ఎన్నికల్లో డబ్బులు పంచడాన్ని ఓటర్లు తమ హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇస్తే తప్ప ఓటు వేయననే పరిస్థితి వచ్చింది. అది కూడా పదోపరకో ఇస్తే పుచ్చుకునే ప్రసక్తేలేదని తిరస్కరిస్తూ..ఫలానా ఎన్నికలలో ఇంత ఇచ్చారు...ఫలానా చోట అంత ఇచ్చారని రేట్లు కనుక్కొని మరీ డిమాండ్ చేస్తున్నారట.
ఎన్నికల్లో డబ్బులు పంచడాన్ని ఓటర్లు తమ హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇస్తే తప్ప ఓటు వేయననే పరిస్థితి వచ్చింది. అది కూడా పదోపరకో ఇస్తే పుచ్చుకునే ప్రసక్తేలేదని తిరస్కరిస్తూ..ఫలానా ఎన్నికలలో ఇంత ఇచ్చారు…ఫలానా చోట అంత ఇచ్చారని రేట్లు కనుక్కొని మరీ డిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ తక్కువిస్తే, ఎవని ముక్కుల పెడుతవు… ఎవని పెండ్లికి ఇస్తవు….పుణ్యానికి ఇస్తున్నవా? అని నిష్ఠూరంగా మాట్లాడటం టీవీలో చూశాం. మరీ విడ్డూరమేమిటంటే డబ్బుల కోసం అభ్యర్థులను ఘెరావ్ చేసిన ఉదంతాలూ జరిగాయి. ఒక ఊర్లో అయితే తమకు ఏ పార్టీ డబ్బులు పంచలేదన్న కోపంతో ఊరుఊరంతా ఏకమై ర్యాలీగా వెళ్లి ‘నోటా’కు ఓటు వేసి వచ్చారు. ఇలా ఉంటే ఉపఎన్నికలు జరిగిన చోట్ల మరో విచిత్రమైన పరిస్థితి. హుజూరాబాద్, మునుగోడులో రెండేండ్లు, ఏడాది టర్మ్కే ఓటుకు 6 వేలు ఇస్తే, ఐదేండ్ల టర్మ్కు 5 వందలే ఇస్తావా? అని ముఖం మీదనే జనాలు డబ్బులు విసిరికొట్టారట. ఎంతైనా ఆ గోల్డెన్ డేస్ మళ్లీ రావు…ఇంటింటికి మందు, చికెన్, మటన్…వేలలో డబ్బులు… అంటూ అప్పటి వారు ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సుమాలు అంటూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లారట.
ఏ పార్టీకి ఓటేశావు షర్మిలక్కా?
క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు షర్మిలక్క ప్రకటించినప్పటికీ జనాలు మాత్రం ఆమెను ఓ పట్టాన వదిలిపెట్టడం లేదు. పోలింగ్ రోజు ఓటు వేసిన ఫొటో ఆమె సోషల్ మీడియాలో ఇలా పోస్టు చేసిందో లేదో కాచుకు కూర్చున్న నెటిజన్లు కయ్యిమని లేచారు. ఇంతకు ఏ పార్టీకి ఓటేశావక్కా? అని నిలదీసారు. ఓహో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ముందే ప్రకటించావు కదా, దానికే వేసి ఉంటావు లే అన్నారు. మరి కొందరైతే ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఉండి ఇంకో పార్టీకి ఓటు వేయడం ఏమిటి? అని నిలదీశారు. నీ కంటే బర్రెలక్క నయం…ధైర్యంగా ఎన్నికలలో పోటీ చేసింది అంటూ మరి కొందరు దెప్పిపొడిచారు. మేడమ్ను ఎన్ని అయినా అనండి… కానీ ఆ బర్రెలక్కతో మాత్రం పోల్చకండి ప్లీజ్ అని జై షర్మిలక్క బ్యాచ్ రిక్వెస్టు చేయడం కొసమెరుపు.
30 రోజుల్లో కన్నడ
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కన్నడ కష్టాలు ఇప్పట్లో పోయేటట్టు కనిపించడం లేదు. కన్నడనాట ఆ పార్టీని నమ్మి ఓటువేసిన ప్రజలు పడుతున్న కష్టాలు తెలంగాణ ఎన్నికలలో ప్రచారాస్ర్తాలుగా మారాయి. ఎన్నికల తర్వాత కూడా లోక్సభ ఎన్నికల దాకా తెలంగాణ నేతలు ఢిల్లీలో హైకమాండ్ వయా కర్ణాటక సబ్కమాండ్ ప్రసన్నం చేసుకోకతప్పదు. అక్కడి నాయకులేమో కన్నడ తప్ప ఇంకో భాష మాట్లాడటం లేదు. సీఎం సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కన్నడంలోనే మాట్లాడారు. డీకే శివకుమార్ కూడా ఎక్కువగా కన్నడే మాట్లాడుతారు. దీంతో తాము చెప్పదలుచుకున్నది వారికి అర్థమయ్యేలా చెప్పాలంటే, కన్నడ భాష రావడం అనివార్యంగా మారిందని గాంధీభవన్లో నాయకుల మధ్య చర్చ. కొందరి కార్లలో ఇప్పటికే ‘30 రోజులలో కన్నడం’ పుస్తకాలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు.