మునుగోడుకు ఏం చేసిండు కేసీఆర్ అనేవాళ్లకు ఒకే ఒక్క సమాధానం. మంచి నీళ్లు.
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఏడు దశాబ్దాలపాటు గుక్కెడు మంచి నీళ్లకు గోస పడ్డది మునుగోడు.
తాగే నీరు విషం. తినే తిండి విషం. కాళ్లూ చేతులు మెలితిరిగి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించిన వారి సంఖ్య అనేకం.
తరాల తరబడి తండ్లాడిన మునుగోడు తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని మంచి నీళ్లు తాగింది. చెదిరిన ఆశలను పోగు చేసుకుని నూతన భవితను పునర్నిర్మించుకుంటున్నది. అందుకే మిషన్ భగీరథకు మునుగోడు జనం ప్రేమగా పెట్టుకున్న పేరు కేసీఆర్ నీళ్లు.
ఈ నీటి వెనుక, ఆరిన కన్నీటి చారల వెనుక మర్లవడ్డ గతం చాలానే ఉంది. ఇక్కడి బిడ్డల జీవించే హక్కును కాలరాసి మరణ శాసనం వేసిన గత ప్రభుత్వాల వివక్షపూరిత నిర్లక్ష్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే, గతాన్ని మరిచిన వర్తమానం భవిష్యత్ను అంధకారం చేస్తుంది. పెండ్లయిన ప్రతి స్త్రీ అమ్మతనం కోసం ఆరాటపడుతుంది. తల్లి కాబోతున్నట్లు తెలిస్తే సంబురపడుతుంది. కానీ, మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితి వేరు. శరీరంలోకి వెళ్లే ప్రతిదీ విషమే అవడంతో కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా ఉందో, లేదో స్కానింగ్లో తెలుసుకునే వరకూ ప్రాణం బిక్కుబిక్కుమనేది. బిడ్డ ఫ్లోరోసిస్ బారిన పడి అవయవాలు సరిగ్గా లేకపోతే కడుపు తీపితోపాటు కడుపునపడ్డ నలుసునూ చంపేసుకోవాల్సిన దుస్థితి.
20 ఏండ్ల వయస్సు. పది కేజీల బరువు. కాళ్లూచేతులూ చచ్చుబడ్డాయి. కండ్లు కనపడవు. ఎముకల గూడులా ఉండేవాడు అజయ్. తల్లిదండ్రులు పొలం పనికి పోతే నులక మంచంలో మెత్తల మధ్య పడుకోబెట్టి వెళ్లేవారు. విల్లులా వంగిన కాళ్లతో పాతికేండ్లు పరిమితమైంది సాయమ్మ. 35 ఏండ్ల వయస్సులో అన్నతో సపర్యలన్నీ చేయించుకోలేక దుఃఖం దిగమింగి రోజూ చచ్చిబతికేది. ఇప్పుడు అజయ్, సాయమ్మ ఇద్దరూ లేరు. ఇలా చాలామంది. వాళ్లంతా వయస్సు మీద పడి నవిసి చనిపోయినవాళ్లు కాదు. పాలకుల పాపానికి, ఫ్లోరోసిస్ రక్కసికి ప్రాణం కోల్పోయినవాళ్లు. ఇవన్నీ సాధారణ మరణాలేనా? నాటి ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యపు హత్యలు కావా? 2001 జనాభా లెక్కల ప్రకారం మర్రిగూడ మండలంలో 37,700 ఉన్న జనాభా 2011 సంవత్సరానికి 36,710కి పడిపోవడానికి కారకులెవరు? ఈ దేశాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏడు దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్, బీజేపీ కాదా? ఆ చీకటి చరిత్రను మునుగోడు గడ్డ మరువగలదా?
ఈ ఏడు దశాబ్దాల ప్రస్థానంలో మునుగోడు గోడు విన్నదెవరు? గోస తీర్చిందెవరు? అన్నది తెలుసుకోవాల్సిందీ, తేల్చుకోవాల్సిందీ యువతరమే. ఎందుకంటే, మీ ముందు తరమంతా కష్టాల కడలిని గట్టెక్కించే నాయకుడి కోసం ఎదురుచూసింది. మీ క్షేమాన్నే కాంక్షిస్తూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నియ్యత్ గల సర్కారును ఎన్నుకుని మునుగోడును ఓ ఒడ్డుకు చేర్చింది. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న మునుగోడు గడ్డపై కుట్రలు, కుతంత్రాలతో కొత్త శక్తులు వాలుతున్నయి. ఎరవేసి మన అస్తిత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని తన్నుకుపోయే రాజకీయ రాబందులవి. వాటి బారిన పడవద్దు. తెలంగాణను మళ్లా తెర్లు చేయొద్దు. మీ చేతుల్లో ఉన్న ఓటు అనే ఆయుధం తెలంగాణ భవితవ్యాన్ని కూడా నిర్ణయిస్తుందని మర్చిపోవద్దు.
