భారతదేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ప్రపంచంలోనే అతిపెద్దది. దాని ఉత్పత్తి 2025-26 నాటికి రూ.53,500 కోట్లకు చేరుతుందని అంచనా. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని వినియోగదారులకు భారతీయ రైతులను అనుసంధానించడంలో భారతదేశంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఒక ముఖ్యపాత్రను పోషిస్తున్నది. భారతదేశం ఆహార, కిరాణా మార్కెట్ రంగంలో ప్రపంచంలో ఆరవది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ, దేశంలో ఆహార ప్రాసెసింగ్ మొత్తం స్థాయులను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది.
రానున్న పదేండ్లలో భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థిర మూలధనాన్ని ఐదు రెట్లు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా కృషిచేస్తున్నది. ఈ రంగం రైతులకు ఉపాధి, స్థానిక మార్కెట్ ప్రత్యామ్నాయాన్ని అందించడంలో సహాయపడుతుంది. మార్కెట్ ఆధారిత ఉత్తమ పద్ధతులను అమలుచేయడంలో సహాయపడుతుంది. జొమాటో, స్విగ్గీ మొదలైన ఆన్లైన్ ఆహార పంపిణీ సంస్థలతో భారతదేశంలో ఫుడ్ ఆర్డరింగ్ వ్యాపారంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నేడు పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఎక్కువ ఆకర్షితులై, ఈ పరిశ్రమలో ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు చురుగ్గా పాల్గొంటున్నాయి. దాన్ని ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే కీలక పాత్ర పోషిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మక్కజొన్న, మిరప ఉత్పత్తిలో 2వ స్థానంలో, నిమ్మ, ద్రాక్ష, మామిడి, సోయాబీన్ ఉత్పత్తిలో 4వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, 5వ అతిపెద్ద మాంసం ఉత్పత్తిదారుగా ఉన్నది.
నేడు దేశంలో టెక్నాలజీ, హెల్త్కేర్, ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ పరిశ్రమలకు హబ్గా ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు క్రమంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కూడా హబ్గా నిలుస్తున్నది. రాష్ట్రంలో వ్యవసాయం, పశువులు, పౌల్ట్రీ, ఆయిల్పామ్ ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతుండటంతో ఈ ఆహార ఉత్పత్తి రంగాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే భారతదేశ అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ యూనిట్ హట్సన్, ఫ్రెంచ్ రుచులు-పానీయాల సంస్థ జార్జెస్ మోనిన్ సాస్ మొదటి యూనిట్ను తెలంగాణలో
నెలకొల్పాయి.
తడి మక్కజొన్న మిల్లింగ్ ప్లాంట్, ఎగుమతి ఆధారిత ఒలియోరిసిన్, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్, భారతదేశ మొట్టమొదటి సమీకృత మంచినీటి చేపల ఉత్పత్తి యూనిట్ వంటివి తెలంగాణ కేంద్రంగా పని చేస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత రాజన్న సిరిసిల్లలోని ఆక్వా హబ్లో ఉత్పత్తి చేయబడిన చేపలను త్వరలో అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రాజరాజేశ్వర సాగర్ వద్ద రూ.2 వేల కోట్ల పెట్టుబడితో మూడు ప్రైవేట్సంస్థలు ఆక్వా హబ్ ఏర్పాటుచేస్తున్నాయి. బహుళజాతి లులూ గ్రూప్ నుంచి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు దేశంలోనే ఈ రంగంలో ఉన్నతస్థాయిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాం.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఆహారోత్పత్తి యూనిట్ల వృద్ధికి మద్దతు ఇవ్వడంతో పుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్థిరమైన పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డాక తొమ్మిదేండ్లలో ఈ రంగం రూ.6,864 కోట్ల స్థిర మూలధన పెట్టుబడిని, 80 వేల ఉపాధి అవకాశాలను సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,807 యూనిట్లు స్థాపించబడ్డాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం, తెలంగాణ ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, క్లస్టర్ల ఏర్పాటుకోసం కృషిచేస్తున్నది. ప్రస్తుతం 14 ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లున్నాయి. వీటి లక్ష్యం 10 వేల ఎకరాలకు విస్తరణ. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా ఫుడ్ కాన్క్లేవ్ను నిర్వహించడంతో, రాష్ట్రవ్యాప్తంగా రూ.7,218 కోట్ల పెట్టుబడులు, 58,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే 28 ప్రకటనలు వెలువడ్డాయి. రాష్ట్రంలో 2023 మార్చి నాటికి 77 ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలకు 351 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అదనంగా మరో 803 ఎకరాల కేటాయింపు కోసం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి, అలాగే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా పుడ్ ప్రాసెసింగ్ సెంటర్ల అభివృద్ధి జరుగుతున్నది.
క్లస్టర్లతో పాటు, చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, ప్రత్యేకించి స్వయం సహాయక సంఘాలతో కూడిన మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ను ఏర్పాటుచేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆక్వా, డెయిరీ, ఆగ్రో ప్రాసెసింగ్, అనుబంధ రంగాల్లో రాష్ర్టానికి రూ.7000 కోట్లకు పైగా పెట్టుబడులు అందాయని, మొత్తం 58,458 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించామని ఐటీ శాఖ మంత్రి తెలిపారు. దీనికితోడు పరిశ్రమల సైప్లె చైన్ లింకేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని మంత్రి తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడం కోసం, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలు అందడం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యసాధనకు ఈ రంగంలో అనుభ వం కలిగిన పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలను అనుసంధానం చేయనున్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలున్నా యి. ముడిసరుకు సేకరణలో, ఇతరత్రా అంశాల్లో మహిళల సేవలను వినియోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
-డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల
86393 74879