వ్యవసాయ రంగంలో భూమి, విత్తనాల్లో ఎంత నాణ్యత ఉంటే ఆహార పదార్థాలు అంత నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగి ఉంటాయి! ఆహార పదార్థాలు పోషక విలువలు కలిగి ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి. అందుకు కావలసిన సహజ పోషక విలువలను భూమికి రైతు అందించాల్సిన అవసరం ఉన్నది. రసాయనాలను వినియోగించటం వల్ల పర్యావరణపరంగా, భూమి సహజ విలువను కోల్పోతున్నది. దీని నివారణకు సహజంగా లభించే ఎరువులను వినియోగించాలి.
వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాలను ఉపయోగిస్తే పంట దిగుబడి అధికంగా వస్తుంది. కానీ నేడు ఆధునిక వ్యవసాయం పేరుతో సహజ వనరులను, పోషకాలను భూమికి అందించకుండా కేవలం రసాయనిక ఎరువులపైనే రైతు ఆధారపడుతున్నాడు. సాంప్రదాయక వ్యవసాయ విధానంలో ప్రధానమైన భూసారం పెంపుదలకు రైతు పశువుల పేడ, ఆకులు, అలములను భూమిలో వేసి కలియదున్ని భూమిని పోషక విలువలతో కూడిన భూమిగా మార్చడానికి ఎంతగానో శ్రమించేవాడు. ప్రస్తుతం నేలలో సూక్ష్మ పోషకాల లోపం ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా భూమిలో జింకు శాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో మహిళలు ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మహిళలు వయసుకు తగ్గ బరువు లేరని ఇటీవల జరిపిన సర్వే ద్వారా వెల్లడయింది. నీటిలో ఇనుము తక్కువగా ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనతకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు.
ఒక అధ్యయనం ప్రకారం భారత్లోని సాగు భూములు 35 శాతానికి పైగా జింకు, 11 శాతం ఇనుము లోపం కలిగి ఉన్నాయి. ఇది ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ అధ్యయన బృందం దేశవ్యాప్తంగా 2.7 కోట్ల భూసార పరీక్షల వివరాలను సేకరించింది. అలాగే దాదాపు 3 లక్షల మంది పిల్లలు, 10 లక్షల మంది మహిళల ఆరోగ్య వివరాలను విశ్లేషించింది. దీని ప్రకారం సూక్ష్మ పోషకాల లోపం వల్ల పిల్లల తెలివితేటలు, నైపుణ్యాలు, రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపైన ప్రతికూల ప్రభావం చూపుతున్నదని వెల్లడైంది.
రక్తహీనత సమస్య అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దేశీయంగా 15-49 మధ్య వయసు మహిళల్లో 35 శాతం మంది, ఐదేండ్ల లోపు పిల్లల్లో 58.5 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి స్థూల పోషకాలతోపాటు సూక్ష్మ పోషకా లు సైతం అవసరం. ఇవి మొక్కలకు జీవ రసాయన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇనుము, మాంగనీసు, జింకు, బోరాన్, క్లోరిన్, నికెల్ మొదలైనవి సూక్ష్మ పోషకాలు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు జనా భా ఈ లోపాన్ని ఎదుర్కొంటున్నది. భారతదేశంలో రక్తహీనతకు ప్రధాన కారణం ఇనుము లోపమే. నేల ఆరోగ్యం అందులో పోషక పదార్థాలను మెరుగుపరచడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. భూముల్లో వాటిని పెంచడానికి సేంద్రియ కంపోస్టు ఎరువులను వినియోగించాలి. పచ్చిరొట్ట ఎరువులను అధికంగా వాడాలి. ఈ ప్రక్రియ దీర్ఘకాలం పాటు కొనసాగించాలని నిపుణులు చెప్తున్నారు.