డబ్లూహెచ్ఓ ప్రామాణికాల ప్రకారం.. భూమిలో ఫ్లోరైడ్ శాతం 0.5-1 పీపీఎం (పార్ట్ ఫర్ మిలియన్) ఉండాలి. మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో అది 25 శాతం దాకా ఉండేది. ఇక్కడి నీళ్లు తాగితే ఫ్లోరైడ్ నేరుగా ఎముకల్లో కాల్షియం ఉండే చోటుకు చేరి ఫ్లోరోసిస్ బారిన పడేస్తుంది. చూస్తుండగానే మనిషిని జీవచ్ఛవం చేస్తుంది. మర్రిగూడ మండలం బట్లపల్లిలో ఫ్లోరైడ్ శాతం 28 పీపీఎం ఉన్నట్లు నాలుగు దశాబ్దాల కిందే డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఈ ప్రాంతం నివాస యోగ్యం కాదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘నో మ్యాన్ జోన్’గా మారుతుందని హెచ్చరించింది. బట్లపల్లి నాలుగు ముక్కలైంది. అయినా అప్పటి పాలకులకు ఏనాడైనా కనువిప్పు కలిగిందా? ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో 40,543 ఆసరా పింఛన్లు ఉంటే, అందులో దివ్యాంగులే 6,884 మంది ఉన్నారు. తాగేందుకు ఇన్ని మంచి నీళ్లు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా?
వాస్తవానికి, నిజాం కాలంలోనే బట్లపల్లిలో ఫ్లోరోసిస్ను గుర్తించారు. ఉపరితల నీటితోనే సమస్య పరిష్కారమవుతుందని తెలుసుకుని నిజాం గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. చర్లగూడెం, తంగడిచెరువు, మునుగోడు పెద్దచెరువు, సోలిపురం చెరువులు అలా తీసినవే. కానీ, ఉమ్మడి ఏపీలో ఇలాంటి నీటి వనరులన్నీ పూడిక నిండి, కబ్జా కోరల్లో చిక్కి శల్యమయ్యాయి.
ఉపరితల నీరు అందుబాటులో లేకపోవడంతో తాగునీటితోపాటు సాగునీటికీ మునుగోడు నియోజకవర్గ ప్రజలు భూగర్భ జలాల మీద ఆధారపడాల్సి వచ్చింది. బోరుబావుల లోతు పెరుగుతున్న కొద్దీ ఫ్లోరైడ్ తీవ్రత పెరిగింది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో నీళ్లు తాగితే పండ్లు గారపట్టేవి. అన్నం వండితే పసుపు రంగులోకి మారేది. చాలామంది పిల్లలకు బడి ఎలా ఉంటుందో తెలియదు.
ఇల్లే వారి లోకం. పెళపెళ విరిగే ఎముకలు, కిడ్నీ సమస్యల బాధ వర్ణనాతీతం. కొన్ని ఊళ్లకు పిల్లను ఇవ్వాలంటేనే భయపడేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల నుంచే ఇక్కడ ఉద్యమాలు మొదలయ్యాయి. దుశ్చర్ల సత్యనారాయణ జల సాధన సమితి, ఫ్లోరోసిస్ బాధిత కుటుంబం నుంచి వచ్చిన కంచుకట్ల సుభాష్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ద్వారా ఫ్లోరైడ్ బాధితులను వెంట బెట్టుకుని ఎంతో పోరాటం చేశారు. ఫ్లోరోసిస్ బాధితులు అంశల స్వామి, తిరుపతమ్మను తీసుకుని ఢిల్లీ వరకూ వెళ్లారు. నాటి ప్రధాని వాజపేయి ముందు స్వామిని టేబుల్పై పడుకోబెట్టి మునుగోడు వెల్లబోశారు.
తమ తర్వాతి తరాన్నైనా ఫ్లోరోసిస్ బాధ నుంచి గట్టెక్కించాలని స్వామి చేతులు జోడించి వేడుకున్నాడు. 1996లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 400 మంది ఫ్లోరోసిస్ బాధితులు నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. 2004లో ముంబైలో 175 దేశాల ప్రతినిధులుహాజరైన ప్రపంచ సామాజిక సదస్సుకు ఫ్లోరోసిస్ బాధితులు నల్ల దుస్తులు ధరించి వెళ్లి మునుగోడు ఫ్లోరైడ్ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. అంతకుముందు, ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో ఉపరితల నీటి వనరులను పెంచేందుకు ప్రపంచబ్యాంకు నిధులిస్తే, సీమాంధ్ర సీఎం చంద్రబాబు ‘నీరు – మీరు’ పథకానికి మళ్లించి మునుగోడును ఏడారి చేసిండు. కారణం! వాళ్లెవరూ ఈ నేల మీద పుట్టిన, ఈ మట్టి వాసన పీల్చిన, ఇక్కడ ప్రజల ఆపతిసోపతి తెలిసిన నాయకులు కాదు.
