కరీంనగర్ జిల్లా కురిక్యాల గ్రామంలో గుట్ట మీద ఒక పెద్ద బండకు కొన్ని శిల్పాలు, కింద శాసనం చెక్కి ఉంది. బొమ్మలమ్మ గుట్టగా పిలుచుకునే ఈ గుట్ట మీద జైన తీర్థంకరులు, స్థాన దేవతల బొమ్మలున్నాయి.
వేములవాడ చాళుక్యుల కాలంలో జైనం విలసిల్లిందనటానికి ఆధారం ఈ గుట్ట. ఎక్కడానికి అనువుగా లేని ఈ గుట్ట మీద బండలపై ఎనిమిది చేతులతో ఉన్న జైన శాసన దేవత చక్రేశ్వరి శిల్పం, పైన మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడు, చివరి తీర్థంకరుడైన మహావీరుడి శిల్పాలు ఉన్నాయి. చక్రేశ్వరి శిల్పం పీఠం కింద శాసనం చెక్కి ఉంది. నిజానికి ఈ గుట్ట, ఇక్కడి చెక్కడాలు తెలంగాణ మధ్యయుగ చరిత్రకు అద్భుత వారసత్వం. వేములవాడ చాళుక్య రాజు రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) నాటి చరిత్రకు ఆధారం ఈ గుట్ట.
ఈ శాసనం చెపుతున్నదేమిటి? మొదటి ప్రత్యేకత ఇది త్రిభాషా శాసనం. కన్నడం, సంస్కృతం, తెలుగు భాషల్లో ఉంది. ఈ శాసనాన్ని రాసినవాడు కన్నడ ఆదికవి పంప తమ్ముడైన జినవల్లభుడు. ఈ గుట్టను వృషభాద్రి అనేవారని, ఇక్కడ జైన తీర్థంకరుల ప్రతిమలను చెక్కించడాన్ని, త్రిభువనతిలక అనే జైన బసది (జైన సన్యాసుల బస) నిర్మించడాన్ని, కవితాగుణార్ణవ అనే చెరువును తవ్వించడాన్ని, మదనవిలాస అనే తోటను పెంచడాన్ని ఈ శాసనం చెపుతుంది. కన్నడ ఆదికవి పంప వేంగినాడు నుండి వచ్చిన కమ్మె బ్రాహ్మణుడని కూడా తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఈ శాసనం మన తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకు దొరికిన తొలి కంద పద్యం. కందం రాసిన వాడే కవి అని సాహిత్య విమర్శకుల భావన. ఇప్పటివరకు దొరికిన కంద పద్యాల్లో మొదటిది శిలాక్షరం కావడం ఒక విశేషం. మరోవైపు, జగిత్యాల జిల్లా పొలాసకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం గుట్టపై నాలుగున్నర అడుగుల ఎత్తున్న బాహుబలి విగ్రహం వేములవాడ చాళుక్య కాలానిదే. తెలంగాణలో దొరికిన అతి కొద్ది బాహుబలి విగ్రహాల్లో ఇది ఒకటి. ‘నమస్తే తెలంగాణ’ జర్నలిస్టు, చరిత్ర పరిశోధన సంస్థ ప్రిహా సభ్యుడు కొత్తూరి మహేష్ కుమార్ దీనిని వెలుగులోకి తెచ్చారు.
కురిక్యాల నుండి 14 కిలోమీటర్ల దూరంలో గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లిలో 2017లో 23వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథ విగ్రహం, 2020లో 19వ తీర్థంకరుడైన మల్లినాథ విగ్రహాలు దొరకడం హెరిటేజ్ శాఖ రికార్డు చేసింది. ఇంత విస్తారంగా జైన ఆధారాలు ఉండటాన్ని బట్టి, వేములవాడ కేంద్రంగా రాజకీయమే కాదు జైన మతం కూడా వ్యాప్తి చెందిందని తెలుస్తున్నది.
జైనం, శైవం రెండూ కలిసి ఎదగడం రాష్ట్రకూట కాలం (వేములవాడ చాళుక్య) నాటి ప్రత్యేకత. అప్పటికే బౌద్ధ ప్రాభవం తగ్గడంతో ఏర్పడ్డ ఖాళీలో జైనం ఎదగడంతో పూర్తి అయ్యింది. అయితే జైనానికి వైదిక మతంతో పాటు ఆమోదం రావటానికి కారణం, జైనం కుల వ్యవస్థను బౌద్ధం లాగ వ్యతిరేకించక పోవడంకావొచ్చు.
జైనం, శైవం కలిసి నడిచిన కాలం
ఈ కాలం అంతా శైవం, జైనం ప్రధాన మతాలుగా ఉన్నాయని చెప్పేందుకు ఎన్నో భౌతిక, సాహిత్య ఆధారాలున్నాయి. ఈ మతాలే కాకుండా, సూర్య ఆరాధన, వైష్ణవం కూడా ఉండేది. వేములవాడ లోని రాజేశ్వర ఆలయాన్ని వేములవాడ చాళుక్య రాజైన మొదటి నరసింహ కట్టించాడు. ఈయన బిరుదు రాజాదిత్య కావడం వల్ల ఈ శివాలయానికి రాజేశ్వరాలయం అని పేరొచ్చింది. అలాగే బద్దెగ కట్టించిన బద్దెగేశ్వరాలయం (ఇపుడు భీమేశ్వరాలయం) కూడా. వేములవాడ శాసనం ప్రకారం వేములవాడలో ఆదిత్య గృహం (సూర్య మందిరం), నాగేశ్వరాలయం కూడా రెండవ అరికేసరి కాలంలో ఉన్నాయి. నాగేశ్వరాలయాన్ని వర్తకులు (వైశ్యులు) నిర్మించారని తెలుస్తున్నది. ఈ రెండు ఆలయాలు ఇప్పుడు దొరకడం లేదు. రాజధాని వేములవాడలోనే రెండవ బద్దెగ జైనుల కోసం శుభదామ జినాలయాన్ని నిర్మించాడని కూడా తెలుస్తున్నది.
వేములవాడ టూరిస్ట్ సర్క్యూట్
వేములవాడ పట్టణం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, వెరసి పాత కరీంనగర్ జిల్లాలోని చారిత్రక ఆధారాల్ని సజీవంగా నిలిపి టూరిస్ట్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తే చరిత్ర, వారసత్వ సంపద మిగులుతుంది. దానికి తోడు పర్యాటక రంగం పెరుగుతుంది. బొమ్మలమ్మ గుట్ట ఎక్కడానికి అనువుగా లేక పోవడంతో, 2020లో అప్పటి జిల్లా కలెక్టర్ కె.శశాంక్ చొరవతో మెట్లు కట్టించారు.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000