మంత్రిని తొలగించే అధికారం తనకుందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ పదేపదే అంటుంటారు. కానీ తమిళనాడు గవర్నర్ ఆ పని నిజంగానే చేసిచూపారు. మంత్రి సెంథిల్ బర్తరఫ్ అంటూ ఆదేశాలు జారీచేశారు. కానీ, వెంటనే మనసు మార్చుకొని ఆ నిర్ణయం పక్కన పెడుతున్నట్టు తెలిపారు. ఈ రెండు చర్యలూ రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే నియామకమైనా, తొలగింపు అయినా సీఎం నేతృత్వంలోని మంత్రిమండలి సలహా ప్రకారమే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నది.
ప్రజా ప్రభుత్వాల సలహా మేరకు తప్ప మరోవిధంగా వ్యవహరించే అవకాశం గవర్నర్ పదవికి లేదు. మరి అలాంటప్పుడు గవర్నర్ మంత్రులను తన ఇచ్ఛానుసారం నియమించడం, తొలగించడం కుదురుతుందా?
రాజ్యాంగ పదవుల గౌరవ మర్యాదలపై క్రీనీడలు పడుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ రోజురోజుకూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నది. రాజ్యాంగ రక్షకులుగా ఉండాల్సిన గవర్నర్లు రాజ్యాంగానికి అతీతంగా చర్యలకు పాల్పడుతుండటం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. సంయమనం, హుందాతనం స్థానంలో తొందరపాటు, కక్షసాధింపు వచ్చిచేరుతున్నాయి. తమిళనాడు గవర్నర్ రవి స్వీయ నిర్ణయం మేరకు మంత్రి సెంథిల్ను బర్తరఫ్ చేయడం ఈ రకం వివాదాలకు పరాకాష్ఠగా నిలుస్తుంది. ఈ అసాధారణ చర్యపై న్యాయ పోరాటానికి తమిళనాడు సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు. కానీ కొన్ని గంటల్లోనే గవర్నర్ తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నారు. ప్రస్తుతానికి బర్తరఫ్ ఆదేశాలు పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. న్యాయ సలహా తీసుకుంటుంటున్నానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ‘మేం గవర్నర్ ఆదేశాలను ఖాతరు చేయం’ అని తమిళ సీఎం స్టాలిన్ కటువుగానే స్పందించారు. ఈ వివాదంతో గవర్నర్ల అధికారాలు, పాత్రపై చర్చ మరోమారు ముందుకువచ్చింది.
ఏ రాష్ట్రంలోనైనా పాలన గవర్నర్ పేరు మీద సాగుతుంది. ఇవి నామమాత్రపు, అలంకారప్రాయపు పదవులు. గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యులు. అందుకే వాటిని రాజ్యాంగ పదవులంటారు. రాష్ర్టానికి సర్వోన్నత ప్రతినిధులుగా, ప్రథమ పౌరులుగా మన్ననలు పొందుతుంటారు. మిగతావి రాజకీయ పదవులు. ఎన్నికైన ప్రజా ప్రభుత్వ అధినేతే పాలన సాగిస్తారు. సీఎం నేతృత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ సలహా ప్రకారం గవర్నర్ వ్యవహరిస్తారు. ఇలా ప్రజా ప్రభుత్వాల సలహా మేరకు తప్ప మరోవిధంగా వ్యవహరించే అవకాశం గవర్నర్ పదవికి లేదు. మరి అలాంటప్పుడు గవర్నర్ మంత్రులను తన ఇచ్ఛానుసారం నియమించడం, తొలగించడం కుదురుతుం దా? ఇంగ్లిష్లో ఈ సందర్భంగా ‘గవర్నర్స్ ప్లెజర్’ అనే మాట వాడుతారు. అంటే ‘గవర్నర్ అభీష్టం’ మేరకు అని అర్థం. అయితే ఆ అభీష్టం మంత్రి మం డలి సలహా మీదనే ఆధారపడి ఉంటుంది. ‘ప్లెజర్’ అనే మాటను మన రాజ్యాంగంలోనూ కొనసాగించినప్పటికీ దానికి ‘మంత్రిమండలి సలహా’ అనేదాన్ని జోడించారు.
తమిళనాడు గవర్నర్ ఆలోచన రాజ్యాంగానికి సరిపోయేలా లేదనేది న్యాయనిపుణుల అభిప్రాయం. బ్రిటిష్ పాలనాకాలంలో 1935లో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. అందులోని 51(1) నిబంధన ప్రకారం గవర్నర్ తన ఇచ్ఛానుసారం మంత్రులను నియమించనూ వచ్చు, తొలగించనూ వచ్చు. ఎంపిక, ఆహ్వానం, తొలగింపుతో పాటుగా జీతభత్యాలు కూడా గవర్నర్ ఇచ్ఛానుసారమే నిర్ణయమవుతాయని అదే చట్టంలోని 51(5) నిబంధన చెప్తున్నది.. అది వలస పాలనకు సరిపోయే ఏర్పాటు. ఎందుకంటే పరాయి దేశస్థులు గవర్నర్లు. స్వదేశీయులు మంత్రులు. మన సొంత రాజ్యాంగంలో ఈ నిర్ణయాధికారాన్ని తొలగించారు. మంత్రుల నియామకమైనా, తొలగించడమైనా ముఖ్యమంత్రి సలహామేరకు మాత్రమే జరుగుతాయి.
గవర్నర్ స్వతంత్ర వ్యవహారం జరిపే వీలు ఏదీ మన రాజ్యాంగంలో లేదని న్యాయస్థానాలు పలు సందర్భాల్లో తేల్చిచెప్పాయి. గవర్నర్ నిర్ణయాధికారాలు రాజ్యాంగంలోని 163(1)లో తెలిపిన నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి. సుప్రీంతో సహా దేశంలోని న్యాయస్థానాలు ఈ సంగతి పలుమార్లు నొక్కిచెప్పాయి. అంతా సజావుగా సాగుతుందనే ప్రగాఢమైన నమ్మకంతో రాజ్యాంగ నిర్మాతలు ఈ పదవులను ఖరారు చేశారు.
కానీ వాస్తవంలో నాటినుంచి నేటిదాకా గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదమవుతూనే ఉంది. ఎంత గొప్ప రాజ్యాంగమైనా దాని పనితీరు అనేది అమలు చేసేవారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరిక ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నది.
-తుమ్మలపల్లి రఘురాములు
91827 77750