స్వాతంత్య్ర దినోత్సవాన ప్రధాని చేసిన ప్రసంగాన్ని విని నేను భయపడిపోయాను. ఎందుకంటే ఆయన చెప్పినదానికి విరుద్ధమైన పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయి. ‘మహిళల పట్ల మనం చూపే గౌరవ మర్యాదలే.. దేశాభివృద్ధికి కీలక’మని ఆయన ఉద్ఘాటించారు. సరిగ్గా అదే సమయంలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులైన 11 మంది ‘సంస్కారవంతులైన’ రేపిస్టులకు క్షమాభిక్ష లభించింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలని పోరాడిన వారు మాత్రం జైలుకు వెళ్లారు. మహిళలందరికీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ’ కానుక ఇది!
సత్ప్రవర్తన కారణంగా దోషులను విడుదల చేయ టం పరిపాటి. కానీ బిల్కిస్ బానో కేసులోని దోషులు ప్రత్యేకమైనవారు. అందుకే వారు విడుదలైన వెంటనే కొందరు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మిఠాయిలు తినిపించారు! కానీ ఈ కేసులో బానోకు న్యాయం జరగాలని తీస్తా సెతల్వాద్ చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి రాజ్య ధిక్కరణగా తోచింది. అంతే, ఆమెను అరెస్టు చేశారు. గుజరాత్ అల్లర్లలో ప్రభుత్వ పాత్ర గురించి ఐపీఎస్ అధికారులు ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్ విచారణ సంస్థలకు వాస్తవాలను అందించారు. ఇది ప్రభు త్వం దృష్టిలో కుట్ర, చట్ట ఉల్లంఘనైంది. దాంతో వారిని జైలుకు పంపి బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారు.
గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రాణాలు దక్కించుకోవటానికి బిల్కిస్ బానో కుటుంబం, ఇరుగు పొరుగు వారు పొలాల్లోకి పరుగెత్తారు. వారిని 20-30 మంది ముష్కరులు చుట్టుముట్టారు. ఐదు నెలల గర్భవతి అయిన బానోపై దుండగులు లైంగికదాడి చేశారు. చివరికి ఆమె చనిపోయిందని భావించి వదిలేసి వెళ్లారు. ఆమె మూడేండ్ల పసి బిడ్డను కనికరం లేకుండా బండకేసి కొట్టి చంపారు. బానో తల్లితో పాటు మరో ముగ్గురు మహిళలనూ అత్యాచారం చేసి హత్య చేశారు.
అనేక బెదిరింపులు, వేధింపులను తట్టుకొని బిల్కిస్ బానో న్యాయం కోసం పోరాడింది. చివరికి సీబీఐ కోర్టు జస్వంత్ నాయి, గోవింద్నాయి, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్చంద్ర జోషి, కేసర్భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్దియా, బాకాభాయ్ వొహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేష్ చందనాలకు యావజ్జీవ శిక్ష విధించింది. జైలులో చాలా ఏండ్లుగా మగ్గుతున్న తమ సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించాలని దోషులు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. ఓ కమి టీ వేసి ఈ విషయాన్ని తేల్చాలని కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఓ కమిటీ వేసిం ది. అందులో ఐదుగురు బీజేపీ నేతలు, ఇద్దరు ఎమ్మెల్యే లు, ముగ్గురు న్యాయ నిపుణులున్నారు. ఇలాంటి ఉన్మాదులు క్షమాభిక్షకు అనర్హులని అందరూ అంగీకరిస్తారు. కానీ ఆర్ఎస్ఎస్-బీజేపీ నాయకులకు మాత్రం సొంత మనుషుల మీద దయ పొంగుకొచ్చింది. విచారణ కోర్టు అభిప్రాయాన్ని పక్కనపెట్టి దోషులందరికీ క్షమాభిక్ష ప్రసాదించారు. ‘వారందరూ బ్రాహ్మణులు.. సంస్కారం కలవార’ని కమిటీలో సభ్యుడైన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
దోషుల విడుదలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్నది. వ్యక్తులు, సంస్థలు దోషుల విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ మాత్రం ఏమీ స్పందించలేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నోరు మెదపలేదు. దేశంలోని ఏకైక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఏమీ మాట్లాడ లేదు. మొత్తం మీద ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల కానుక’గా అత్యాచార దోషులు జైలు నుంచి విడుదలై సన్మానాలు పొందటమే నేటి విషాదం.
– రంజోనా బెనర్జీ, రూపా గులాబ్