ఛత్రపతి శివాజీ వారసుడిగా కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించిన ఛత్రపతి సాహు మహరాజ్ (1874-1922) తన పాలనా కాలంలో అనేక సంస్కరణలను ప్రారంభించారు. 48 ఏండ్లు మాత్రమే జీవించిన ఆయన.. నవీన భారతానికి మార్గనిర్దేశకుడిగా నిలిచారు.
1918లో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు.
జనాభాలో సగం కన్నా అధికంగా ఉన్న బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 1902లో నిర్ణయం తీసుకున్నారు.
కులవృత్తులే తప్ప చదువుకోవటం తెలియని ఆ కాలంలో.. అన్ని కులాల వారికి విద్యా సంస్థలను, హాస్టళ్లను నిర్మించి స్కాలర్షిప్లను ప్రవేశపెట్టారు.
వైదిక పాఠశాలలు నెలకొల్పి అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించారు. పురోహితులుగా ఉండటానికి అందరికీ అవకాశం ఇచ్చారు.
అంటరానితనాన్ని నిషేధించారు. ఎస్సీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు.
కులాంతర వివాహాలకు ఆమోద ముద్రవేశారు.
బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వితంతు వివాహానికి చట్టబద్ధత కల్పించారు. మహిళలు చదువుకోవటానికి ప్రోత్సాహం ఇచ్చారు. దేవదాసీ వ్యవస్థను రద్దు చేశారు.
రైతులకు సాగు మెలకువలను నేర్పించే కళాశాలను ఏర్పాటుచేశారు. వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రుణసౌకర్యం కల్పించారు. సహకార సంఘాలను ఏర్పాటుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు.
రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తూ వారికి విరాళాలు ఇచ్చారు.
జ్యోతిబా పూలే ఆదర్శాలకు, అంబేద్కర్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు అండగా నిలిచారు.