‘మీరు నా మాటలను ఇక్కడే వదిలి వెళ్లకండి. నేను చెప్పిన మాటల్లోని వాస్తవాలను మీ ఊర్లకు వెళ్లాక చర్చకు పెట్టండి. చర్చించాక నిర్ణయం తీసుకోండి’… రైతు సర్కార్ ఏర్పాటు ఎందుకు తక్షణ అవసరమో మహారాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విన్నపం ఇది. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడమే గొప్పని భావిస్తున్న ఇప్పటి రోజుల్లో ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా నచ్చజెప్పడం అసలు గొప్పతనం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వారి ద్వారానే పరిష్కారం కనుక్కోవడం, కార్యాచరణలో వారిని భాగస్వాములను చేయడం ఈ మాటల సారాంశం. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న నాయకుడు అనుసరించాల్సిన విధానం ఇదే.
సరే, మరి ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి? తొలుత తామెవరన్నది తెలుసుకోవాలి. ప్రతివారికి మతం, కులం, ప్రాంతం ఇంకా ఇతర రకాల గుర్తింపులు, అనుబంధాలు ఉంటాయి. సామాజిక, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో వీటి ప్రాధాన్యతను కాదనలేం. కానీ ఉపాధి విషయానికొస్తే చేస్తున్న వృత్తే ప్రధానం. అందుకే రైతులంతా కుల, మత అనుబంధ ప్రాధాన్యతలను పక్కనపెట్టి వ్యవసాయం గురించి మాత్రమే ఆలోచించాలి. ఏ కులం, ఏ మతం వారైనా సరే రైతులంతా ఒక్కటే. వారి సమస్యలన్నీ ఒకటే. తాము తొలుత రైతులం అన్న భావనతో మాటామాటా కలిపితే అనంతరం చేతులు వాటంతట అవే కలుస్తాయి. ఇది ఒక్క రైతుల ఇక్కట్లనే కాదు, సామాజిక ఇబ్బందులనూ తొలగిస్తుంది. సెంటిమెంట్లతో కాలం గడపకుండా సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కారాలను అన్వేషిస్తే నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్టవుతుంది.
తొలుత సాగునీటిని కల్పిస్తే మిగిలిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరుతాయన్నది తెలంగాణ నిరూపించిన సత్యం. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే అది మొత్తం రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తుంది. నదుల జన్మస్థానమైన మహారాష్ట్రలో సాగునీటికి కొరత ఎందుకున్నది? కేసీఆర్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న ఇది. అందుకే ఎక్కడికి వెళ్లినా మొత్తం సాగుభూమి ఎంత? లభించే జలవనరులు, ఎన్ని టీఎంసీలు అన్న వివరాలను ఆయన స్పష్టంగా చెబుతున్నారు. నీటి లభ్యతకు కొరత లేదని, కేవలం దాన్ని పొలాలకు పారించడంలోనే లోపం ఉందని చెబుతున్నారు.
ఈ నిజాన్ని రైతులు గ్రహించారు. ఎక్కడికక్కడ అంతర్రాష్ట్ర జల వివాదాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో పొరుగు రాష్ర్టానికి చెందిన నాయకుడు చెప్పిన మాటలను నమ్ముతారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ అటువంటి వాటికి ఆస్కారమే లేదు. జలవనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయినందునే సమస్యలు వస్తున్నాయి తప్ప నీటి వనరుల కొరత వల్ల కాదు. ఘర్షణ పడే బదులు ఇరుగుపొరుగు రాష్ర్టాలు ఉమ్మడిగా ప్రాజెక్టులు నిర్మించుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయన్నది నిపుణులు, ఇంజినీర్లు చెబుతున్న హితవు.
తెలంగాణ, మరఠ్వాడాల నైసర్గిక స్వరూపం, చరిత్ర కూడా ఒక్కటే. కాబట్టి సహకారం అందించడానికి, గరిష్ఠ ప్రయోజనాలు కలిగేలా నీటి వనరులను పంచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నీటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చో తెలంగాణలో కేసీఆర్ చేసి చూపించారు. కాబట్టే ఆయన మాటలపై విశ్వాసం ఉంటుంది. నైజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యంలో మరఠ్వాడా కూడా ఒక భాగమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే దు. మరఠ్వాడా, తెలంగాణ.. ప్రాంతం ఏదై నా రైతులంతా ఒక్కటే కాబట్టి వారి సమస్యలూ ఒక్కటే. అందువల్ల సహజంగానే సహకారం అందుతుంది. కిసాన్ సర్కార్ ఏర్పాటుకు ఇదే పునాది అవుతుంది.
సమస్యల పరిష్కారానికి రైతులు ఇంకా ఎంతకాలం పోరాడాలి? ముగింపు ఎప్పుడు? అని కేసీఆర్ కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఇందుకు కూడా తెలంగాణ రాష్ట్ర అనుభవాలే సమాధానం చెబుతాయి. నీటి వనరులపై భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా ప్రాంతాలకు నీరు పారింది. గోదావరి, కృష్ణా నదుల నీటిని సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పాత చెరువులను పునరుద్ధరించడం కేసీఆర్ అనుసరించిన వ్యూహం. ఒక్క గోదావరి జలాలే ఏటా 2000 టీఎంసీల మేర సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. వాటిని పొలాలకు మళ్లించే ప్లాన్ ఉండాలేగానీ అసలు జల వివాదాలు ఎందుకు వస్తాయి? గోదావరి నీటిని పల్లపు ప్రాంతమైన కాళేశ్వరం నుంచి ఎగువ ప్రాంతమైన మెదక్కు మళ్లించలేదా? ఇందుకు ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టును నిర్మించలేదా? ఏండ్ల తరబడి జాప్యం చేయకుండా సకాలంలో ఎలా నిర్మించవచ్చో చేసి చూపించలేదా?
ఇదే ప్రయత్నం మరఠ్వాడాలో ఎందుకు జరుగకూడదు? ఈ ప్రశ్నలే మరఠ్వాడా రైతుల ఇండ్లల్లో చర్చనీయాంశాలుగా మారాలి. ఒక్క నీటి వనరులేనా? రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశుపోషణల్లో సాధించిన విజయాలపైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పంట దిగుబడులను లాభదాయకంగా ఎలా మార్కెటింగ్ చేయాలన్నది ప్రస్తుతం రైతుల ముందున్న మరో సమస్య. ఉల్లి పండించిన రైతులు నష్టాలను మూటగట్టుకోవడం మహారాష్ట్రలో నెలకొన్న సమస్య.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల తెలంగాణలోని వరి రైతులకూ ఇబ్బందులే. వీటిపై రైతులు కలిసికట్టుగా కదిలితే మార్గం లభించకపోదు. ఇలాంటి చర్చలే ఆరోగ్యకరమైన సమాజానికి, ప్రజాస్వామ్యానికి అవసరం ఉన్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న నినాదం వెనుక ఇంతటి పరిణతి చెందిన ఆలోచనలు ఉన్నాయి. వీటిని సాకారం చేసే నాయకత్వం ఉందన్న నమ్మకమే మార్పునకు బాటలు వేస్తుంది. భావోద్వేగాల్లో బందీలు కావడమా? సమస్యల మూలాలను గుర్తించి పురోగతిని ఆకాంక్షించడమా? ఏది పరిష్కారాన్ని సాధించి పెడుతుందన్న దాన్ని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ నాయకులు)
గోసుల శ్రీనివాస్యాదవ్
98498 16817