దీర్ఘకాలం ఒకే పంట సాగు వంటి కారణాలతో నేల సూక్ష్మ పోషకాలను నష్టపోతుంది. ఈ క్రమంలో వ్యవసాయ భూముల్లో సూక్ష్మ, స్థూల పోషకాల సమతుల్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పోషకాలు ఉంటేనే పైరు ఆరోగ్యంగా ఉండి మేలైన దిగుబడులు సాధ్యమవుతాయి. నేల నమూనాలను పరీక్షించడం ద్వారా సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించవచ్చు.
హరితవిప్లవం కారణంగా వ్యవసాయ రంగంలో ఇండియా ఎంతో ప్రగతిని సాధించింది. అదే క్రమంలో రసాయనిక ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దానివల్ల నేల తన సహజ గుణాలను కోల్పోతున్నది. పెట్టుబడి వ్యయం అధికమవుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో సమగ్ర భూసార పరిరక్షణ ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇందులో సేంద్రీయ ఎరువుల వాడకం ప్రధానమైనది. వీటివల్ల వాతావరణ కాలుష్యం ఉం డదు. పంటలకు ఏ విధమైన నష్టమూ జరగదు. రైతులు తమ పొలాల్లో ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భారత్లోని మొత్తం 29 శాతం సాగుభూమి భూసార క్షీణతకు గురవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్షీణత ఇలాగే కొనసాగితే మరో 60 ఏండ్లలో భూమి సాగుకు పనికిరాకుండా పోయే ప్రమాదమున్నది. ఇది ఆహార భద్రతకు పెను ప్రమాదంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఆహార పదార్థాలలో పోషక విలువలు లేకపోవడం వల్ల మానవాళిపై తీవ్రమైన ప్ర భావాన్ని చూపుతున్నది. ఈ క్రమం లో భూ మి క్షీణతను అరికట్టడంతో పాటు నేలలో సూక్ష్మ పోషకాల పెంపునకు చర్యలు తీసుకోవాలి. నేల ఆరోగ్యాన్ని పెంచే పద్ధతులను అవలంబించాలి. దానివల్ల దిగుబడులు పెంచడమే కాకుండా ఆహార పదార్థాలలో నాణ్యతను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని పర్యావరణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ము ఖ్యంగా భారతదేశంలో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి సాధ్యం కాకపోవడం వల్ల రానున్న రోజుల్లో ఆహార భద్రత విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆకలి చావులు తప్పవని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. సుస్థిర వ్యవసాయ విధానాన్ని కొన్ని రాష్ర్టాలు మాత్రమే అనుసరిస్తున్నాయి. సుస్థిర వ్యవసాయాన్ని అమలు చేయలేనిపక్షంలో ఆహార భద్రత కష్టమేనని అఖిలభారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసీఏఆర్- ఐ కార్) అభిప్రాయపడింది.
కొన్ని రాష్ర్టాలు సామాజిక ఆర్థిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్న వ్యవసాయ సుస్థిరత సూచికలకు వచ్చేసరికి వెనుకబడుతున్నాయని ఐసీఏఆర్ వెల్లడించింది. పంజాబ్, హర్యా నా సామాజిక ఆర్థికాలలో ముందంజలో ఉన్నప్పటికీ వ్యవసాయ సుస్థిరత సూచిని పరిశీలించినప్పుడు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది.
సుస్థిర వ్యవసాయాభివృద్ధి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నట్టు ఐకార్ వెల్లడించింది. వీటిలో సారవంతమైన నేల, నీటి వనరు లు, జీవవైవిధ్యం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమతుల్యత తదితర సూచికలు ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజా బ్, బీహార్, హర్యానాలతో పాటు వరి పండించే జార్ఖండ్, అస్సాం రాష్ర్టాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు ఐకార్ వివరించింది.ఇక్కడ వ్యవసాయ విధానాలలో మార్పులు అత్యవశ్యకమని హెచ్చరించింది.
దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఆధునిక శాస్త్రీయ ప్రణాళిక రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో ప్రపంచ దేశాలు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను అనుసరించాల్సిన అవసరం ఉన్నది.