2022 మార్చి 14: మబ్బుల ఆరు గొట్టంగనేకూరగాయలు వట్టుకొని ఇంటికొచ్చే అవ్వ ఇంకా రాకపోయేసరికి మా పెద్ద తమ్ముడు (మాటలు రావు) సైగ జేస్తున్నడు ‘అవ్వ ఇంకా రాకపాయె? అని. ‘మా అస్తది తియ్యిరా నువ్వైతే గొర్ల మందెంబడి వో’ అని వాన్ని సాగదోలిన. ఇంతల ‘అక్కా.. అవ్వకు లారి గుద్దిందట, కన్నారం దవాఖాన్లకు ఏస్కపోతున్నం, నువ్వు జల్ది రా’ అని మా సిన్న తమ్ముడు ఫోన్జేసిండు. నా పెనిమిటి సదయ్యను తోల్కొని నేను కన్నారం దవాఖానకు పొయ్యేసరికే అవ్వను పట్నం ఏస్కపోయిర్రు. వాళ్లు అంబులెన్సుల ముందట… మేం బస్సుల ఎన్క, పట్నం పొయ్యేసరికి సిమ్మ చీకటైంది.
2022 ఏప్రిల్, 8: రాత్రి ఏడు గొడ్తున్నది, నిమ్స్ దవాఖాన ఓపీ బిల్డింగ్ ఆర్ఐసీయూ నుంచి ఫోన్ల మీద ఫోన్లు అస్తనే ఉన్నయి సదయ్యకు. పొద్దున్నే అవ్వమీద ఇగ ఆశల్లేవని చెప్పిన డాక్టర్ల మాటలు మతికచ్చినయి. విషయం అర్థమైంది. నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ బిల్డింగ్ దగ్గర అందరం ఒక్కకాడ ఏడ్సుకుంటా గూసున్నం. అసలే అవ్వ కాలం జేసిందనే బాధ.. ఆమెను కన్నారం జిల్లా ముంజంపల్లిల మా ఇంటికెట్ల ఏస్కపోవుడనే బాధ గుండెను పిస్కినట్టయితున్నది. సేతిల ఒక్క పైస లేదు. కాల్రెక్కలాడితే గానీ కడుపునిండని జీవితాలకు అవ్వనే పెద్ద దిక్కు. అవ్వ లేకుంటే మావోళ్ల బతుకెట్లా అని ఆలోచిస్తనే వణుకు వుట్టింది. మా ఊరంతా తిరుక్కుంటా కూరగాయలమ్మి అందర్ని సాదిన అవ్వను కనీసం ఇంటిమొకానన్న తీస్కపోతమా అనేది బాధ.
ఇంతల అటుమొకాన వోతున్న ఆర్ఎంఓ గీత మేడం నన్ను చూసి గుర్తువట్టింది. ‘ఏడు గంటలకే మీ అవ్వ కాలంజేసింది గదా? ఈ రాత్రి పదకొండిట్టి దాన్క తీస్కపోకుంటా ఏం జేస్తున్నరు? ఆరు లచ్చల రూపాల బిల్లయ్యింది, బిల్లు కట్టి అంబులెన్సుల ఇంటికి తీస్కపోర్ర’ని పాపం బాధవడుకుంటనే చెప్పింది. ‘ఆరు లచ్చలేమో గని అంబులెన్సుకు గూడ పైసలెవ్వని’ మా గోస జెప్పి నం. పాపం గీత మేడమే అన్ని దారులు సూపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు, మంత్రి హరీశ్ సార్కు మీ ఎమ్మెల్యే రసమయికి ముచ్చట చేరెయిర్రి, మీ కుటుంబ పరిస్థితిని చెప్పుర్రి. వాళ్లు ఆదుకుంటరన్నది.
అవ్వను పట్నం ఏస్కపోయినప్పుడే అన్నిగనం పైసలు మాతోని గావని తెలుసు. కనీ ‘ఆరోగ్య శ్రీ’ కార్డు ఉన్నదనే ధైర్యమే నిమ్స్ దాన్క రప్పించింది. నిమ్స్ దవాఖాన డాక్ట ర్లు ముందుగాళ్ల ఆరోగ్య శ్రీ కింద చూసిర్రు. అదైపోయిన తర్వాత అయిన బిల్లు ఆరు లచ్చల రూపాలు.
గీత మేడం మాటలిన్న సదయ్య వాళ్ల దోస్తు ద్వారా ముచ్చట హరీశ్రావు సారు ఆఫీసుకు చేరేసిండు. అద్దుమనాత్రి 2 గంటల కల్లా మంత్రి ఆఫీసుల నుంచి ఓఎస్డీ శ్రీనివాస్ సార్ ఫోన్జేసిండు. ముచ్చట మొత్తం ఆ సారుతోని జెప్పిన. ‘మీరేం బాధవడకుర్రి, అన్ని కేసీఆర్ సార్, హరీశ్ సార్లు సూస్కంటర’ని ధైర్నం జెప్పిండు. మా ఎమ్మెల్యే బాలకిషనన్న ఆఖరిదాన్క అండగున్నడు. 2022 ఏప్రిల్ 9, మబ్బుల ఐదు గొట్టేసరికి అంబులెన్స్ రానే అచ్చె ఆరన్ కొట్టుకుంటా.. తెల్లారి ఎనిమిది గొట్టేసరికి కన్నారం చేరుకున్నం.
2022 మార్చి 14-ఏప్రిల్ 8: ‘ఆరోగ్య శ్రీ’తో కలిపి మొత్తం తొమ్మిది లక్షల బిల్లయ్యుంటది. కనీ మా చేతిగుంట నిమ్స్ దవాఖాన్ల ఒక్క రూపాయి గట్టలె. అయినా మా అవ్వను మాకప్పజెప్పిర్రు. ఆఖర్కి అవ్వను ఇంటికి తీస్కపొయ్యే అంబులెన్స్ను కూడా నిమ్స్ దవాఖానే డాక్టర్లే ఫ్రీగా పంపింది. ఆ అంబులెన్సుల అవ్వను కన్నారం పట్టుకపోంగ పాత వార్తలు గుర్తుకొచ్చినయి. భుజాల మీద, సైకిళ్లకు కట్టుకొని శవాలను తీస్కపోయే ఇతర రాష్ర్టాల ముచ్చట్లు గుర్తుకొచ్చి గుడ్లళ్ల నీళ్లు తిర్గినయి. ఒక్కసారిగా కేసీఆర్ సార్, నిమ్స్ దవాఖాన, అన్ల పన్జేసే డాక్టర్లు కండ్లల్ల మెరిసిర్రు. వాళ్లకు రెండుజేతులా మొక్కిన. అవ్వను కన్నీళ్లతో సాగనంపుతున్నా.
గోపాల రేణుక