ఎస్బీఐ పరిశోధన బృందం ఇటీవల ప్రచురించిన ‘వ్యవసాయంపై ప్రత్యేక నివేదిక’ సత్యదూరమని భారతదేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై కనీస అవగాహన ఉన్నా అర్థమవుతుంది. ఎస్బీఐ తమ నివేదికలో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో 2018తో పోలిస్తే కొన్ని పంటలలో రైతు రాబడి 2022 నాటికి రెట్టింపయ్యిందని పేర్కొన్నది. సోయా, కాటన్, రాగి, జొన్నపంటల రాబడి రెట్టింపయినట్టు ప్రకటించింది.
2014, 2022లలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు గమనిస్తే ఎస్బీఐ వారు ప్రకటించిన పట్టికలో రాగులు తప్ప ఏ పంటకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రెట్టింపు కాలేదని ప్రస్ఫుటమవుతున్నది.
రైతులకు కనీస మద్దతు ధర 2014తో పోలిస్తేనే రెట్టింపు కానప్పుడు రైతు ఆదాయం 2018తో పోలిస్తే కొన్ని పంటలలో రెట్టింపైందని ఎస్బీఐ వారు చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నది. కనీస మద్దతు ధరల పెరుగుదల పట్టిక గమనిస్తే అత్యధిక పంటల పెరుగుదల శాతం 1.5కి కొంచెం అటూఇటుగా ఉండటం గమనించవచ్చు. మోదీ హయాంలో గత ఎనిమిదేండ్లుగా సగటున ద్రవ్యోల్బణం ఏడాదికి సుమారు 5.36 శాతం, మొత్తం ద్రవ్యోల్బణం సుమారు 51.88 శాతంగా నమోదైందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే 2014లో రూ.100, 2022లో రూ.151.88లతో సమానం. చాలా పంటల కనీస మద్దతు ధర ద్రవ్యోల్బణం కొంచెం అటూ ఇటుగా ఉందంటే రైతు నికర రాబడిలో ఎలాంటి తేడా లేదని అర్థమవుతున్నది. స్వామినాథన్ కమిటీ-2ను కనీస మద్దతు ధరకు బేస్గా తీసుకోవాలని సూచించినప్పటికీ దానివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేద ని మరోసారి నిరూపితమైంది.
ఏ 2 విధానం: ఈ విధానం ప్రకారం రైతు సాగుపై పెట్టిన ఖర్చు కన్నా యాభై శాతం అదనంగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీ అన్ని ఈ ఖర్చులోకి వస్తాయి.
సీ 2 విధానం: ఈ విధానంలో అనేక రకాల పెట్టుబడులను కలుపుకొని లెక్కిస్తారు. ఏ2లో ఉండే అంశాలతో పాటు పొలంలో రైతు కుటుంబసభ్యులు పడిన కష్టం ఆర్థిక విలువ, కిరాయి, ఇతర ఖర్చులన్నీ కలుపుతారు. ఈ విధంగా వచ్చిన మొత్తానికి దాంట్లో 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తారు.
అందుకే రైతు ఉద్యమ నాయకులు ఎంఎస్పీ చట్టం కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక పర్యాయాలు కేంద్రాన్ని ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమ నాయకులకు పూర్తి సంఘీభావం తెలిపారు. కనీస మద్దతు ధర విషయమై కేంద్ర మాజీ వ్యవసాయశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేసిందే ప్రధాని మాట ఇచ్చిన 8 నెలల తర్వాత! ఆ కమిటీ నివేదిక సమర్పించడానికి కాలపరిమితిని నిర్దేశించలేదు. ఈ తతంగం మోదీ ప్రభుత్వానికి కనీస మద్దతు ఏర్పాటు, రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.
రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వాల సెల్ఫ్గోల్గా ఎస్బీఐ పరిశోధన బృందం అభివర్ణించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలను, ముఖ్యంగా రైతులను రుణమాఫీ ద్వారా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేస్తున్నా యని పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరం. బడా కంపెనీలు రుణాలు ఎగవేయడం వల్ల బ్యాంకులకు కలుగుతున్న నష్టాల గురించి, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ గురించి ఈ పరిశోధన బృందాలు ఎన్నడూ సమగ్ర నివేదికలు తయారు చేయలేదు. మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా చేసిన 11 లక్షల కోట్ల మేర కార్పొరేట్ రుణమాఫీ గురించి కానీ, ఇటీవల ఎస్బీఐలో అదానీ కంపెనీకి లభించిన 12,000 కోట్ల పైచిలుకు రైట్ ఆఫ్ గురించి, వాటివల్ల బ్యాంకులకు, ప్రజలకు, ప్రభుత్వానికి కలిగే నష్టం గురించి ఎప్పుడూ పరిశోధక బృందాలు పరిశీలించక పోవడమూ ఆశ్చర్యకరమే. కేంద్ర ప్రభుత్వ ఎజెండాను చిలుకపలుకుల్లా వల్లించడం తప్ప ప్రజల, బ్యాంకింగ్, అకడమిక్ల ఎజెండాను ఏనాడూ ఈ బృందం పరిశోధన అంశాలుగా స్వీకరించడం లేదు.
– పెండ్యాల మంగళాదేవి