భారతదేశంలో జీ-20 సమావేశాలు జరిగితే, ఇందుకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వియెత్నాంలో పెట్టారు. భారత్ నుంచి నేరుగా బైడెన్ తన షెడ్యూల్లో భాగంగా వియెత్నాం వెళ్లారు. మన ప్రధాని మోదీతో జరిగిన చర్చల వివరాలు, అయన మోదీకి చేసిన సూచనలను, జీ-20 మీటింగ్ వివరాలు అక్కడ వెల్లడించారు. మనదేశంలో ఆ అవకాశం లేదు. ఎందుకంటే మన పీఎం ప్రెస్మీట్లు పెట్టరు కదా, అందుకే వియెత్నాంలో ఇక్కడి మీటింగ్ విశేషాలు చెప్పారు బైడెన్!
మనదేశంలో చాలా ఆర్భాటంగా జీ-20 సమావేశాలు నిర్వహించారు. విదేశీ, స్వదేశీ జర్నలిస్టులతో ఇంటరాక్షన్ లేదు. పీఎం మోదీ ఒకసారి జర్నలిస్టులు ఉన్నకాడికి వచ్చి అందరికి చేతులు ఊపి వెళ్లిపోయారు. అమెరికా అధ్యక్షుడి వెంట వచ్చిన పాత్రికేయులను సైతం దగ్గరికి రానీయలేదు. వారు దీనిపై నిరసన కూడా తెలియజేశారు. విదేశీ జర్నలిస్టులందరిని, మనవాళ్లతో సహా కార్నర్ చేశారు. ఇదంతా మనదేశం జర్నలిస్టులకు తొమ్మిదేండ్ల నుంచి అలవాటే. ఈ అవమానాలు అలవాటయ్యాయి కూడా. మోదీ చేతులు ఊపుకుంటూ వెళ్తుంటే ఒక మీడియా ప్రతినిధి ఆయనకు గట్టిగా అరుస్తూ శుభాకాంక్షలు చెప్పాడు. కొందరు బీజేపీ నేతలు మోదీ జిందాబాద్ నినాదాలు చేశారు. ఇదంతా చూసి విదేశీ మీడియా ప్రతినిధులు జీర్ణించుకోలేని పరిస్థితి. జీ-20 సమావేశాల్లో విదేశాల నుంచి వచ్చిన జర్నలిస్ట్లతోనూ మోదీ మాట్లాడింది లేదు. దీన్ని చాలా అవమానంగా భావించారు వారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ప్రజాస్వామ్యానికి కన్నతల్లిగా చెప్పుకునే భారత్లో మీడియా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటేనే గిట్టని మన పీఎం మోదీ మీడియాతో ఎప్పుడూ దూరంగానే ఉం టారు. వివిధ దేశాలనుంచి వచ్చిన జర్నలిస్టులతో ‘ది వైర్’ ఆన్లైన్ మీడియా సమావేశాన్ని ఎం-20 పేరిట నిర్వహించి మీడియా స్వేచ్ఛ గురించి వారి నోట చెప్పించింది. ఈ సమ్మిట్లో చాలా విషయం ఉంది. జర్నలిస్టుల కష్టాలు ఉన్నాయి. జర్నలిస్టులపై అణచివేత ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం ఎలా బతికి బట్టకడుతుంది? ప్రతిరోజు అబద్ధాన్ని వండి, వారుస్తున్న సర్కారీ, దర్బా రీ మీడియా అందిస్తున్న వార్తల్లో నిజమెంతో జనం నిర్ణయించుకోవాలి. మీడియా స్వేచ్ఛలో 185 దేశాల జాబితాలో భారత్ స్థా నం 160 స్థానంలో ఉండటం కూ డా ఒక్కసారి గమనించాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలంటే మనం ముందు మారాలి. నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందని చాటిచెప్పాలి. మన హక్కులు కాపాడుకునే శక్తియుక్తులను గుర్తించాలి. అంతా మనచేతుల్లోనే ఉంది. మన చేతులు మన నెత్తిన పెడుతున్నారు. కొద్దిగా జాగ్రత్త పడదాం.
