నేడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కాళేశ్వరం, ఒకప్పుడు కారడవిలో మిణుకు మిణుకుమంటూ వెలిగే దివ్యక్షేత్రం. నేడు ప్రపంచ ప్రసిద్ధ సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నాడు పాలంపేట పొలాల మధ్యన విస్మృత మందిరం. ఈ రెండింటిపై ప్రత్యేక కథనాలతో కూర్చిన కవర్ స్టోరీలను అందించిన ఘనత మన తెలుగు తొలి ప్రధాని, సరస్వతీ పుత్రుడైన పీవీ నరసింహారావుది అన్న విషయం చాలామందికి తెలియదు. కాళేశ్వరంపై పీవీ రాసిన వ్యాసం ‘ఆంధ్ర సచిత్ర’ వార పత్రిక స్వర్ణోత్సవ సంచిక (జనవరి 14, 1959)లో ప్రచురితమైంది. ‘జ్యోతిర్లింగ క్షేత్రం కాళేశ్వరం’ అన్న శీర్షికతో రాసిన ఈ విశేష వ్యాసం ఎత్తుగడేఎంతో ఆకర్షణీయంగా ఉన్నది
‘దాదాపు రెండు వేల ఏండ్ల నుంచి తెలుగు దేశానికి ఉత్తర సరిహద్దున విలసిల్లిన కాళేశ్వరం మహాక్షేత్రం నేడొక కుగ్రామంగా దీనావస్థలో ఉన్నది. కాలపురుషుని రాపిడి వల్ల శిథిలావస్థకు గురైనప్పటికీ ఈ ప్రాంతంలో అడుగుపెట్టే ప్రతి ఆంధ్రుని హృదయంలోను, ఆంధ్రదేశ పూర్వవైభవ ప్రాభవాల గర్వం పెల్లుబుకుతుంది. అత్యుత్తమమైన ఆంధ్రసంస్కృతి పట్ల అభిమానం ఇనుమడిస్తుంది. చాళుక్య కాకతీయ సామ్రాజ్యాల స్వర్ణయుగ దృశ్యం మనశ్చక్షువుల ఎదుట సాక్షాత్కరిస్తుంది’… ఇలా మొదలైన ఈ వ్యాసం కాళేశ్వరం భౌగోళిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వర్ణనతో కొనసాగింది. ఈ క్షేత్రం తొలుత బౌద్ధ, జైన కాలం నాటిదని తర్వాత శైవక్షేత్రంగా మారిందని, చెప్తూ ఆంధ్ర మహావిష్ణువు గాథను కూడా ఉదహరించి తన విశేష అవగాహనను చారిత్రక దృష్టిని పీవీ తెలిపారు. ఈ క్షేత్ర మహత్యాన్ని స్కంధ పురాణంలోని శ్లోకాలతో ఉదహరించారు. దామెరకుంట తామరకుంటయని, ఇక్కడినుంచి తామరపూలతో శివుడిని అభిషేకించేవారని పరిశోధనాత్మకంగా విశ్లేషించారు.
రామప్ప గుడి గురించి 1966లో ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో ‘రాతి నుంచి వికసించిన రాగవిరి’ (Ramappaa symphony in stone) శీర్షికతో ఆంగ్లంలో రాసిన ప్రత్యేక వ్యాసం రామప్ప గుడిలోని అనేక విశేషాలను, శిల్ప సౌందర్యాన్ని తెలియజేస్తుంది. ఈ వ్యాసం ఒక యాత్రాదర్శిని (గైడ్) వలె ఉపకరిస్తుంది. వ్యాసం ఇలా మొదలైనది. ‘రామప్ప దేవాలయం.. అక్షరాల్లో వ్యక్తం చేయలేనటువంటి అపురూపమైన నిర్మాణం. చరిత్రకారులు, వాస్తుశిల్ప శాస్త్రవేత్తలు, ఈ విశిష్ట ఆలయ నిర్మాణంలోని సాంకేతికతను వివరించడానికి ఎంతో ప్రయత్నించారు. సందర్శకులను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ఆలయంలోని మామూలు శిల్పాన్ని సైతం వర్ణించలేక విఫలమయ్యారు. ఇక్కడ కళ్లతో చూసేదాన్ని సమగ్రంగా చిత్రించలేమన్నది మాత్రం నిజం.
ఆంధ్రప్రదేశ్లో చెరువుల జిల్లాగా పేరున్న వరంగల్ జిల్లా ప్రధాన కేంద్రం నుంచి ఒక రోడ్డు మొదలై అటవీప్రాంతం దాటి ములుగుకు దారితీస్తుంది. అలా దాదాపు 30 మైళ్ల తదుపరి మీ కారు ఎడమవైపు తిరిగాక గతుకుల బాటలో రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోంచి వెళ్లాక ఓ చిన్న కుగ్రామమైన పాలంపేట వస్తుం ది. ఇది శతాబ్దాల కిందట ఎంతో అభివృద్ధి చెందిన నగరమని ఎవరికీ అనిపించదు. పాలంపేట గ్రామం గుండా వెళ్లాక రోడ్డుకు కాస్త ఎడమవైపున, అకస్మాత్తుగా ఓ పెద్ద దేవాల యం తాలూకు వెనుక భాగం కనిపిస్తుంది. ఈ దృశ్యం వర్ణనాతీతం. ఇదెలా కనిపిస్తుందంటే ఒక ప్రాచీన పక్షి కొమ్మపై నుంచి వినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమవుతున్నట్లు! రామప్ప చెరువు నుంచి ఆరడుగుల వెడల్పుతో ఒక నీటి కాలువ దేవాలయం ప్రహరీ గోడ పక్క నుంచి ఆనుకొని వెళ్తుంది. ఈ కాలువను దాటితే మనం ఓ చిన్న ఇరుకైన ద్వారం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాం’.
ఒక సినిమా కెమెరా చూపించినట్లుగా పీవీ వర్ణించారు. ఈ వ్యాసాలు చదివాక పీవీకి తెలంగాణ మట్టి, సంస్కృతి పట్ల గల అవగాహన, మమకారం మనకు విదితమవుతుంది. ఈ వ్యాసాలు ఇంతవరకు ఎవరూ వెలుగులోకి తీసుకురాలేదు. ఇలాంటి వ్యాసాలెన్నో పీవీ గుప్త నిధిలో ఉన్నాయి. వీటిని వెలుగులోకి తెస్తే తెలంగాణ గురించి మరిన్ని అంశాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
డాక్టర్.వి.వి.రామారావు, 98492 37663
(వ్యాసకర్త: ఆకాశవాణి ప్రయోక్త, సాహితీ చరిత్ర విశ్లేషకులు)