టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకించే ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. రేవంత్ ఒంటెత్తు పోకడలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్దామంటే అపాయింట్మెంట్ దొరకదు, పోనీ.. రాష్ట్ర ఇంచార్జీకి (మానిక్కమ్ ఠాగూర్కు) చెబుదామంటే ఆయనేమో రేవంత్తో మిలాఖత్ అయ్యారని జగ్గారెడ్డి మొదలుకొని వీహెచ్, కోమటిరెడ్డి వరకు అంతా వాపోతుంటారు.
కానీ, ఇక్కడి విషయాలన్నీ అధిష్ఠానానికి తెలుసన్న సంగతి బయటపడటంతో వారంతా షాకయ్యారు. తెలంగాణలో ప్రారంభం కానున్న రాహుల్గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఏర్పాట్లను సమీక్షించడానికి హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ‘ఈ యాత్రకు కర్ణాటకలో మంచి స్పందన వచ్చింది. ఇక్కడేమో ఆ ఊసే కనిపించడం లేదు’ అని ఆశ్చర్యపోయారు. ‘మిగతా వారితో పోలిస్తే పబ్లిసిటీ టైగర్గా ఉండే మీరు ఈ అంశంలో ఎందుకు వెనుకబడ్డారు’ అని రేవంత్ను ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న రేవంత్ వ్యతిరేకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ’ అని రేవంత్పై తాము చేసే విమర్శల గురించి ఆధిష్ఠానానికి కూడా అవగాహన ఉందన్న మాట అని ఆశ్చర్యపోయారు.