‘తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే..’ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి.. అసలు హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రాలో కలిపింది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తెలంగాణను ఏపీలో కలిపిన పాపానికి అసువులు బాసిన అమరుల ఉసురు తగిలినందునే కాబోలు ఆ పార్టీ ఇప్పుడు సుప్తచేతనస్థితిలోకి చేరుకున్నది.
స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తే మా రాష్ట్రం మాకిచ్చి, చేసిన పాపానికి కాంగ్రెస్ ప్రాయశ్చిత్తం చేసుకున్నది. అంతే తప్ప ఇందులో ఆ పార్టీ చేసిన త్యాగం ఏమీ లేదన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్ ‘తెలంగాణ తెచ్చింది మేమే… ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవటం క్షేత్రస్థాయిలో ఆ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నది. ‘రైతు సంఘర్షణ’ పేరుతో వరంగల్లో సభ నిర్వహించడం వరకు ఆ పార్టీ పరిమితమైతే తెలంగాణ సమాజానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ సభ పేరుతో రాద్ధాంతం చేయటం పట్ల తెలంగాణ ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి.
1956కు ముందే ఆర్థికంగానూ, అభివృద్ధిలోనూ సుభిక్షమైన హైదరాబాద్ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఆంధ్రాలో విలీనం చేసింది. ఆ తర్వాత కాలంలో అనేక వివక్షల కు, అవమానాలకు లోనైన తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. అయినా కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హృదయం కరగలేదు. 1969లో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని రక్తపుటేర్లలో ముంచింది. చివరికి కేసీఆర్ సారథ్యంలో జరిగిన మలిదశ ఉద్యమంతో తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితుల్లో, దిగివచ్చిన కేంద్రం తెలంగాణను ప్రకటించింది. అంతేతప్ప కాంగ్రెస్ తనకుతాను ఇచ్చింది కాదు. అందుకే రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏనాడూ కాంగ్రెస్ను విశ్వసించలేదు. కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా పార్టీ ఉనికిని నిలబెట్టాలన్న సంకల్పంతో కొత్తగా వచ్చిన పీసీసీ నేత తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. ప్రజల్లో ఏ మాత్రం విశ్వసనీయత కల్పించడం లేదు.
1969లో తొలిదశ, 2001లో మొదలైన మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు తీసిన పాపం మీది కాదా అంటూ విద్యార్థి లోకం నిలదీస్తే ఏం చెప్తారు? హైదరాబాద్తో సంబంధం లేని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం అసెంబ్లీ ఎదుట ఎందుకు? అదే స్థానంలో హైదరాబాద్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం 1956లో సీఎం పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించలేదంటే కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? ఆడపిల్లలకు చదువుకోవాలంటూ మొట్టమొదటి బాలికల ఉన్నత పాఠశాలను నెలకొల్పిన మాడపాటి హనుమంతరావు, దళితులకు విద్యను అందించిన భాగ్యరెడ్డివర్మ విగ్రహాలను మీ ప్రభుత్వాల హయాంలో ట్యాంక్బండ్ మీద ఎందుకు నిలబెట్టలేదు అని నిలదీస్తే కాంగ్రెస్ జవాబు ఏమిటి?
‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్న వాదనకు దిగితే కాంగ్రెస్ ఒక్కసారి గతంలోకి తొంగిచూడాలి. రాజకీయాలే వద్దు బాబు అంటూ పారిపోయిన నేతకు ఖద్దరు తొడిగి, పార్టీ నాయకుడిగా బలవం తంగా నిలబెట్టుకుంటూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీని నమ్మేదెవరు? కాబట్టే.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాకుండా, తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్కు, సాధించిన నేతగా సీఎం కేసీఆర్కు మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుందన్నది ముమ్మాటికి నిజం. డిసెంబర్ 9 అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన అనంతరం, కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘యూ టర్న్’ తీసుకోకుంటే ఫలితం ఎలా ఉండేది అన్నది ఊహాజనితమే. ‘యూ టర్న్’ తీసుకున్నారు కాబట్టే.. రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందన్నది నిర్వివాదాంశం.