ఈ మట్టి బిడ్డ కాబట్టే, కేసీఆర్ సవాల్గా స్వీకరించి ఫ్లోరోసిస్ పీడను పటాపంచలు చేసిండు. ఉద్యమ నేతగా ఉన్నప్పుడే సమస్య తీవ్రతను తెలుసుకునేందుకు మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిండు. శివన్నగూడెంలో నిద్ర చేసిండు. బాధితుల కష్టాలు చూసి చలించి ‘చూడు చూడు.. నల్లగొండ. గుండె నిండా ఫ్లోరైడ్ బండ. బొక్కలొంకరబోయిన బతుకులా మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు’ అని పాట రాసిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా మార్చుకుందామని మాట ఇచ్చిండు. ముఖ్యమంత్రి అయ్యాక, చెప్పినట్టే.. 2016 జూన్లో ఇదే మునుగోడు నియోజకవర్గం నుంచి మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిండు. చౌటుప్పల్లో పైలాన్ ఆవిష్కరించి ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తానని శపథం పూనిండు. ఒకనాడు ఫ్లోరైడ్ భూతానికి చెల్లాచెదురైన అదే బట్లపల్లి పేరుతో రూ.440 కోట్లతో 90 ఎమ్ఎల్డీ కెపాసిటీతో నీటి శుద్ధిప్లాంట్ నిర్మించిండు. ఇప్పుడు అంశల స్వామి ఇంటికి భగీరథ నీళ్లు వస్తున్నయి.
మొన్న స్వామి ఇంటికి వచ్చిన మంత్రి కేటీఆర్ ఆ నల్లా నీళ్లే తాగి సంబురపడ్డడు. ఒక్క స్వామి ఇంటికే కాదు, ప్రతి ఫ్లోరోసిస్ బాధితుడి ఇంటికీ, బడికీ స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందుతున్నాయి. ఉప ఎన్నిక ప్రచారం కోసం నెల రోజులుగా నియోజకవర్గంలోనే చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల దూపను సైతం ఇవే భగీరథ నీళ్లు తీరుస్తున్నాయి.
మరోవైపు, మిషన్ కాకతీయలోనూ రాష్ట్ర ప్రభుత్వం మునుగోడుకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. భూగర్భ జలాలను పెంచి ఫ్లోరైడ్ తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశంతో రూ.244.50 కోట్లతో నియోజకవర్గంలోని 422 చెరువులను పునరుద్ధరించింది. ఫలితంగా నీటి ఆనవాళ్లు లేని చెరువుల్లో నేడు ఏడాదంతా నీళ్లుంటున్నాయి. గత 30 ఏండ్లలో నిండని చెరువులు నేడు మత్తడి దుంకుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో 500 ఫీట్లలోనూ నీటి జాడ దొరక్కపోగా, ఇప్పుడు 150 ఫీట్లలోపే ఉబికి వస్తున్నాయి. ఈ పరిణామం కూడా ఫ్లోరైడ్ తీవ్రత వేగంగా తగ్గడానికి దోహదపడింది. మిషన్ కాకతీయలో తీసిన 60 లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని రైతులు పొలాలకు తోలుకుని వ్యవసాయ భూములు సారవంతం చేసుకోవడమూ గమనార్హం.
వెరసి గత ఆరేండ్లలో మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఒక్కటీ ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిర్ధారించింది. ‘భారత సహజ వనరులు, ఆర్థిక నిర్వహణ సంస్థ’ (ఐఎన్ఆర్ఈఎమ్) పరిశోధనల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. తాగునీటిలో ఉండే ఫ్లోరైడ్ పీపీఎం పర్సంటేజీ కూడా గణనీయంగా తగ్గిపోయిందని తేల్చిచెప్పింది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, పిల్లల్లో పండ్లు గారపట్టడం లేదని కంచుకట్ల సుభాష్ చెప్తున్నారు.
ఇదంతా ఒక్క రోజులో సాధ్యమైన మార్పు కాదు. మునుగోడుకు కరువు ఛాయ అన్నదే లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నుంచి పెనవేసుకున్న ఒక్కొక్క ప్రణాళికా సమష్టి ఫలితమిది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకం కూడా ఫ్లోరోసిస్ సమస్యను నిర్మూలించటానికి దోహదపడింది. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 7.25 కోట్ల మొక్కలు నాటితే, అందులో 1.56 కోట్ల మొక్కలు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే నాటారు. అదనంగా, వేల ఎకరాల్లో విస్తరించిన రాచకొండ గుట్టల్లో సీడ్ బాల్స్ వేసి పచ్చదనం పెంచుతున్నారు. ఫలితంగా మునుగోడు నియోజకవర్గంలో వర్షపాతం సగటును మించి రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. ఉదాహరణకు 2014లో సంస్థాన్ నారాయణపురం మండలం వార్షిక వర్షపాతం 218 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 707.3 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది క్రమంగా భూగర్భ జలాల పెంపునకు దోహదపడి, ఫ్లోరోసిస్ తీవ్రతను తగ్గిస్తున్నది.
ఇక 2.55 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఉద్దేశించిన శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలమైనట్టే. ఇప్పటికే 60% పూర్తయిన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందుకే, మునుగోడు జనం సీఎం కేసీఆర్ను ఇంటి పెద్దగా భావిస్తున్నారు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
నరేందర్ మడూరి
99120 28833