‘ఇప్పుడంతా అధికారమే సర్వస్వమైపోయింది. ఈ పరిస్థితులు చూస్తే.. నాకు రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తున్నది. మంచిపనులు చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేద’ంటూ కేంద్రమంత్రి గడ్కరీ తాత్వికంగా, వేదాంత ధోరణిలో మాట్లాడారు. అసలు గడ్కరీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది?
నితిన్ గడ్కరీకి ప్రస్తుత కేంద్ర క్యాబినెట్లో శక్తిమంతుడైన మంత్రిగా పేరున్నది. 2014లో మోదీ తొలి దఫా ప్రభుత్వం నుంచి కీలక మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి గడ్కరీ నోట రాజకీయ వైరాగ్య మాటలు అందరినీ ఆశ్చర్యంలో పడేశాయి. నిజానికి గడ్కరీ ఎదుగుదలే ఓ ఉత్తుంగ కెరటంలా సాగింది. నాగపూర్ నగర వీధు ల్లో ఒకప్పుడు బీజేపీ పోస్టర్లు అతికిస్తూ, గోడలపై రాతలు రాసిన కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారా యన. 2010లో 52 ఏండ్ల పిన్న వయసులోనే పార్టీ అధ్యక్షుడయ్యారు.
ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రిగా గడ్కరీ పనితీరును స్పైడర్ మ్యాన్గా బీజేపీ ఎంపీ తపిర్గారో కీర్తించారు. కానీ ప్రభుత్వంలో ఆయన పనితీరుకు సరైన గుర్తింపు దక్కటం లేదు. గడ్కరీని 2014లో రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రిని చేశా రు. కొద్దిరోజులకే గోపీనాథ్ ముండే ఆకస్మిక మరణంతో ఆయన నిర్వహించిన గ్రామీణాభివృద్ధి, పం చాయతీరాజ్శాఖ కూడా అప్పజెప్పారు. 2017 వచ్చేసరికి ఉమాభారతి నిర్వహించిన జలవనరు లు, నదుల అభివృద్ధి, గంగానది పునరుద్ధరణ లాంటివి కూడా అదనంగా ఆయనకే అప్పగించారు. రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు రవాణా శాఖ దక్కించుకున్నా, గతంలో నిర్వహించిన జలవనరుల వంటి ముఖ్యమైన శాఖలు దూరమయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ అప్పగించినా ఆ తర్వాతి రోజుల్లో గడ్కరీ నుంచి ఆ శాఖను కూడా లాక్కున్నారు.
మోదీ ప్రభుత్వంలో గడ్కరీ ప్రాధాన్యం తగ్గిపోయిందన్న దానికి తార్కాణంగా ఈ పరిణామాలను చెప్పవచ్చు. గతంలో అయితే క్యాబినెట్ మీటింగులలో గడ్కరీ ప్రాధాన్యం కొట్టొచ్చినట్లు కనిపించేది. ఇప్పుడు ఆయన స్పందనే ఉండటం లేదు. నోరుతెరిచి మాట్లాడటం లేదు. ఢిల్లీకి తాను బయటి వ్యక్తిని అయిపోయానని కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా మీడియాకు చెప్పుకొన్నారు కూడా.
బీజేపీ అధ్యక్షుడిగా గడ్కరీ ఉన్న కాలంలో డీ-4 లేదా ఢిల్లీ-4.. అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, అనంత్కుమార్లు అంతా తామై నడిపించేవారు. గడ్కరీకి సవాల్గా నిలిచారు. ఇప్పు డు ఆ డీ-4 లేదు. కానీ… గడ్కరీ మాత్రం మోదీ-షా హయాంలో ఔట్సైడర్గానే మిగిలిపోయారు. గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలను గుర్తించి అనేకమంది నేతల ఎదుగుదలకు కారణమయ్యారు. వారిలో ధర్మేంద్ర ప్రధాన్, స్మృతీ ఇరానీలను చెప్పుకోవచ్చు. అలాంటివారు స్వీయరక్షణార్థం గడ్కరీకి ఎడంగా ఉంటున్నారు.
