నిజాంబాద్… కంటేశ్వర్… ఓ చిన్న ఇల్లు… ఆ ఇంట్లో ఉండేది అమ్మ రాజుబాయితోని గలిపి ఆరుగురం ఆడోళ్లమైతే, బాపొక్కడే మొగ మనిషి. బాపు బీడీ కంపెనీల వంటల్జేయడానికి పోవుడే ఆల్శం… ఆ మూలకొగలు, ఈ మూలకొగలు కూసొని ఆరుగురం ఆరు సాట్లు వట్టేటోళ్లం. బీడీలు సుట్టుడే మా పని, ఒక్క తినేటప్పుడు తప్పా. తినేటప్పుడు గూడ చెయ్యిలు తంబాకు వాసనే అచ్చేటియి. ‘మంజులా… నీ సుట్టుడు పాడుగాను ఇగాపరాదే..’ అని నిద్రవోతున్న నన్ను లేపిండు మా బాపు. అంటే నిద్రల గూడ ఏళ్లను ఆడిస్తూనే ఉన్ననటా.
‘సదువు అని ఊకే అనేది మా బాపమ్మ. ఆమె మాటలు ఇప్పటికీ మతికున్నయి. అందుకే ఎంత కట్టమొచ్చినా సదువు మాత్రం ఆపలే.. అటు బీడీల్జేసేది, ఇటు సదువుకునేది. చిన్నప్పట్నుంచి సర్కారు బడులే మాకు దేవుని గుళ్లు. ఉన్న ఐదుగురం సర్కారు బడులల్లనే సదివినం. ఆఖరికి నేను హైద్రాబాద్ దాన్కచ్చిన. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో జీఎన్ఎం జేసిన. 2004ల జీఎన్ఎం అయిపోయినంక నిజాంబాద్ వొయి అక్కణ్నే ఓ ప్రైవేటు దవాఖాన్ల నర్సుగా చేరిన. నెలకు వెయ్యి రూపాల జీతం. బాపుకు దమ్మొచ్చే రోగం ఉండేది. సలికాలం ఎల్తే సాలు అమ్మయ్యా… అనుకునేది మేం. 2008 ఏప్రిల్, ఎండలు భగభగ మండుతున్నయి. అయినా బాపును ఆ పాడురోగం ఇడ్వలే. బీడీల కంపెనీల బాపు వంటల్జేస్తున్నప్పుడు పొయ్యిలకెల్లి అచ్చే పొగసూరి మొసెల్లక కూలవడ్డడు. దవాఖాన్ల షరీఖ్ జేస్తే రెండ్రోజులున్నడు. ఆ తర్వాత జీవిడిసిండు. అప్పట్నుంచి ఇంటిని నేనే ఎల్లదీసిన. కొన్నేండ్లకు నర్సుగా కాంట్రాక్టు జాబొచ్చింది. అప్పుడు కొంచెం చెయ్యి తిర్గినట్టయింది. అప్పటికే అక్కల పెండ్లిల్లయినయి. ఇగ మిగిలింది నేను, అమ్మా, చెల్లె. ఏడుగురం ఉన్న ఇల్లు ముగ్గురికి చేరింది. ముగ్గురితో కుల్లా ఉన్నా ఏడుగురం ఉన్నప్పటి ఇరుకుటం ఇల్లే మంచిగనిపిచ్చేది.
తెలంగాణ రాకముందు గవర్నమెంటు నౌకరి కోసం కండ్లు కాయల్గాసేదాక జూసిన. తెలంగాణొచ్చినంక 2017ల సర్కారు దవాఖాన్ల కోసం నర్సు కొలువులు వడ్డయి. నేన్ ఎంత కట్టపడ్డనో నాకెర్క. అసొంటి కట్టం ఇగుండద్దనుకుంటే నర్సు నౌఖరి కొట్టాల్నని గట్టిగనుకున్న. వయ్యిలే నా ప్రపంచమైనయి. ‘ఎహే గా నౌఖరి నీకొస్తదా తియ్యి’ అని ఎక్కిరిచ్చినోళ్లు మస్తు మందే ఉన్నరు. నువ్వెంత సద్వినా అంతో ఇంతో లంచం వెట్టాలె, మీ దగ్గర గన్ని పైసలున్నయా..? అని అడిగినోళ్లు గూడా ఉన్నరు. కనీ నేను మంది మాటలు వట్టుకోలే. నన్ను నేను నమ్ముకున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ను నమ్ముకున్న. జబ్బర్దస్త్గా సదివి పరీక్ష రాసిన. పక్కాగా నౌకరొస్తదనుకునే మోపున ఎవ్వలో వొయి కోర్టుల కేసేసిర్రని తెలిసింది. ఖతం ఆ కొలువులకు కామా పడ్డది. గవర్నమెంటు నౌకర్లిత్తలేదని లొల్లిజేసేది ఇసొంటొళ్లే… నౌకర్ల కోసం నోటిఫికేషన్ ఇస్తే కోర్టులకు పొయ్యి అడ్డుపుల్లలు ఏసేది వీల్లే.
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర దగ్గర తొంభై వేల ఉద్యోగాలిస్తామని మాటిచ్చిర్రు. ఆయన మాటల్ని మస్తు వంకర చేసి సూపెడ్తున్నరు. ఆయన మాటలపై జోకులేస్తున్నరు. ఇదంతా ఎవ్వల్జేస్తున్నరో, ఎందుకు జేస్తున్నరో నాకైతే తెల్వది గని, వాట్సాపుల రోజూ ఇదే పని. వశపడని మెసేజ్లు. ఒక్కొక్కసారి ఆ మెసేజ్లను చూసినప్పుడల్లా చిన్నప్పటి కష్టాలు గుర్తుకచ్చి ఒక్కసారి కండ్లు చెరువైతున్నయి. వాళ్ల మాటలు నమ్మితే మన బతుకు ఆగమైతది. తిన్నప్పుడు, పన్నప్పుడు తప్పితే సదువే మన లోకం గావాలె. ఇగ ఎందుకు రాదు నౌఖరి చెప్పుర్రి. ఇంకో ముచ్చట… యాభయో, లచ్చో ఇత్తే నౌఖరి వెట్టిస్తమని కొందరు ఆశవెడ్తరు. వాళ్లను నమ్మితే నట్టేట మునిగినట్టే. నేను ఎవ్వల్కి ఒక్క రూపాయి గూడ ఇయ్యలే. సర్కారే నియ్యత్గా నియామకాలు చేసింది.
2017ల పరీక్ష రాస్తే 2021 జూన్ 28న కొలువొచ్చింది. హైదరాబాద్ యూపీహెచ్సీ జంగమ్మెట్ పీహెచ్సీల నర్సుగా కొల్వు జేస్తూ పెనిమిటి సైదులుతోని సంతోషంగుంటున్న. బీడీలు సుట్టిన చెయ్యితోనే రోగులకు సూదులేస్తుంటే జీవునం తుర్తయితున్నది.
మా అమ్మే.. ఆరుగురం ఎటొళ్లం అటు పోయినంక క్యాలి తప్పింది. సాట లేకున్నా.. అందుల తంబాకు, తునికాకు లేకున్నా… బీడీలు సుడుతనే ఉన్నది.
– గడ్డం సతీష్, 99590 59041