ప్రజాస్వామ్యంలో ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వం అత్యంత ప్రధానమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూల స్తంభాలలో న్యాయవ్యవస్థ ఒకటి. దేశంలో వివిధ న్యాయస్థానాల్లో కోట్ల కొలది కేసులు పెండింగ్లో ఉన్నాయి.ఈ కేసులు ఎప్పుడు పరిష్కారమవుతాయోనని కక్షిదారులు ఎదురుచూస్తున్నారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జికోర్టు, జిల్లా కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఏండ్లకేండ్లు పడుతున్నది. కక్షిదారులకు న్యాయఫలాలు ఎంత కాలానికి అందుతాయో చెప్పలేనంత అయోమయ స్థితి ఉండటం విషాదం.
న్యాన్యాయం కోసం బాధితులు కోర్టులకు వెళ్లేవిధంగా సత్వర న్యాయ ప్రక్రియకు చర్యలు చేపట్టాలనే ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నది. దీనికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో 23 కొత్త జిల్లాల్లో సైతం జిల్లా జ్యుడీషియల్ కోర్టులను ఏర్పాటు చేయటం ప్రశంసనీయం. ప్రభుత్వ వినతి మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పాత పది జిల్లాలతో పాటు నూతనంగా ఏర్పడిన 23 జిల్లాలను సైతం పరిగణనలోకి తీసుకొన్నది. దాంతో మొత్తం 33 జ్యుడీషియల్ జిల్లాలకు ఆమోదం తెలిపింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న కేసులను కొత్త జిల్లాలకు బదిలీ చేసింది. కొత్త జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణానికి 179 ఎకరాల భూమిని కూడా కేటాయించి, నూతన కోర్టు కాంప్లెక్స్లను నిర్మించాలని నిర్ణయించింది. నూతన జిల్లా కోర్టుల్లో భవనాలు, మౌలిక వసతులను కల్పించటంతోపాటు ఉద్యోగుల నియామకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.
తమ హక్కులు, గౌరవానికి గుర్తింపు, రక్షణ ఉన్నదని ప్రజలు భావించటం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి తప్పనిసరి. వివాదాలను త్వరిత గతిన పరిష్కరించటం ప్రజాస్వామ్య ముఖ్యలక్షణం. వివాదాల సత్వర పరిష్కారం కోసం, తరచూ మానసిక ఒత్తిడిలో ఉండే కక్షిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించటానికి న్యాయవ్యవస్థకు పునాదైన జిల్లా స్థాయి న్యాయవ్యవస్థ కృషి చేయాలి. దీనికోసం నూతన జిల్లాల్లో జిల్లా స్థాయి జ్యుడీషియల్ కోర్టులు ఏర్పాటు చేయటం ఉత్తమ నిర్ణయం. ఈ నేపథ్యం లోనే వినియోగదారుల కమిషన్ల విషయంలో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహించడం గమనార్హం. ఇందులో పనిచేసే అధ్యక్షులకు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలకు సమానంగా, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయమూర్తులకు సమానంగా వేతనాలు పెంచింది.రాష్ట్రస్థాయిలో సభ్యులకు అడిషనల్ సెక్రటరీ, జిల్లా స్థాయి సభ్యులకు డిప్యూటీ సెక్రటరీ స్థాయి వేతనాలను నిర్ణయించిం ది.
జిల్లా స్థాయిలో వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటికి అదనపు భవన నిర్మాణాలకు నిధులు మంజూ రు చేసింది. మీడియేషన్ సెంటర్ల నిర్వహణ కోసం విశ్రాంత న్యాయమూర్తుల, న్యాయవాదుల, ఇతర రంగాల అనుభవజ్ఞుల, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండే ఈ మీడియేషన్ సెంటర్లు కేసుల నమోదుకు ముందే వివాదాల పరిష్కారానికి కృషి చేస్తాయి. వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం-2019 ప్రకారం- రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 23 జ్యుడీషియల్ జిల్లాల్లోని భవన ప్రాంగణాల్లో జిల్లా కోర్టుల వలెనే వినియోగదారుల కమిషన్లను సైతం ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం నూతన జిల్లా కమిషన్ల ఏర్పాటుకు, భవన సముదాయాల నిర్మాణానికి, భౌతిక మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగించుకొనే అవకాశం ఉన్నది. కాబట్టి నూతన జిల్లాల్లో వినియోగదారుల కమిషన్లను ఏర్పాటు చేయాలి.
పది పాత జిల్లా కేంద్రాలలో వినియోగదారుల కమిషన్లలో పనిభారం ఎక్కువగా ఉన్నది. అందువల్ల జిల్లా వినియోగదారుల కమిషన్లలో సైతం రెగ్యులర్ సిబ్బంది నియామకం, భౌతిక, మానవ వనరుల కల్పన పట్ల ప్రభు త్వం చొరవ చూపాలి. తద్వారా సామాన్యులకు, వినియోగదారులందరికీ సత్వర న్యాయం అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో జిల్లా వినియోగదారుల కమిషన్లన్నీ సమర్థవంతంగా వినియోగదారుల కేసుల సత్వర పరిష్కారానికై నిరంతరం కృషిచేయాలి. జిల్లా, రాష్ట్ర వినియోగదారుల కమిషన్లలో వెంట వెంటనే సభ్యుల్ని, అధ్యక్షులను నియమించటం ప్రశంసనీ యం. రాష్ట్ర ప్రజల్లోని చైతన్యం వల్ల వినియోగదారుల కమిషన్లలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. అందువల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా సత్వర న్యాయం పొందేందుకు కొత్త జిల్లాల వారీగా నూతన జిల్లా వినియోగదారుల కమిషన్లను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఇందులో సైతం దేశానికి ఆదర్శంగా ఉండాలి.
(వ్యాసకర్త: డిప్యూటీ డైరెక్టర్ టీఎస్ టెట్ (రిటైర్డ్) హైదరాబాద్)
డాక్టర్ అనభేరి
రాజేశ్వరరావు