మే చివరికల్లా రోడ్లు బాగు చేస్తామని కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ప్రకటించగానే బెంగళూరు వాసులు కన్నడంలో కేటీఆర్ అవరిగె ధన్యవాదగళ్ళు (కేటీఆర్ గారికి థాంక్స్) అంటున్నారు. థాంక్స్ చెబితే వారు తమ సీఎంకు చెప్పాలి కానీ కేటీఆర్కు ఎందుకు? ఆయనేమి కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు గదా? అని ఆశ్చర్యపోవద్దు. కానీ వారు చెప్పేదాంట్లో కాస్తా ధర్మం ఉంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు కోట్ల కొలది రూపాయలు పన్ను చెల్లిస్తున్నా రోడ్లు, మౌలిక సదుపాయాలు పరమ అధ్వాన్నంగా ఉన్నాయని ఐటీ కంపెనీల అధిపతులు సోషల్ మీడియాలో వాపోయిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్లో కేటీఆర్ స్పందిస్తూ.. బెంగళూరు పక్కకు వెళ్లొద్దురో డింగరీ.. వెళ్లావో డౌనైపోతావో డింగరీ అంటూ, అన్ని కష్టాలు పడటం ఎందుకు? పెట్టే బేడా సర్దుకొని హైదరాబాద్కు వచ్చేయండి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని పిలుపునిచ్చారు. కేటీఆర్ ట్వీట్ పెద్ద దుమారం రేపడంతో వచ్చే నెలాఖరుకల్లా రోడ్లు బాగు చేస్తామని కర్ణాటక సీఎం బొమ్మై ప్రకటించారు. దీంతో బెంగళూరు వాసులు.. మీ వల్లనైనా మా రోడ్లు బాగుపడుతున్నాయని, కేటీఆర్ అవరిగె ధన్యవాదగళ్ళు అంటున్నారు.