద్రిత) ప్రాజెక్టులే గానీ లేబర్ ఇంటెన్సివ్ (ఉపాధి కేంద్రిత) ప్రాజెక్టులు కావు. అంతేకాదు వీటి వల్ల రాష్ట్రంలో నదులు, భూమి వంటి సహజ వనరులు కాలుష్యమయంగా మారాయి. ఉదాహరణకు, అదానీ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల జలవనరులు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటి మీద ఆధారపడిన వేలాది మంది మత్స్యకారుల జీవితాలూ అల్లకల్లోలమయ్యాయి. 2000 నుంచి 2014లోపు అదానీ బిజినె స్ టర్నోవర్ 14 రెట్లు పెరిగి, రూ.70,061 కోట్లకు చేరుకున్నది. రాష్ట్ర బడ్జెట్లో ప్రైవే టు కంపెనీలకు పెద్దపీట వేస్తుండటంతో, విద్య, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలకు తగిన నిధులు లభించని దుస్థితి నెలకొన్నది. ఆ రంగాలు క్రమేపీ దెబ్బతినటం మొదలైంది. ఓవైపు జీడీపీలో వృద్ధి, మరోవైపు మానవాభివృద్ధి సూచీల్లో అధోగతి.. ఇదే గుజరాత్ నమూనా.
2013 ప్రారంభంలో దేశంలో తదుపరి లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొనటం మొదలైంది. బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలవాలని భావించిన మోదీ, ‘గుజరాత్ మాడల్’ ప్రచారాన్ని ఉధృతం చేశారు. దీనిపై అప్పట్లోనే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జగదీష్ భగవతి స్పందిస్తూ.. ‘గుజరాత్ మాడల్ అనేది ప్రజలకు సంక్షేమ ఫలాలను పంపిణీ చేసే మాడల్ కాదు. అది ప్రైవేటు వ్యాపారవేత్తలను ప్రోత్సహించే మాడల్ మాత్రమే’ అని కుండబద్దలు కొట్టారు. ప్రపంచంలో అభివృద్ధి పథాన సాగుతున్న ఏ దేశమూ ఈ విధంగా ఆర్థికశక్తిగా ఎదగలేదు. మన పొరుగున ఉన్న చైనా తదితర తూర్పు ఆసియా దేశాలు కూడా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలను భారీ ఎత్తున కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచి ఆర్థికశక్తులుగా ఎదిగాయి. ప్రపంచ ఆర్థికరంగం 2000 ప్రారంభంలో ఉన్నంత చురుగ్గా 2013 నాటికి లేదు. మందగమనం మొదలైంది. భారత్లో కూడా దీని ప్రభావం కనిపిస్తున్న సమయం అది. తక్కువ వ్యవసాయ ఉత్పాదకత, పట్టణాల్లో ఉద్యోగాల కొరత, మానవాభివృద్ధి సూచీల్లో వెనుకంజ నమోదయ్యాయి. ఆర్థిక ప్రగతిని కొలవటానికి భారతీయులు ఉపయోగించే ఏకైక కొలమానమైన జీడీపీ క్రమంగా క్షీణిస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ముందుకొచ్చిన వ్యక్తిగా మోదీ కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.
భారత జనాభాలో మెజారిటీగా ఉన్న యువశక్తిని ఉద్దేశించి మోదీ ప్రసంగాలు చేశారు. లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలతో, భారీ వ్యయంతో కూడిన హైటెక్ ప్రచారం మొదలైంది. మతపరమైన వ్యాఖ్యలు వెలువడసాగాయి.
ఉత్తరప్రదేశ్లో ఇది తీవ్రరూపం దాల్చింది. ఆ రాష్ట్రంలో క్రిమినల్-పొలిటికల్ నెట్వర్క్ తీవ్రమైన మతోన్మాదాన్ని సంతరించుకున్నది. ఆగస్టు 2013లో యూపీలోని ముజఫర్నగర్లో హిందూ-ముస్లిం ఘర్షణలు చెలరేగాయి. ఇద్దరు హిందూ యువకులను కొట్టి చంపినట్లుగా చూపించే ఒక నకిలీ వీడియో ఈ ఘర్షణల ను ప్రారంభించింది. ఈ వీడియోను బీజేపీ నేతలే వైరల్ చేశారు. యూపీలో ‘మనం-వాళ్లు’ అనే విభజన రేఖ స్పష్టంగా ఏర్పడిం ది. ఢిల్లీలో అధికారపీఠం ఎక్కాలంటే మోదీకి యూపీలో ఉన్న 80 లోక్సభ సీట్లు కీలకం. యూపీలో బీజేపీ 71 స్థానాలను గెల్చుకున్నది. మోదీ విజయంలో ఇది కీలకంగా మారింది. 2014 మేలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రిగా ప్రమాణం చేయటానికి మోదీ అహ్మదాబాద్ నుంచి గౌతమ్ అదానీ వ్యక్తిగత విమానంలో ఢిల్లీకి వచ్చారు.
