‘వీధి కుక్కల దాడిలో వ్యక్తి మృతి’, ‘చిన్నారిని లాక్కెళ్లిన వీధి కుక్కలు’.. పత్రికల్లో ఇలాంటి వార్తలను తరచూ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వాన కాలంలో వీధి కుక్కల వల్ల అధిక మరణాలు సంభవిస్తుంటాయి. భారత్లో ఏటా 15 లక్షల మంది కుక్క కాటుకు గురవుతున్నారని ఒక అంచనా. భారత్లో రేబిస్ వ్యాధితో ఏటా 20 వేల మంది చనిపోతున్నారు. వీరిలో 40% మంది 15 ఏండ్లు లోపువారే.
ప్రపంచంలో నమోదవుతున్న రేబిస్ మరణాల్లో మూడో వంతు భారత్లోనే సంభవిస్తున్నాయి. వీధి కుక్కల వల్ల ప్రమాదం మరింత పెరుగుతున్నది. ఈ సమస్యకు పరిష్కారం లేదా? ప్రజలు, పాలకులు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉన్నది.
వీధి శునకాలను మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటి రకం- రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ మనుషులపై పాక్షికంగా ఆధారపడే కుక్కలు. వీటికి సొసైటీలు, కాలనీల్లో ఉండే ప్రజలు ఆహారాన్ని అందిస్తారు. రెండో రకం – మనుషులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా తిరిగే వీధి కుక్కలు. ఇలాంటి వీధి కుక్కలు తమ ఆహారాన్ని చెత్త కుప్పలు, ఇతర ప్రదేశాల్లో సంపాదించుకుంటాయి. మూడో రకం విడిచి పెట్టబడిన పెంపుడు కుక్కలు. ‘2021 స్టేట్ ఆఫ్ పెట్ హోమ్ లెస్నెస్ ఇండెక్స్’ నివేదిక ప్రకారం… మిగతా దేశాల కంటే పెంపుడు జంతువులను వదిలించుకోవడం ఇండియాలో ఎక్కువ. ఇండియాలో 50 శాతానికి పైగా ప్రజలు తమ పెంపుడు జంతువులను వదిలించుకున్నట్లు అంగీకరించారు. మిగతా దేశాల్లో ఇది 28 శాతమే.
టీకాలు తీసుకోని ఏ శునకం నుంచైనా మనుషులకు రేబిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ వ్యాధి వస్తే వంద శాతం మరణించే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో రేబిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో కాంగో మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఇండియాలో ఏటా 20 వేల మంది రేబిస్ వ్యాధితో మరణిస్తున్నారు. రేబిస్ వల్ల అమెరికా ఇండియా నుంచి కుక్కలను దిగుమతి చేసుకోవడం నిలిపివేసింది. ఎందుకంటే అమెరికా 2007లోనే రేబిస్ వ్యాధిని పూర్తి స్థాయిలో తమ దేశం నుంచి పారదోలింది. అయితే అప్పటివరకు కుక్కలను అమెరికాకు ఎగుమతి చేయడంలో భారత్ కీలకంగా వ్యవహరించేది. వీధి కుక్కల సమస్యకు పరిష్కారం అనగానే అందరికీ వచ్చే మొదటి ఆలోచన వాటిని చంపేయడం. అయితే ఈ పద్ధతిని పాటించడానికి ప్రయత్నించిన చాలా దేశాలు విఫలమయ్యాయి. ఇండియాలో వీధి జంతువులను చంపడం చట్ట విరుద్ధం.
అయినా ఈ పద్ధతిని అనుసరించారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కారణం కుక్కల్లో గర్భ ధారణ సమయం రెండు నెలలే. అంతేకాకుండా అవి ఎక్కువ పిల్లలకు జన్మనిస్తాయి. అంటే ఏదైనా పట్టణం లేదా గ్రామంలో వీధి కుక్కలను పూర్తిస్థాయిలో చంపేయాలంటే ఆ ప్రక్రియను రెండు నెలల్లోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. లేకుంటే వీధి కుక్కల సంఖ్య గరిష్ట పరిమితికి చేరుకుంటుంది. అంతేకాకుండా ఒక్కొక్క వీధి కుక్కను వేటాడటం ఖర్చుతో కూడుకున్న పని. సమయం వృథా బ్రెజిల్లోని ఒక పట్టణంలో ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యారు.
వీధి కుక్కల సమస్యకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని రకాల పరిష్కారమార్గాలను సూచించింది. అందులో ఒకటి పెంపుడు కుక్కలకు సంతానం కలగకుండా శస్త్ర చికిత్స చేయాలి. రెండోది పెంపుడు జంతువుల నియంత్రణా చట్టాలను కఠినంగా అమలుచేయాలి. తద్వారా వీధి కుక్కల సంఖ్యను కొంతమేర నియంత్రించవచ్చు. ప్రభుత్వాలు వీధి కుక్కలను పట్టుకొని వాటి కోసం ప్రత్యేకంగా హోమ్లెస్ షెల్టర్స్ ఏర్పాటుచేయాలి. రేబిస్ లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి కుక్కకు టీకా వేయాలి. ఇలాంటి పరిష్కార మార్గాలను అనుసరించి ప్రపంచంలోనే వీధి కుక్కలు లేని మొదటి దేశంగా 2020లో నెదర్లాండ్స్ అవతరించింది. భారత్ కూడా ఆ దిశగా పయనించాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, కాలమిస్ట్)
ఫిరోజ్ ఖాన్
96404 66464