2021, నవంబర్.. రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇందిరా పార్క్లో ధర్నాకు దిగారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఉగ్రరూపాన్ని చూసిన కేంద్రం తెల్లవారేసరికి వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గుతూ ప్రకటన చేసింది. ఇది కేంద్రం మీద కేసీఆర్ సాధించిన తొలి విజయం.
ఇటీవల.. జాతీయ రాజకీయాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఇలా అడుగువేశారో లేదో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వణుకు పుట్టింది. దెబ్బకు దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో అసలేం జరుగుతున్నదని ఎవరైనా అడిగితే బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని నిక్కచ్చిగా చెప్తున్నారు. ప్రధానిగా మోదీ చేయలేని ఎన్నో పనులను ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణలో చేసి చూపించారు. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టి గొప్పలకు పోతున్నది.
దేశం కోసం ఎంతవరకైనా కొట్లాడుతానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల ఢిల్లీలో అడుగు పెట్టారు. వ్యవసాయ నల్ల చట్టాలపై నిరసన తెలుపుతూ కేంద్రంలోని బీజేపీతో శాంతియుతంగా పోరాడుతూ మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. ఇటు భారత్-చైనా సరిహద్దులో జరిగిన గల్వాన్ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం నేరుగా అందజేశారు. అలాగే దేశవ్యాప్త నాయకులను కలుపుకొని ప్రత్యామ్నాయ అజెండా రూపకల్పనకు కేసీఆర్ ముందుకు కదులుతుంటే బీజేపీకి మింగుడు పడటం లేదు. అందుకే కేంద్రంలోని బీజేపీ నాయకులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్పై అవాకులు, చవాకులు పేలుతున్నారు.
ఇవేం లెక్కచేయకుండా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అనేకమంది మేధావులు, జాతీయ నాయకులు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి క్యూ కడుతుండటంతో కేంద్ర ప్రభుత్వానికి గుబులు పుడుతున్నది. కేసీఆర్ మరో సంచలనం సృష్టించబోతున్నారనే విషయం బీజేపీకి అవగతమైంది. అందుకే ఆగమేఘాల మీద పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ప్రకటన వెలువరించింది. ఏదేమైనా జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్. కేసీఆర్ ఏం చేయబోతున్నారంటూ జాతీయ మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
నాతోటి భరతమాత ముద్దు బిడ్డల్లారా..! కేసీఆర్ రైతు పక్షపాతి, రైతు బాగుండాలని, గొప్పగా ఉండాలని తపించే నాయకుడు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు మాత్రం రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి. దేశ ప్రజలు నిజానిజాలు గ్రహించాలి. ఎవరి నాయకత్వంలోనైతే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుందో గ్రహించాలి. కాబట్టి దేశాభివృద్ధి కోసం పరితపిస్తున్న కేసీఆర్ అడుగులో అడుగై ఉద్యమ తరంగంలా మనమంతా ఆయన వెంట నడువాల్సిన సమయం ఆసన్నమైంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
చిటుకుల మైసారెడ్డి
9490524724