మోదీ ప్రధాని అయిన తర్వాత నెల జూన్లో వర్షపాతం సరిగా లేక వ్యవసాయానికి నిరాశ కలిగించింది. పారిశ్రామిక ఉత్పత్తిరంగం నిస్సత్తువలో ఉంది. ఒకే ఒక మంచి వార్త ఏమిటంటే, అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గటం. దీనివల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. చమురు దిగుమతుల బిల్లు పరంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గింది. పెట్రో ఉత్పత్తుల మీద ఇస్తున్న సబ్సిడీలను తగ్గించి, ఆదాయాన్ని పెంచుకోవటానికి కూడా ఈ పరిణామం ప్రభుత్వానికి ఉపయోగపడింది. అయినప్పటికీ, దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుపడలేదు. పంద్రాగస్టున మోదీ ప్రకటించినట్లుగా, భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా మారలేదు. కానీ, ప్రభుత్వ బ్యాంకుల నుంచి భారీ కార్పొరేట్లు యథేచ్ఛగా రుణాలను తీసుకోవటం పతాకస్థాయికి చేరింది. వారు అప్పులు తిరిగి చెల్లించకపోగా వారి నష్టాలను ప్రభుత్వ బ్యాంకుల మీద రుద్దటంపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ, మోదీ సర్కార్కు ఏప్రిల్ 2015లో ఒక నివేదిక పంపించారు. కానీ, ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ లేవు. వరుసగా రెండో ఏడాది కూడా వర్షాలు సరిగా పడలేదు. నిరుద్యోగం విశ్వరూపం దాల్చింది.
2016 నవంబరు 8న రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ టీవీలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు చెల్లబోవని ప్రకటించి యావత్ దేశాన్ని షాక్కు గురి చేశారు. అసలే అనేక బాధల్లో ఉన్న భారతీయులను ఈ నోట్లరద్దు అతలాకుతలం చేసింది. సంచలన నిర్ణయాలకు మారుపేరైన సింగపూర్ మాజీ ప్రధాని లీ క్యున్ వ్యూను అనుకరిస్తూ మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం పూర్తి వైఫల్యంగా నిలిచింది. ఆయన ఆశించినట్టు నల్లధనం బయటపడలేదు.
నోట్లరద్దు తాలూకు బాధలు ఇంకా కొనసాగుతుండగానే, మోదీ 2017 జూలై 1న జీఎస్టీని తీసుకొచ్చారు. పన్నుల మీద పన్ను పోటు లేకుండా,
దేశమంతటా ఒకే పన్ను ఉండేలా చేసే జీఎస్టీ మంచి ప్రయత్నమే. కానీ, దాని అమలు ఆర్థికంగానూ, పాలనపరంగానూ కొత్త సమస్యలను సృష్టించింది. అప్పటికే నోట్లరద్దుతో దెబ్బతిన్న చిన్న వ్యాపారాలకు ఇది మరో శరాఘాతం అయ్యింది.
2018లో ఐఎంఎఫ్ విడుదల చేసిన వార్షిక నివేదికలో.. నోట్లరద్దు, జీఎస్టీ భారత ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేశాయని పేర్కొంది. భారత ఆర్థికవ్యవస్థకు పునాది వంటి వ్యవసాయరంగం తీవ్ర సం క్షోభంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ విఫలమైంది. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ పరిస్థి తి మెరుగుపడలేదు. నిరుద్యోగం ఎన్నడూ లేనంత ప్రబలింది. పేదరికం విపరీతంగా పెరిగిపోయింది. వాటిగురించి వాస్తవాల ను తెలియజేసే గణాంకాలు లేకుండా, అధికారిక నివేదికలను ప్రభుత్వం తొక్కిపెట్టింది.
ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోదీ విపరీతంగా ప్రచారం చేసిన ‘గుజరాత్ అభివృద్ధి మాడల్’ భారతదేశ అవసరాలను తీర్చలేదని రుజువైంది. ఆ మాడల్ ప్రకారం, ఉద్యోగాలు సృష్టించని ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్టులు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి.
అనువాదం: కె.వి.రవికుమార్
కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం 2014లో నరేంద్ర మోదీ ప్రచారం చేసుకొన్న ‘గుజరాత్ మాడల్’ ఏమిటి? 22 ఏండ్లుగా మోదీ ప్రత్యక్ష, పరోక్ష పరిపాలనలో ఉన్న గుజరాత్కు జరిగిందేమిటి? గుజరాతీ ప్రజలకు ఒరిగిందేమిటి? వివిధ అంశాల్లో గుజరాత్ ఇప్పుడు ఎక్కడుంది? ‘గుజరాత్ మాడల్’ సాఫల్యమెంత?
కేవలం తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిందేమిటి? తెలంగాణ ప్రజలకు దక్కిందేమిటి? ప్రత్యేక రాష్ట్రంలో చిక్కిందేమిటి? ‘తెలంగాణ మాడల్’ విజయ రహస్యమేమిటి?
గుజరాత్ మాడల్, తెలంగాణ మాడల్..ఏది ఉత్త మాడల్?, ఏది ఉత్తమ మాడల్?
యాభై అంశాల తులనాత్మక పరిశీలన రేపటి ‘నమస్తే తెలంగాణ’ అనుబంధం బతుకమ్మలో…