ఢిల్లీ అంతటా నింపేసిన జీ-20 కటౌట్లు, పోస్టర్లలో మోదీ తప్ప వేరే నేతల ఫొటో ఒక్కటి కూడా లే దు. ఢిల్లీలోని ఈ ప్రచార హంగామా చూస్తే గల్ఫ్ దేశాల్లోని రాచరికం గుర్తుకు వస్తుంది. ఒకే దేశం, ఒకే నాయకుడు ప్రతిపాదనకు ఇది నాంది కాదు కదా? నియంత మనస్తత్వానికి జీ-20 పోస్టర్ల ప్రచారం ఒక పరాకాష్ఠ. జీ -20 సమ్మిట్కు రూ.4వేల కోట్లు ఖర్చయ్యిందట. అతిథులకు బంగారు, వెండి కంచాల్లో భోజనం వడ్డించారు. 80 కోట్ల మంది పేదలు ఉన్న దేశంలో రాజుల కాలంలో మాదిరి ఆ వడ్డనలు ఏమిటో? మనది గరీబు దేశం కాదు, చాలా అమీర్ దేశం అని చాటుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలోని పేదల ఫుట్పాత్ జీవితాలు కనిపించకుండా ఆకుపచ్చ పరదాలు వారికి అడ్డంగా కట్టేశారు. ఇంటి పేదరికపు గుట్టు ఇతరులకు తెలియవద్దని.
ఎవరైనా గెస్ట్ వచ్చినపుడు కొన్ని విషయాలు దాచి పెడుతూ ఉంటాం! అలా అనిపించింది మొత్తంగా పరిస్థితి. దేశంలో వాస్తవ పరిస్థితిని బయటకు రానీయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, వియెత్నాం లో బైడెన్ మాట్లాడింది వింటే చాలు, అంతా అర్థమవుతుంది. దేశం ఒకవైపు రూ.155 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. దీని వడ్డీనే ఏటా రూ.11 లక్షల కోట్లు ఉందంటారు. 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది పేదలు బతుకడానికి ప్రభుత్వం ఐదు కేజీల ఉచిత తాత్కాలిక రేషన్ ఇస్తున్నది. దీనికోసం కేంద్రం మీద రెండు లక్షల కోట్లకు పైగా భారం పడుతున్నది. పేదరిక నిర్మూలన ని నాదం దశాబ్దాలుగా పాలకుల నోట వింటూనే ఉన్నాం. రకరకాల జనరంజక, ఓట్లను దండుకునే, పేదలను మభ్యపెట్టే స్కీమ్లు తెచ్చిన సందర్భం చూశాం. పేదల సంఖ్య తగ్గడం బదులుగా పెరుగుతున్నది. ఉద్యోగాలు లేవు, అందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసింది లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ, పీఎం మోదీ ఆ హామీని పట్టించుకున్నదీ లేదు.. నెరవేర్చిందీ లేదు.
దేశంలో ఏ అంతర్జాతీయ మీటింగ్ ప్రభావమైనా ముందు పేదోడి మీద పడాల్సిందే! మూడు నెలలుగా ఢిల్లీ సుందరీకరణ పేరిట 1600 పేదల ఇండ్లు బుల్డోజర్లతో కూల్చివేశారు! మొత్తం రెండు లక్షల 60 వేలమందిని పూర్తిగా ఇల్లు లేని వారిని చేసేసింది ప్రభు త్వం! జీ-20 సమావేశాలు జరిగే ప్రాంగణం చుట్టుపక్కల సుందరీకరణ కోసం కేంద్రం వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించింది! విదేశీయులకు మన దేశంలోని పేదరికం, నిరుద్యోగం కనిపించొద్దు కదా! అందుకే గొప్పోళ్ల ఇండ్లు అక్రమంగా కట్టినా వాటిని కూల్చలేదు! పేదోళ్లవి మాత్రం కూల్చేశారు.
నిజానికి ఢిల్లీ ప్రాంతంలోనే 11 మంది ఎంపీలకు చెందిన 576 కట్టడాలు, ఇండ్లు అక్రమంగా నిర్మించిన దాఖలాలు ఉన్నాయి! కానీ వాటి జోలికి వీరు వెళ్లరు. వారికి నోటీసు ఇవ్వరు! ఇవ్వలేరు. పేదల ఇండ్లు మా త్రం కూల్చేస్తారు. విశ్వగురు కలలు కంటున్న నరేంద్ర మోదీకి పేదల ఇండ్ల కూల్చివేత వెతలు వినిపించడం కష్టమే. మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీలలో కూల్చివేతలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. గత తొమ్మిదేండ్లుగా ఒక వర్గానికి చెందినవారి జీవితాలు అల్లకల్లోలంగా మారాయంటే అతిశయోక్తి కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మొత్తంగా బడుగు, బలహీన వర్గాల పరిస్థితి కడుదీనంగా తయారైంది. దేశంలో 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది పేదలున్నారు. వీరికి ప్రభు త్వం బతకడానికి ఉపాధి ఇవ్వకున్నా 5 కేజీల ఉచిత రేషన్ విదిలిస్తున్నది. ఇదీ కేవలం ఎన్నికల కోసమే అనేది జగమెరిగిన సత్యం! కేవలం 2024లో పాలనలో మార్పు వస్తే తప్ప, పేదప్రజల స్థితిగతుల్లో మార్పురాదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి.
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్టు)
-ఎండీ మునీర్
99518 65223