‘ఆకాశం అందుకునే ధరలొక వైపు- అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు! కాంచవోయి నేటి దుస్థితి- ఎదిరించవోయి ఈ పరిస్థితి!!’ అని శ్రీశ్రీ ఎప్పుడో రాసినా నేటికి అది సరిగ్గా సరిపోతున్నది. కొవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుల బతుకులకు భారంగా మారినా అదుపులో పెట్టడానికి కనీస చర్యలు చేపట్టకపోవడం నేటి కేంద్ర పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థ కుదేలైంది. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించే దుస్థితి తలెత్తింది. దినసరి కూలీలను కలుపుకొంటే కోట్ల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. దీనికితోడు చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు పుండు మీద కారం చల్లినట్లున్నది. ముఖ్యంగా మధ్య తరగతి, పేద ల జీవితాలు దుర్భరమయ్యాయి. అర్ధాకలితో అలమటించే పరిస్థితులున్నాయి. పేదలు రేషన్బియ్యం తీసుకున్నప్పటికీ, ఇతర సరకుల ఖర్చు పెరిగిపోవటంతో వారు అల్లాడుతున్నారు. కూరగాయలు, వంట నూనెలు, పప్పు, ఉప్పుల ధరలు రెండింతలు పెరిగిపోయినా కేంద్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం విడ్డూరం.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్ ధరలు గత నెలరోజుల్లో రోజుకింత పెరిగాయి. దీంతో రవాణా ఖర్చులు పెరిగాయి. గ్యాస్ ధర వెయ్యి రూపాయలు దాటడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రజల ఇక్కట్లు చూసైనా ఇంధన ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవటం లేదు. కాకపోగా రాష్ర్టాలే ఇంధన ధరలు తగ్గించాలని ఉచిత సలహాలిస్తూ బాధ్యత నుంచి తప్పుకొంటున్నది. పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా ప్రజలకు అండగా నిలుస్తున్నది. కరోనా సమయంలో వలస కార్మికులకే కాకుండా ప్రజలను అనేక విధాలుగా ఆదుకున్నది. ఆహారధాన్యాల ఉచిత సరఫరాతో పాటు, అవసరమైన ఆర్థికసాయం కూడా అందించింది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇక్కట్ల పాలవుతుంటే, కేంద్రం మాత్రం తన ఖజానా నింపుకోవటానికే ప్రాధాన్యం ఇస్తున్నది. ఆదాయ లోటు సర్దుబాటు కోసం కేంద్ర సర్కారు పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలను పెం చి ఆదాయాన్ని మూడింతలు పెంచుకున్న ది. కేంద్ర అకౌంట్స్ శాఖ గణాంకాలను పరిశీలిస్తే, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఎక్సైజ్ సుంకాల రూపం లో ఆదాయం రూ.1.71 లక్షల కోట్లు. కాగా అంతకుముందు అది రూ. 1.28 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.
అన్నిరకాల వస్తువులు ధరలు పెరగటానికి పెట్రోల్, డీజిల్ ధరలే కారణమని తేలిన తర్వాత కూడా, కేంద్రం ధరలు తగ్గించకుండా తప్పించుకుంటున్నది. ధరలు తగ్గటానికి రాష్ర్టాలు ఇంధనాలపై పన్నులు తగ్గించాలంటున్నది! ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రజలపై అనేక రూపాల్లో భారం పడుతున్నది. పండించే పంట దగ్గరి నుంచి కొనుగోలుదారుకు చేరేదాకా రవాణా ఖర్చులు పెరిగి, ఉత్పత్తిదారుకు లాభం లేకపోయినా, వినియోగదారుడిపై భారం పడుతున్నది.
ముఖ్యంగా వ్యవసాయదారులకు దున్నడానికి ట్రాక్టర్లను, కోయడానికి మెషిన్లను ఉపయోగిస్తున్న రైతులకు ఖర్చులు భారీగా పెరిగాయి. కానీ పండించిన పంటకు మాత్రం మార్కెట్లో తగిన ధర రావటం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు ఇచ్చి వ్యవసాయదారునికి దన్నుగా నిలిచిన్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎరువులు, పెట్రోధరలు పెంచి వెన్నుపోటు పొడుస్తున్నది.
2014లో మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం మూడు రెట్లు పెరిగాయి. ఈ సంక్షుభిత సమయంలో ఏ ఆధారం లేని నిరుద్యోగుల కుటుంబాలు ఎలా మనుగడ సాగిస్తాయి? మోదీ అధికారంలోకి వచ్చేముందు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల నుంచి నల్లడబ్బు తెచ్చి ప్రతి ఒక్కరికీ పంచుతానన్నారు. ఈ హామీలు నెరవేర్చి ఉంటే 16 కోట్ల కుటుంబాలు ఇప్పు డు సాఫీగా జీవనం సాగించేవి.
ఇప్పటికైనా మోదీ ఊకదంపుడు ఉపన్యాసాలు, విదేశీ టూర్లు తగ్గించి సామాన్యుల జీవన స్థితిగతులను పట్టించుకోవాలి. లోపభూయిష్టమైన విధానాలను మార్చుకొని, ధరలను నియంత్రించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లు ఇచ్చేవిధంగా చట్ట సవరణలు చేయాలి. దేశాన్ని, దేశ సంపదను, దేశ ప్రజానీకాన్నీ కాపాడటం కేంద్ర ప్రభుత్వ కనీస ధర్మం.
అట్లూరి రమాదేవి
87906 02121