భారతీయ సహోదరులారా! బీజేపీ-హిందూ-మోదీ వ్యతిరేకతతో కాదు, చుట్టుముడుతున్న ప్రమాదాల బారినుంచి మన భరతమాతను కాపాడుకునే తపనతో చేస్తున్న సూచన ఇది! ‘సర్వేజనా స్సుఖినో భవన్తు! విశ్వశాంతిర్భవేత్’ ప్రజలంతా సుఖంగా ఉంటేనే, ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంద’ని ప్రబోధిస్తున్నది హైందవ ధర్మం! ‘కొద్దిమంది వద్దే దేశ సంపద పోగు బడకుండా కట్టడి చేయటం! ప్రజలందరికీ ప్రగతి ఫలాలందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత’ అని నిర్దేశిస్తున్నది భారత రాజ్యాంగం! కానీ తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నది బీజేపీ ప్రభుత్వం! తత్కారణంగా…
1వ ప్రమాదం: అదానీ, అంబానీల వంటి కొద్దిమంది కార్పొరేట్ల వద్దే దేశ సంపదంతా పోగుబడుతున్నది. ఉదాహరణకు 2014లో 17 వేల కోట్లుగా ఉన్న అదానీ ఆస్తి బీజేపీ పాలనలో 12.37 లక్షల కోట్లకు పెరిగింది. 2014లో ప్రపంచ కుబేరుల్లో పదో స్థానంలో ఉన్న అదానీ, అంబానీలు బీజేపీ పాలనలో మూడో స్థానానికి ఎదిగారు. ‘రుణమాఫీ-పన్ను రాయితీ-ప్రైవేటీకరణ, లీజుల పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థల్ని-ఆస్తుల్ని వేల కోట్లకే కట్టబెట్టడం ప్రభుత్వ ఆస్తుల్ని కొనుక్కోవటానికి, ప్రభుత్వ బ్యాంకులతో వాళ్ళకు అప్పులిప్పించటం ప్రజాధనంతో ప్రధాని మోదీ పర్యటించిన అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంక వంటి దేశాలతో అదానీ, అంబానీలకు లక్షల కోట్ల కాంట్రాక్టులు, వ్యాపారాల డీల్స్ను సంపాదించి పెట్టడం ద్వారా వాళ్ల ఆస్తుల్ని పెంచింది బీజేపీ ప్రభుత్వం!
2వ ప్రమాదం: వ్యాపారుల మధ్య పోటీని పెంచటం ద్వారా, నాణ్యమైన వస్తువులను, సరసమైన ధరలకు ప్రజలకు అందించాలన్నదే ప్రైవేటీకరణ లక్ష్యం!’ కానీ తద్విరుద్ధంగా రైల్వేలు-ఓడరేవులు-విమానాశ్రయాలు-భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలన్నింటినీ అదానీ, అంబానీలకే కట్టబెడుతూ గుత్తాధిపత్యాన్ని పెంపొందిస్తున్నది బీజేపీ! తత్కారణంగా వారుచెప్పిన ధర చెల్లించి, వాళ్లందించిన సేవలతో సర్దుకుపోవటం కన్నా గత్యంతరం లేని దుస్థితి ప్రజలకు దాపురిస్తుందని ప్రపంచ చరిత్ర చెప్తున్నది.!
3వ ప్రమాదం: కార్పొరేట్లకు పన్నురాయితీ, రుణమాఫీ చేసిన కారణంతో ఏర్పడిన ప్రభుత్వ లోటును పూడ్చుకునేందుకు గ్యాస్-పెట్రో-డీజిల్ ధరలను రెట్టింపు చేయడం, తద్వారా నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకించడం, పిల్లలకు అవశ్యమైన, పాలు, పెరుగు, పెన్సిల్, రబ్బర్ల మీద గూడ జీఎస్టీ బాదటం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఉదాహరణకు 7 దశాబ్దాల్లో చేసిన అప్పు 58,59,331 కోట్లు కాగా, బీజేపీ ప్రభుత్వం కేవలం ఏడేండ్లలో చేసిన అప్పు 94,58,579 కోట్లు!
4వ ప్రమాదం: డాలరుకు 80 రూపాయలుగా బీజేపీ పాలనలో రూపాయి పతనమైంది. తత్కారణంగా దిగుమతులకు-చమురుకు-విదేశీ చదువులకు రెట్టింపు రూపాయలు చెల్లించాల్సి రావటంతో విదేశీ మారక ద్రవ్య నిధులు అడుగంటినయ్!
