మునుగోడు నియోజకవర్గం… ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే గ్లాసు మంచి నీళ్లు ఇవ్వడానికి జనం ఇబ్బంది పడిన ప్రాంతం. తాగడానికి మంచినీళ్లు కొనుక్కొని చాలా జాగ్రత్తగా వాడుకునేవారు. ఎందుకంటే అక్కడ అంతా ఫ్లోరైడ్ జలాలే. ఆ నీరు తాగడానికే కాదు… స్నానానికీ పనికొచ్చేది కాదు. ఈ ఫ్లోరైడ్ సమస్యే తెలంగాణ ఉద్యమానికి ఒక కారణం కూడా అయింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఫ్లోరైడ్ పీడ వీడింది. మంచినీటితో తలస్నానం చేసే పరిస్థితులు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ ఆశయాలు నెరవేరాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి.
మునుగోడులో ఏదైనా చేయాలంటే ఇంతకుమించిందేమైనా ఉండాలి. కనీసం చేస్తామని చెప్పగలగాలి. లేదంటే అలాంటి వాటికోసం పోరాడుతామని అయి నా ప్రకటించాలి. ఆ విధంగా చెప్పినవారికే ప్రజా జీవితంలో ఆదరణ ఉంటుంది. ఇలాంటి సమస్యో, కారణమో ఏదీ లేకుండానే మునుగోడు నియోజకవర్గ ప్రజల నెత్తిన ఉప ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇందుకు ప్రజల సమస్య కారణమా? కాదు. పోనీ సిద్ధాంతపరమైన అంశాలున్నాయా? కానే కాదు. మరెందుకు? ఇది ప్రజలకు తెలియదు. నిజానికిది వారికి సంబంధం లేని వ్యవహారంగా మారింది.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతి పక్షంలో ఉంటూనే ప్రజల కోసం ఎంతో చేయవచ్చు. ఆ విధంగా చేసిన నాయకులెందరో ఉన్నారు. కానీ, రాజగోపాల్రెడ్డి ఏ మేరకు చేశారన్నది పెద్ద ప్రశ్న. అలాంటిది, అసలు పదవికే ఎందుకు రాజీనామా చేశారన్నది నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలు ఆయనను రాజీనామా చేసేలా ప్రోత్సహించి ఉండవచ్చు. కాంగ్రెస్లో కుమ్ములాటలు కొత్తే మీ కాదు. అలాంటిదేమైనా ఉంటే ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల వద్దకు వచ్చి తమ గోడును చెప్పుకొంటారు. ప్రజలకు సమస్యలను వివరిస్తారు. అవేవీ ఫలించనప్పడు ఓ దండం పెట్టి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. అంతే తప్ప ఐదేండ్లపాటు పదవిలో కొనసాగాలంటూ ప్రజలిచ్చిన తీర్పును మాత్రం కాదనరు. రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసి, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అసలు ఉనికే లేని బీజేపీలో చేరారు. ఆపరేషన్ కమల్కు ఆయన ప్రభావితమయ్యారన్న వాదన కూడా నడు స్తున్నది. పార్టీలు మారడం ఆయన వ్యక్తిగతం. అయితే దాని ప్రభావం ప్రజలపై ఎందుకు ఉండాలన్నదే సమస్య.
ప్రజా సమస్యలపైనో, సిద్ధాంతపరమైన విభేదాలతోనో పదవిని వదులుకోలేదు. వ్యక్తిగత కారణాలతో ప్రజలపై ఉప ఎన్నికలను రుద్దడం శ్రేయస్కరమా? నియోజకవర్గ ఓటర్లు దీనిగురించే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. పోనీ గెలిచినా పార్టీ పేరు మారుతుందే తప్ప మళ్లీ ప్రతిపక్షంలోనే ఉంటారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా సాధించుకొస్తామంటే అది సాధ్యపడేదేనా? ఆ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రి చేయలేని పనులను ఒక్క ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు? ఈ ఉపఎన్నిక ఎందుకు? ఎవరి కోసం? ఆయన స్వార్థం కోసమే కదా?
బీజేపీని బలోపేతం చేయడం కోసమే ఈ ఉప ఎన్నిక పెడుతున్నారంటూ పబ్లిక్లో టాక్ నడుస్తోంది. ఒక పార్టీ బలపడటం కోసం ఇలా ప్రజలపై ఎన్నికలు రుద్దటం సముచితమా? దీనివల్ల ఎంత ప్రజాధనం వృథా అవుతుంది? దీనిగురించి సమాధానం చెప్పేదెవరు? ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకొని రాజకీయాలను నడుపుతామంటే ప్రజామోదం లభిస్తుందా? సంఘ్ పరివార్ ఇప్పుడు కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ది రాజకీయ కుటుంబం అన్న మాటను బీజేపీ మరిచిపోయింది. విమర్శలు చేయడమే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర బీజేపీకి లేదు. మోదీ ఎనిమిదేండ్ల హయాంలో తెలంగాణకు ఏం చేశారన్నదానిపై చెప్పుకోవడానికీ ఏమీ లేదు. పైగా, తెలంగాణ ఏర్పాటును ఎప్పటికప్పుడు అవమానించేలా వ్యాఖ్యలు చేసిన చరిత్ర మోదీది. అలాంటి పార్టీ తరఫున గెలుపొంది ఏదో సాధిస్తారని భావిస్తే పొరపాటే అవుతుంది. అసెంబ్లీ కాలపరిమితి మూడేండ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడేవో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పడం సమంజసం కాదు.
చివరికి అసలు ఈ ఉప
ఎన్నిక ఎందుకు వచ్చింది? దీని వెనుక ఏమైనా ప్రజా ప్రయోజనం ఉందా? అన్న ప్రశ్నలు మునుగోడు ఓటర్ల మదిలో నెలకొన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం బీజేపీ చెబుతుందా? కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెబుతారా?
గోసుల శ్రీనివాస్ యాదవ్
98492 90606