ఒక ‘నాయకుడు’.. నాయకుడు అనడం కన్నా ఒక ‘వ్యాపారవేత్త’ అంటే బాగుంటుందేమో.. ఎందుకంటే, నాయకుడు ప్రజల కోసం పనిచేస్తాడు. వ్యాపారవేత్త స్వార్థం కోసం పనిచేస్తాడు. సరే ఏదైతేనేం.. ఆ వ్యాపారవేత్త ప్రజలు అప్పగించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల అనివార్యంగా వచ్చిపడిన ఉప ఎన్నికనే ఇది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడచూసినా మునుగోడు ఉప ఎన్నిక మీదనే చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ ఉప ఎన్నికకు దారితీసిన పరిస్థితులు, తదనంతరం సృష్టించబడిన గందరగోళ, రాజకీయ వాతావరణాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడం నా బాధ్యతగా ఈ వ్యాసం రాస్తున్నా…
కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు చెప్పుకొస్తున్నారు. రాజీనామాతోనే ఉపఎన్నిక సాధ్యం అనుకున్నప్పుడు మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు దాపురించాయో ప్రజలకు వివరించాలి. ఆయన బొగ్గుగనుల నుంచి నిర్మాణ సంస్థల వరకు కోట్లు విలువ చేసే కాంట్రాక్టు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఆ సామ్రాజ్యంపై బీజేపీ కన్నుపడింది. ఈడీ, సీబీఐ దాడులు చేస్తామని బెదిరించింది. దీంతో ఆయన బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నాడు. అప్పుడు బీజేపీ నీ వ్యాపారాలకు అండగా ఉంటామని మాటిచ్చింది. ఆ మాట ఇచ్చిన తర్వాతే రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరినమాట జగద్విదితం. స్వప్రయోజనాల కోసం, స్వార్థపూరితంగా చేసిన రాజీనామాను మునుగోడు అభివృద్ధి కోసం చేశానని ముసుగు తొడగడం రాజగోపాల్రెడ్డి దివాళాకోరుతనానికి పరాకాష్ఠ.
ఇప్పుడు రాజగోపాల్రెడ్డి బీజేపీ ద్వారానే ‘మునుగోడు’ అభివృద్ధి సాధ్యం అంటున్నారు. సరే ఇదిలా ఉంచితే… అబద్ధపు వాగ్దానాలతో, మాయమాటలతో హుజూరాబాద్, అభివృద్ధి పేరుతో దుబ్బాక.. ఇలా మూడు నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకున్నది. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ ఏ మేరకు అభివృద్ధి పనులు చేసిందో రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజలకు విడమర్చి చెప్తే బాగుంటుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి అమిత్ షా, యూపీ నుంచి యోగి వచ్చి గెలిపించిన కార్పొరేట్ల పరిధిలో జరిగిన అభివృద్ధిని ఏకరువు పెడితే బాగుంటుంది. అంతెందుకు ‘బీజేపీ జాతీయ సమావేశాలు’ ఒక దండయాత్ర వలె హైదరాబాద్లో జరిగాయి.
ఆ తర్వాత జీహెచ్ఎంఎసీ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిపించుకున్న విశ్వగురువు నరేంద్ర మోదీజీ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్యాకేజీలు ఏమేం అనుగ్రహించారో చెప్తే తెలంగాణ ప్రజానీకం సంతోషిస్తుంది కదా! అదికాకుండా బీజేపీ ప్రజల మధ్యన మత విద్వేషాలు సృష్టించి ప్రపంచీకరణ దిశగా పరుగులు పెట్టాల్సిన సమాజాన్ని ఆదిమకాలపు రాతియుగాల వైపు నడిపిస్తున్న దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నది. కేంద్రంలో, ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ విశాల ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ఒక్క మంచిపనైనా ఉందా చెప్పుకోవడానికి. బీజేపీవి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు.
బీజేపీ కొనసాగిస్తున్న అసత్య, విష ప్రచారాల కాలనాగుల నుంచి మునుగోడు ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజల మధ్యన ప్రత్యేకించి యువతలో అసత్య ప్రచారాన్ని సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది బీజేపీ. ఇది తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నట్లు ‘గంగా జమునీ తెహ్జీబ్’తో విలసిల్లే తెలంగాణ ప్రజల సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారనేది వాస్తవం కాదా! రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, దళితబంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ఇలా సమాజంలోని ప్రతీ వర్గానికి చేయూతనిచ్చే ప్రభుత్వం దేశంలో మరొక్కటైనా ఉందా? రెండుకోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగటం, పారిశ్రామికీకరణ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ప్రతీ ఇంటికి నల్లా నీరు, మిషన్ కాకతీయ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా చూశామా? పొరుగున ఉన్న బీజేపీ పాలిత కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన నాందేడ్, బీదర్, గుల్బర్గా, రాయిచూర్ తదితర జిల్లాల ప్రజలు ప్రత్యేకించి రైతులు, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమకూ అందించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ మాడల్ అమలు చేయండి లేదా తెలంగాణలో విలీనం చేయాల నే డిమాండును ఎత్తుకోవడం దేనిని సూచిస్తుంది?
అందుకోసమే బీజేపీ కొనసాగిస్తున్న అసత్య, విష ప్రచారాల కాలనాగుల నుంచి మునుగోడు ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజల మధ్యన ప్రత్యేకించి యువతలో అసత్య ప్రచారాన్ని సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది బీజేపీ. ఇది తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నట్లు ‘గంగా జమునీ తెహ్జీబ్’తో విలసిల్లే తెలంగాణ ప్రజల సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ను, ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ అని మలిచిన ఘనత కేసీఆర్ది. ఓ పక్క విద్వేష, విభజిత రాజకీయాలను నమ్ముకున్న పార్టీ, మరో పక్క ప్రజల మేలు కోరి సమాజ అభ్యున్నతికి పాటుపడే కేసీఆర్… ప్రజలు నిస్సందేహంగా కేసీఆర్ వైపే ఏకపక్షంగా నిలుచుంటారనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి)
గౌండ్ల నాగేందర్ గౌడ్ 94406 24958