మోదీ-షా ద్వయం.. తమకు విధేయులైన కొత్త నాయకత్వాన్ని ముందుకు తెచ్చే పని పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో సీనియర్లంతా ప్రాధాన్యం తగ్గిపోయి, తమ భవిష్యత్తుపై తెలియని అభద్రతాభావంలో కూరుకుపోయారు. 2014లో మోదీ 19 మందిని క్యాబినెట్ మంత్రులుగా తీసుకున్నారు. అందులో నలుగురు గోపీనాథ్ ముండే, సుష్మా స్వరాజ్, అరుణ్జైట్లీ, అనంతకుమార్ అకాల మర ణం చెందారు. వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతిని చేసి, మరో ముగ్గురిని గవర్నర్లుగా పంపారు. 2014 నాటి కేంద్ర మంత్రులు 19 మందిలో ఇప్పుడు నలుగురే మిగిలారు. వారు.. గడ్కరీ, రాజ్నాథ్సింగ్, నరేంద్ర థోమర్, స్మృతీ ఇరానీ. మొత్తం గా చూస్తే.. 2014 నుంచి 69 మంది మంత్రి పదవులను కోల్పోయారు. అందరూ పార్టీలో, అధికారంలో ప్రాబల్యాన్ని కోల్పోయి కనుమరుగయ్యారు. ఉమాభారతి మద్యం దుకాణాలపై రాళ్లు వేస్తూ వార్తలో నిలుస్తూ, గత ప్రాధాన్యాన్ని కోరుకుంటున్నారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్, సురేష్ప్రభు, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తదితరులు కూడా ఉమా బాటలో నడుస్తున్నారు.
నితిన్ గడ్కరీ బీజేపీ అత్యున్నత నిర్ణయాత్మక వేదిక అయిన పార్లమెంటరీ బోర్డు సభ్యుడు. ప్రస్తుతం పార్లమెంటరీ బోర్డు సమావేశాల్లేవు, చర్చలూ లేవు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. మోదీ-షా ముందే నిర్ణయించిన విషయాలను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించటంగా మారిపోయింది. గడ్కరీ స్వరాష్ట్రం మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేశారు. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ గడ్కరీ బయటివ్యక్తిగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.
మోదీ రెండో దఫా ప్రభుత్వంలో నలుగురే సీనియర్లు. అదే మోదీ మూడో దఫా వస్తే.. ఎంతమంది మిగులుతారో! ప్రస్తుత కేంద్ర క్యాబినెట్లో స్వతంత్రంగా నిర్నయాలు తీసుకొని అమలుచేసే ఒకే ఒక్కడుగా గడ్కరీ పేరుగాంచాడు. ఈ పరిస్థితుల్లోనే… ప్రధాని కార్యాలయం (పీఎంఓ) నుంచి గడ్కరీకి తాఖీదులందాయి. వారానికోసారి నాగపూర్ (ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం) సందర్శనను నిలిపేయాలని ఆ తాఖీదు సారాంశం. పీఎంఓ లేఖ సారాంశాన్ని విన్న గడ్కరీ నవ్వుతూ… ‘నాకు ఈ లేఖను పంపించినవారికి చెప్పండి.. నాగపూర్ నా నియోజకవర్గం. వేలాదిమంది చిన్న చిన్న పనుల కోసం, నా కోసం ఎదురు చూస్తుంటారు. వారిని నేను నిరాశ పర్చలేను..’ అని సమాధానం ఇచ్చారు.
మోదీ హయాంలోనూ ఆర్ఎస్ఎస్తో గడ్కరీకి బలమైన సంబంధాలు కొనసాగాయి. అయితే, ప్రస్తుత అధికార పంపిణీలో సరైన స్థానం దక్కటం లేదన్న బెంగతోనే ఈ తాత్విక, వేదాంత ధోరణిలో గడ్కరీ మాట్లాడారని స్పష్టమవుతున్నది.
– డీకే సింగ్