‘నేను ఫకీర్ లాంటివాడిని.. రేపటి రోజు జోలె పట్టుకొని వెళ్లిపోతాను. నాకు సంపాదన, ఆస్తిపాస్తులపై ఆశల్లేవు..’ ప్రధాని అయినప్పటినుంచి నరేంద్ర మోదీ చెప్తున్న మాటలు. ఎక్కడికెళ్లినా ఇవే మాటలు వల్లెవేస్తుంటారు. ఆయన క్యాబినెట్ మంత్రులు, బీజేపీ నేతలు కూడా తమ సర్కారు అవినీతికి ఆమడ దూరం ఉంటుందని చెప్పుకొంటారు. గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తారు. మరి ఇప్పుడు నరేంద్ర మోదీకి అధికారంలో ఉండే హక్కున్నదా? అవినీతి వాసనే తెలియదంటూ మోదీ చేస్తున్నదేమిటి? తన కార్పొరేట్ మిత్రుల కోసం చేస్తున్నది అవినీతి కాదా? అవినీతిపరులకు అధికారంలో ఉండే హక్కు లేదనే మోదీకి అసలు ప్రధాని పదవిలో కొనసాగే హక్కున్నదా?
ప్రధాని అంటే దేశంలో ప్రజలందరికీ నాయకుడు. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఆ అర్థం పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రజలకు ప్రధాని కాదు, కార్పొరేట్లకు మిత్రుడు, వారి వ్యాపారాలు చక్కదిద్దేందుకు ఓ సూత్రదారి మాత్రమేనని విమర్శలున్నాయి. విదేశీ పర్యటనలకు వెళ్తే దేశాభివృద్ధికి సంబంధించిన ఒప్పందాలు జరగాలి. కానీ కొన్ని కంపెనీలకే లాభం జరిగేలా మోదీ పర్యటనలు ఉంటున్నాయనే ఆరోపణలకు కొదవ లేదు. దేశ సంపదే కాదు, విదేశీ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని మోదీపై ఆరోపణలున్నాయి. అవి ఆరోపణలు కాదు, వాస్తవాలేనని ఇప్పుడు స్పష్టమైంది. తన మిత్రులైన అంబానీ, అదానీల కోసం విదేశాలపైనా నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా ఉన్నది.
ఇవిగో సాక్ష్యాలు: శ్రీలంకకు చెందిన ఓ అధికారి చేసిన ప్రకటన ఇప్పుడు దుమారం రేపుతున్నది. శ్రీలంకలో ‘విండ్ పవర్ ప్రాజెక్టు’ అదానీ సంస్థకు దక్కింది. అయితే.. ‘ప్రధాని మోదీ ఒత్తిడి వల్లే ఈ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టాల్సి వచ్చింద’ంటూ పార్లమెంటరీ స్థాయీసంఘం నిర్వహించిన విచారణలో.. సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో బహిరంగంగా చెప్పా రు. 2021లో శ్రీలంక ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్స్కు కేటాయించింది. దీని విలువ 500 బిలియన్ డాలర్లు. విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపుల కోసం శ్రీలంకలో గ్లోబల్ టెండర్లను పిలిచే వ్యవస్థ ఉన్నది. కానీ అలాకాకుండా నామినేషన్ పద్ధతిలో అదానీకి కేటాయించారంటూ ముందునుంచి ఆరోపణలున్నాయి.
దోస్తీ లెక్క చాలా ఉంది: శ్రీలంక ఇష్యూ బయటికి రావడంతో ఇప్పుడు మోదీ, అదానీ అసలు స్నేహం బయటపడుతున్నది. ఇద్దరి మధ్య ఉన్న దోస్తీ లెక్కలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రధాని హోదాలో మోదీ ఏ దేశానికి వెళ్లినా అదానీ కోసం ఏదో ఒక ఒప్పందం చేసుకోకుండా తిరిగిరావడం లేదనేది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చెప్తున్న సత్యం. దక్షిణ కొరియా ప్రధానితో మోదీ భేటీ ఫలితంగా అదానీ కంపెనీకి రూ.37,500 కోట్ల విలువైన ప్రాజెక్టు దక్కింది. ఆస్ట్రేలియా వాణిజ్య శాఖ మంత్రితో మోదీ భేటీ ఫలితంగా ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనులకు లైన్ క్లియర్ అయ్యిందంటూ వార్తలొచ్చాయి. 2015 ఏప్రిల్ 9-15 మధ్యకాలంలో, 2017 జూన్ 2,3 తేదీల్లో మోదీ ఫ్రాన్స్ పర్యటించారు. ఈ కాలంలోనే రాఫెల్ డీల్పై చర్చలు జరిగాయి. ఇందులో రిలయన్స్ అనిల్ అంబానీతో పాటు అదానీకి కాంట్రాక్టు దక్కేలా మోదీ మధ్యవర్తిత్వం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్లమెంట్లోనూ రగడ జరిగింది.