5వ ప్రమాదం: ‘వృక్షో రక్షతి! రక్షితః’ అన్న హైందవ ధర్మ విరుద్ధంగా అడవులను నరికి, పీకి, తగలబెట్టి, గిరిజనులను తరిమేసి మరీ కార్పొరేట్లు కోరినంత అటవీభూమిని 150 రోజుల్లో కట్టబెట్టేలా అటవీ చట్టాన్ని సరళీకరించింది బీజేపీ ప్రభుత్వం. భూ భాగంలో 33.3 శాతం అడవులు లేకుంటే, వర్షాభావంతో కరువు కాటకాలేర్పడుతయ్! భూతాపం పెరిగి హిమాలయాలు కరిగి దేశ ఉనికే ప్రమాదానికి గురౌతుందని పర్యావరణ పరిరక్షకులు, శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నా అటవీ విధ్వంసానికి పూనుకున్నది బీజేపీ!
6.హిందువులకే ప్రమాదం: హైందవోద్ధారకులమని చెప్పుకొంటున్న బీజేపీ ప్రభుత్వం. 1. కోట్లాది కార్మికుల్ని కార్పొరేట్లకు బానిసల్ని చేసే కార్మిక చట్టాలు చేసింది. 2. రైతుల్ని భూములమ్ముకొని, కార్పొరేట్ల కూలీలుగా మార్చే రైతాంగ చట్టాలు చేసింది. 3. రిజర్వేషన్లకు తావులేకుండా, ప్రభుత్వరంగ సంస్థ ల్ని అమ్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీల నోట మన్నుగొట్టింది. 4. గిరిజనులను తన్ని తరిమేసే అటవీ చట్టాలు చేసింది. 5.రక్షణ రం గాన్ని సైతం ప్రైవేటీకరించి, సైనికులను కూలీలుగా రూపొందించే అగ్నిపథ్ను తెచ్చింది బీజేపీ! వీరందరిలో మెజారిటీ ప్రజలు హిందువులే గదా?
7వ ప్రమాదం: నిత్య మత విద్వేష జ్వాలలకు జడిసి, కొత్త పరిశ్రమలు భారత్కు రాకపోగా, ఉన్నవి తరలిపోతున్నయ్! ఉదాహరణకు ఐటీ రంగానికి నెంబర్ వన్గా వర్ధిల్లిన బెంగళూరు- హిజాబ్ గొడవలతో ప్రశాంత హైదరాబాద్ నెంబర్-1గా మారటమే అందుకు నిదర్శనం.
ఐతే గాయం చేసి, వెన్న రాసినట్లు బాధిత హిందువుల ఉపశమనార్థం 1.కార్మికుల కాళ్ళు కడగటం. 2.రైతుల్ని క్షమాపణ కోరటం, 3.దళితుల ఇంట భోంచేయటం 4.దళిత కోవిందును, గిరిజన ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతులు చేయటం 5.భారీగా పెంచిన పెట్రో టాక్సును కంటి తుడుపుగా తగ్గించటం. 6.పార్లమెంటుకు ప్రణమిల్లటం వగైరాలన్నీ మోదీగారి ఎన్నికల చిట్కాలనీ పామరులు సైతం గ్రహించారు.
అందుకే రూటు మార్చింది బీజేపీ! 1.మన్కీ బాత్ పేరిట కోట్లాది రూపాయలిచ్చి మెజారిటీ మీడియాను గ్రిప్లో పెట్టుకోవటం. 2.వ్యవస్థల్ని ఉసిగొల్పి ప్రతిపక్ష పార్టీల ఆర్థిక వనరులను దెబ్బతీయటం. 3.బెదరగొట్టి షిండేలను సృష్టించటం. 4. పార్టీలను చీల్చి, ప్రభుత్వాలను కూల్చటం. 5.లొంగిన వాళ్లకు తమ కండువా కప్పటం. 6.కొన్నింటిని బినామీ పార్టీలుగా మలుచుకోవటం. 7.విద్వే ష జ్వాలలు చల్లారకుండా హిందుత్వ ఆజ్యా న్ని నిర్విరామంగా పోస్తుండటం వంటి సరికొత్త ప్రణాళికతో పయనిస్తున్నది బీజేపీ అంటున్నారు విశ్లేషకులు.
కార్పొరేట్ బీజేపీ కబంధ హస్తాల ప్రమాదాల బారినుంచి భరతమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత! ఈ బాధ్యతను గుర్తించి బీజేపీపై ముందుగా కదనశంఖాన్ని పూరించిన కేసీఆర్ ప్రశంసనీయులు! ఎందుకంటే? కేసీఆర్ శంఖారావంతో.. వామపక్షాలు జతకలి శాయి. కేసీఆర్ స్ఫూర్తితో ప్రభుత్వాలను కూల్చే బీజేపీ కుట్రను ఛేదించి విజేతలుగా నిలిచారు జార్ఖండ్ హేమంత్ సోరెన్ – ఢిల్లీ కేజ్రీవాల్, బీహార్-నితీష్కుమార్లు! బీజేపీ ముక్త్ భారత్కు ఇవన్నీ శుభ సంకేతాలే! భరతమాతకు శుభమస్తు! తథాస్తు!
పాతూరి ,వేంకటేశ్వరరావు
98490 81889