తెలంగాణ గడ్డమీద 1956లో పుట్టినోళ్లు 1969 నాటికి జై తెలంగాణ అన్నరు. 1969లో పుట్టినోళ్లు 20 ఏండ్లు వచ్చేసరికి మా రాష్ట్రం మాకే కావాలన్నరు. దీనిని ఆసరాగా చేసుకొని, తెలంగాణ రాష్ట్ర సాధన అనే డిమాండ్ పునాదుల మీదనే కాంగ్రెస్ నేతలంతా రాజకీయ భవంతులు నిర్మించుకున్నరు, కానీ తెలంగాణ అస్తిత్వ, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం చేసిందేమీ లేదు. చివరికి తెలంగాణవాదులు, రచయితలు, మేధావుల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా భువనగిరి కేంద్రంగా ‘దగా పడ్డ తెలంగాణ’ సభ నిర్వహిస్తే జనం బ్రహ్మరథం పట్టారు. ఈ మొత్తంలో అర్థమయ్యేదేమంటే.. ప్రజల గుండెల్లో తెలంగాణ భద్రంగా ఉన్నది. అందుకే ఎవరెన్ని ఎజెండాలతో వచ్చినా, ఏ రంగు జెండాలతో వచ్చినా ‘జై తెలంగాణ’ అంటే అక్కున చేర్చుకున్నరు.
1969 నుంచి 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా.. తెలంగాణ ప్రజల ఉసురు, విశ్వవిద్యాలయాల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ ఓయూ విద్యార్థులకు ఏం చెప్తుంది? కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి వైఎస్ దాకా తెలంగాణ కోసం ఏం చేశారో ఆ పార్టీ చెరిపేయాలనుకుంటున్నదా? తెలంగాణ ఉద్యమవ్యాప్తికి ఆయువుపట్టుగా నిలిచిన ఉస్మానియా విద్యార్థులు ఎదురు ప్రశ్నలతో నిలదీస్తే ఏం సమాధానం చెప్తారు? దీనికి రాహుల్గాంధీ దగ్గర జవాబు ఉన్నదా?
‘రాజకీయ పునరావాస కేంద్రమే తెలంగాణ ఉద్యమం’ అంటూ స్వరాష్ట్ర ఉద్యమాన్ని బలహీనపర్చటానికి సీమాంద్ర మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ కేసీఆర్ దీక్షాదక్షతల ముందు వారి పప్పులేం ఉడకలేదు. ఆరు దశాబ్దాలుగా గూడు కట్టుకున్న స్వరాష్ట్ర ఆకాంక్షను కేసీఆర్ మహత్తరమైన ఉద్యమంగా మలిచారు. యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటిమీదికి తెచ్చారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించారు. తెచ్చుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చేసి చూపుతున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్పైనో, కేసీఆర్ పైనో విమర్శలతో రాజకీయ ఉనికి నిలుపుకొనే ప్రయత్నాలు చేస్తే అవి బెడిసికొట్టడం ఖాయం. పైగా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? అన్నది ఎజెండా ఎంతమాత్రం కాబోదు. కపట రాజకీయ రాద్ధాంతానికి తెలంగాణలో తావు ఉండబోదు.
ఇప్పటికిప్పుడు వరంగల్లో నిర్వహించిన రాహుల్ సభతో కాంగ్రెస్ సాధించేదేమీ ఉండదు. ఆ సభ పేరును ‘రైతు సంఘర్షణ సభ’గా చెప్పుకొన్నప్పటికీ అది ’కాంగ్రెస్ నాయకత్వ సంఘర్షణ సభ’గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందంటే ఆ పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉన్నదో అవగతమవుతుంది. ఎప్పుడెవరు ఉంటారో, ఎవరు ఎటుపోతారో తెలియక చుక్కాని లేని నావలా ఒడ్డుకు ఎలా చేరాలో తెలియని సందిగ్ధంలో ఉన్నది తెలంగాణ కాంగ్రెస్.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
బాబు ఆర్కే
99120 09999