ఇక.. 2016 ఫిబ్రవరి 13న స్వీడన్ ప్రధాని భారత్కు వచ్చారు. 2015 మార్చి 22న స్వీడన్తో అంబానీ కంపెనీ అగ్రిమెంట్ జరిగింది. తర్వాత 2017 సెప్టెంబర్ 1న సింగిల్ ఇంజిన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియాలో తయారుచేయడానికి అదానీతో ఒప్పందం జరిగింది. 2018 ఏప్రిల్ 16-18 వరకు స్వీడన్లో మోదీ పర్యటించారు. ఇజ్రాయెల్కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్తో అంబానీ కంపెనీకి 2016 మార్చి 29న ఒప్పందం జరిగింది. అలాగే.. Elbit-ISTAR కంపెనీతో 2016 మార్చి 30 అదానీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. 2017 జూలై 4 నుంచి 6 తేదీల్లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు.
2015 జూలై 8-10 వరకు మోదీ రష్యాలో పర్యటించారు. అదే ఏడాది డిసెంబర్ 22, 23 తేదీల్లో రష్యాకు చెందిన అల్మాజ్-యాంటే కంపెనీతో అంబానీ సంప్రదింపులు జరిపారు. 2015 డిసెంబర్ 24న అల్మాజ్ కంపెనీతో అంబానీ కంపెనీ డీల్ అనౌన్స్ చేశారు. 2017 మే 31 నుంచి జూన్ 2 వరకు మోదీ రష్యాలో పర్యటించారు. ఆ తర్వాత 2018 అక్టోబర్ 6న పుతిన్ భారత్కు వచ్చారు. ఈ భేటీలోనే అంబే 2018 అక్టోబర్ 6న అల్మాజ్ కంపెనీతో అంబానీ సంస్థకు ఒప్పందంపై సంతకాలు చేశారు. 2016 జూన్ 6-8 వరకు మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన తర్వాత అంటే 2017 ఫిబ్రవరి 13న అంబానీ కంపెనీకి యూఎస్ నేవీ డీల్ దక్కింది.
మోదీ ప్రధాని అయిన కొత్తలోనే అంటే 2014 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు జపాన్లో పర్యటించారు. ఆ తర్వాత 2016 నవంబర్ 11, 12 తేదీల్లో మరోసారి వెళ్లొచ్చారు. ఈ రెండు పర్యటనలు ముగిశాక.. 2018 జూలై 16న జపాన్కు చెందిన ఎన్వైకే ఆటో లాజిస్టిక్స్ సంస్థతో అదానీకి ఒప్పందం కుదిరింది. 2014 నవంబర్ 14-18 వరకు మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలోనే అంటే.. నవంబర్ 16న అదానీకి ఆస్ట్రేలియాలో రైల్వే, మౌలికవసతుల ప్రాజెక్టులు దక్కాయి. 2015 నవంబర్ 21, 22 తేదీల్లో మోదీ మలేషియా వెళ్లారు. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 3న ఐలాండ్ పోర్ట్ ప్రాజెక్టు కోసం అదానీతో మలేషియా ఒప్పందం చేసుకున్నది. అలాగే 2016 జులై 7న మోదీ మొజాంబిక్కు వెళ్లారు. ఆ తర్వాతే, అంటే.. 2015 అక్టోబర్ 19న పప్పులు, ధాన్యాలకు సంబంధించి అదానీ కంపెనీతో మొజాంబిక్ అగ్రిమెంట్ చేసుకున్నది. ఇక.. 2015 జూన్ 6,7 తేదీల్లో మోదీ బంగ్లాదేశ్లో పర్యటించిన సమయంలో బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు కాంట్రాక్టు అదానీకి దక్కింది.
దేశంలోనూ దోపిడే: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ బొగ్గు దిగుమతుల కాంట్రాక్టుల్లో మెజారిటీ వాటా అదానీ ఎంటర్ప్రైజెస్దే. 6.25 మిలియన్ టన్నుల ఎన్టీపీసీ బొగ్గు కాంట్రాక్టును అదాని ఎంటర్ప్రైజెస్ దక్కించుకున్నది. దీని విలు వ రూ.6,585 కోట్లు. దేశవ్యాప్తంగా మార్చిలో కొరత ఏర్పడిన సమయంలో 5.75 మిలియన్ టన్నుల మేర బొగ్గును దిగుమతి చేసుకోవడానికి దాఖలు చేసిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అదానీ ఎంటర్ప్రైజెస్కే దక్కడం విశేషం. అదానీకి సొంతంగా ఆస్ట్రేలియాలో క్యార్మికెల్ కోల్మైన్ ఉన్నది. దీని ఉత్పాదక సామర్థ్యం ఏటా 10 మిలియన్ టన్నులు. దేశీయంగా నెలకొన్న కొరతను అధిగమించడానికి 10 శాతం మేర విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ ఎన్టీపీసీకి అనుమతినిచ్చింది.
