రెక్కలు ముక్కలు చేసుకొని, ఆరుగాలం కష్టపడుతూ దేశానికే అన్నం పెడుతున్న రైతాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నరు. వారి సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, రుణమాఫీ, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తున్నారు. రైతు ఆకస్మికంగా మరణిస్తే ఆ రైతు కుటుంబం ఇబ్బందులు పడకుండా రైతుబీమాను అందిస్తూ ఆర్థిక సాయం అందిస్తున్నరు.
తెలంగాణ ప్రభుత్వం రైతుపక్షపాతిగా వ్యవహరిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతాంగం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వారి పోరాటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా మద్దతు పలికారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమిస్తున్న 750 మందికి పైగా రైతుల ప్రాణాలను బలిగొన్నది. ఉత్తరప్రదేశ్లో రైతులు ధర్నా చేస్తుంటే వాళ్ల పైకి కార్లు ఎక్కించి నలుగురు రైతుల్ని పొట్టన పెట్టుకున్నది అక్కడి బీజేపీ ప్రభుత్వం. ఆఖరికి రైతుల ఆందోళనలకు వెనక్కు తగ్గిన ప్రధాని మోదీ తమ లోపాలను గుర్తించి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కుటుంబాలను కనీసం పరామర్శించలేదు. అమరులైన రైతు కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించలేదు. పైగా రైతులు మరణించినట్లు మా రికార్డుల్లో లేవని, వారికి ఎటా ్లఆర్థిక సహాయం చేస్తామని పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించడం యావత్ రైతాంగాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకువచ్చి తాను రైతుపక్షపాతిని అని మరోసారి నిరూపించుకున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశం కేసీఆర్ను నికార్సయిన రైతుబిడ్డ అని గుర్తించింది. మరోవైపు దేశం కోసం అహర్నిశలు రక్షణగా ఉంటూ, శత్రుమూకల పన్నాగంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను కేసీఆర్ గౌరవించిన తీరు అద్భుతం, అద్వితీయం. 2019లో పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులైనప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నారు. భారత్- చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి కేసీఆర్ బాసటగా నిలిచారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో స్వయం గా కల్నల్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపా రు. వారి కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్థిక సాయం, హైదరాబాద్లో 700 గజాల ఇంటిస్థలం కేటాయించారు. ఆయన భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగం కల్పించడం అభినందనీయం. అలాగే కల్నల్ సంతోష్ బాబుతో పాటు అమరులైన ఇతర రాష్ర్టాలకు చెందిన సైనిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించటం హర్షణీయం.
దేశ రక్షణకు అసమాన ధైర్యసాహసాలతో పోరాడి వీరమరణం పొందిన సంతోష్ బాబుకు మహా వీరచక్ర అవార్డు లభించడం తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణం. దేశ రక్షణలో అమరులైన జవాన్లను, ఉద్యమాల్లో మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం కేసీఆర్ మానవతకు నిదర్శనం. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుండటంతో ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఆయన హృదయం గొప్పదని అభివర్ణిస్తున్నారు.
డాక్టర్ ,బొల్లికొండ వీరేందర్
98665 35807