ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవటానికి నిప్పు కోసం మరొకడు వెతికాడని సామెత. కరోనా సమయంలో సరిగ్గా ఇదే జరిగింది. ప్రపంచమంతా కొవిడ్ మహమ్మారితో తల్లడిల్లుతున్న సమయంలో ధనవంతులు మాత్రం మరింతగా లాభాలు పోగేసుకున్నారు. ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్'(బాధల నుంచి లాభార్జన) పేరిట ఇటీవల విడుదలైన ‘ఆక్స్ఫామ్’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ఆర్థిక అసమానతలను పెంచిందని తెలిపింది. కరోనా కాలంలో 573 మంది కొత్త కుబేరులు అవతరించారని వెల్లడించింది.
కరోనా కాలంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2022లోనే 26 కోట్ల 30 లక్షల మంది కటిక పేదరికంలోకి కుంగిపోయారు. అంటే.. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది కడుపేదలయ్యారు. నాలుగు సెకన్లకు ఒకరు మృత్యువాత పడ్డారు. అయితే బిలియనీర్లు మాత్రం అటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఇటు ధనాన్ని పోగేసుకున్నారు. ఒక బిలియనీర్ తయారైన సమయంలో పది లక్షల మంది ప్రజలు కటిక పేదలుగా మారారని ‘ఫోర్బ్స్ ధనవంతుల జాబితా 2020, 2022’లను విశ్లేషించి ‘ఆక్స్ఫామ్’ నివేదిక తెలియజేసింది.
ఫోర్బ్స్ ధనవంతుల జాబితా ప్రకారం.. 2020లో భారతదేశంలో 102 మంది బిలియనీర్లున్నారు. ఆ తర్వాత రెండేండ్లలో కరోనా విజృంభించి, సద్దుమణిగిన 2022 నాటికి ఆ సంఖ్య 166కు పెరిగింది. ‘ఆక్స్ఫామ్’ అధ్యయనం ప్రకారం.. మనదేశంలో గత రెండేండ్లలో (కరోనా కాలంలో) ప్రతి 11 రోజులకు ఒక బిలీయనీర్ అవతరించాడు. ఈ క్రమంలోనే.. అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశాలు అమెరికా, చైనా తర్వాత భారత మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో.. పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రూపొందించిన ‘ప్రపంచ అసమానతల నివేదిక-2022’.. ‘ప్రపంచంలోనే అత్యంత అసమానతలున్న దేశాల్లో భారత్ ఒకటి’ అని పేర్కొనటం గమనార్హం.
భారతీయ ధనవంతుల్లో అగ్రభాగాన ఉన్న మొదటి ఒక్క శాతం బిలియనీర్ల వద్ద మొత్తం దేశ ఆదాయంలో 22 శాతం ఉన్నదని ఈ నివేదిక తెలిపింది. టాప్ 10 శాతం ధనవంతుల వద్ద 57 శాతం సంపద పోగుపడి ఉన్నదని తెలిపింది. అల్పాదాయ వర్గాలకు చెందిన 50 శాతం ప్రజల వద్ద కేవలం 13 శాతం ఆదాయం మాత్రమే ఉన్నది. ఆర్థిక అంతరాలు ఈ స్థాయిలో నెలకొని ఉండగా.. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ మాత్రం కరోనా కాలంలో భారత దేశంలో కటిక పేదరికం తగ్గిందని తమ అధ్యయనాల్లో తెలుపటం గమనార్హం.
ప్రపంచ జనాభాలో 40 శాతంగా ఉన్న అత్యంత నిరుపేదల (316 కోట్ల మంది) వద్ద ఉన్న సంపద కన్నా, పది మంది అతిపెద్ద బిలియనీర్ల దగ్గర ఉన్న సంపద ఎక్కువ అని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచ జనాభాలో 99 శాతం మంది ప్రజల ఆదాయం పడిపోయింది. గత ఏడాది 12 కోట్ల 50 లక్షల మంది ఫుల్టైమ్ ఉద్యోగాలను కోల్పోయారు. ఇదిలా ఉండగా, కరోనా కాలంలో ఆహారం, ఔషధ తయారీ, నూనె ఉత్పత్తి రంగాలు విపరీతంగా లాభాలు పోగేసుకున్నాయి. ఈ మహమ్మారి ఔషధతయారీ రంగంలోనే కొత్తగా 40 మంది బిలియనీర్లను సృష్టించింది. వ్యాక్సిన్ల తయారీ, వైద్య చికిత్స, వైద్య పరీక్షలు వంటి రంగాల్లో తమ కంపెనీలకు ఉన్న గుత్తాధిపత్యం కారణంగా మరో 98 మంది అమితంగా లాభపడ్డారు. ఫార్మా రంగంలో అత్యధికంగా లాభాలు గడించి, అత్యంత సంపన్నుడిగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా నిలిచారు. కరోనా విజృంభించిన రెండేండ్ల కాలంలో ఆయన సంపద 217 శాతం పెరిగి, 2600 కోట్ల డాలర్లకు చేరుకుంది.
కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని కేంద్రబ్యాంకులు లక్షల కోట్ల డాలర్లను ఆర్థికవ్యవస్థలోకి కుమ్మరించి, ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషిచేశాయి. ఇది అత్యవసరమే. లేదంటే.. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. కానీ ఈ పరిణామంతో.. ఆస్తుల విలువ అనేక రెట్లు పెరిగిపోయి కుబేరులు మరింత సంపన్నులుగా మారారని ఆక్స్పామ్ నివేదిక తేటతెల్లం జేసింది. ఈ విపరిణామాల నుంచి దేశాలు బయటపడాలంటే.. ఆర్థిక అంతరాలను తగ్గించటం ఒక్కటే మార్గం. బిలియనీర్లపై కచ్చితమైన, శాశ్వతమైన పన్నులు మరింతగా వేయాలని ప్రభుత్వాలకు ‘ఆక్స్ఫామ్’ నివేదిక సూచించింది.
-ఎడిటోరియల్ డెస్క్