మొదట కాంట్రాక్టు తన దోస్తుకు కట్టబెట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు రాష్ర్టాలపై పెనుభారం మోపుతున్నది. విదేశీ బొగ్గును రాష్ర్టాలు కచ్చితంగా కొనాల్సిందేనని కండిషన్ పెట్టింది. తాము చెప్పిన గడువులోపు 10 శాతం ఇండెంట్ పెడితే ఓకే, లేకపోతే ఆ తర్వాత 15 శాతం విదేశీ బొగ్గు కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు దేశీయ బొగ్గు కేటాయింపులను క్రమంగా 5 శాతం చొప్పున తగ్గిస్తూ పోతామని కూడా కేంద్రం ప్రకటించింది. అంటే.. ఈ నిర్ణయాలన్నీ ఎవరి మేలు కోరి చేస్తున్నట్టు? ఇందులో ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నట్టు? తెలంగాణలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్కువ ధర పెట్టి విదేశీ బొగ్గు కొనాల్సిన అవసరం మనకేంటి?
తెలంగాణలో దొరికే బొగ్గు నాణ్యమైనది. అందుకే దానికి డిమాండ్ ఎక్కువే. టన్ను బొగ్గుకు రూ.4 వేలు పలుకుతున్నది. రాష్ర్టానికి రోజు 50 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. అయితే, రాష్ట్ర అవసరాల్లో 10 శాతం విదేశీ బొగ్గు కొనాలని మోదీ సర్కారు నిబంధనలు పెట్టింది. అది కూడా ఒక్కో టన్నుకు రూ.24,400 చెల్లించాలి. మన రాష్ట్రంలో పుష్కలంగా బొగ్గు నిల్వలుండగా 600 శాతం అధిక ధరకు కొనాల్సిన అవసరమేంటి? మోదీ సర్కారు చెప్పినట్టు 10 శాతం విదేశీ బొగ్గు కొనాల్సి వస్తే.. రోజుకు 5 వేల టన్నులు కొనాలి. దీనికి ఏటా దాదాపుగా రూ.4,500 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. రవాణా ఖర్చు కింద మరో రూ.500 కోట్ల భారం పడుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విదేశీ బొగ్గు కొనేది లేదని తేల్చిచెప్పింది.
ఇలా.. ప్రధాని మోదీ ప్రతి విదేశీ పర్యటనలో తన మిత్రుల అభివృద్ధి కోసం తప్ప, దేశం కోసం చేసింది సున్నా. ప్రధాని హోదాలో విదేశాలకు వెళ్తున్న మోదీ చేస్తున్న ఘనకార్యాలివి. కానీ బీజేపీ, దాని అనుబంధ వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రచారం మాత్రం మరొకటి. దేశానికి వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసుకుంటారు. అదే నిజమైతే.. దేశ ప్రజల సంపద పెరగాలి. కానీ ప్రజలు నానాటికి పేదలుగా మారిపోతున్నారు. అంబానీ, అదానీ ఆస్తులు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో అదానీ ఆస్తులు 1,800 శాతం పెరిగాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆస్తుల విలువ వంద బిలియన్ డాలర్లను దాటింది.
‘ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్’ ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీది తొమ్మిదో స్థానం. గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యుల ఆస్తుల విలువ 100.4 బిలియన్ డాలర్లు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ను పరిగణనలోకి తీసుకున్నా.. అదానీ ఆస్తుల విలువ 98.4 బిలియన్ డాలర్లు. ఆసియా వరకు చూసుకుంటే అత్యంత సంపన్నవర్గాల జాబితాలో గౌతమ్ అదానీ రెండోస్థానంలో కొనసాగుతున్నారు. మొదటిస్థానంలో మోదీ మరో మిత్రుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు.
తన మిత్రుల కోసం ప్రధాని మోదీ ఇన్నాళ్లుగా బయటపడకుండా రాయబారం నడిపించారు. అయితే.. ఇప్పుడు తన మిత్రుడి కోసం మోదీ పొరుగు దేశంపై ఒత్తిడి తీసుకువచ్చారనే విషయం స్పష్టమైంది. అంటే ఇందులో మోదీ ఏదో లాభం ఆశించి చేసినట్టే కదా! ఇంతటి అవినీతికి పాల్పడిన నరేంద్ర మోదీకి ప్రధాని పదవిలో ఉండే అర్హత ఉన్నదా? అంటే ఎట్టి పరిస్థితిల్లోనూ లేదు. తాను చేసిన తప్పునకు బాధ్యతగా మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే. లేకపోతే సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాల్సిందే. లేకపోతే నేడు సగర్వంగా నిలబడిన భారత్ ప్రపంచదేశాల ముందు దోషిగా తల దించుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురిస్తుంది.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్)
వై.సతీష్రెడ్డి
96414 66666