తెలంగాణలో మత్స్య రంగం గణనీయమైన పురోగతి సాధించింది. గత ఎనిమిదేండ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపైంది. మత్స్యకారుల వార్షిక ఆదాయం బాగా పెరిగింది. ఉచిత చేప పిల్లల పంపిణీ, ప్రాథమిక సహకార సంఘాల ఏర్పాటు, ఉపరితల జల వనరుల అభివృద్ధి తెలంగాణ మత్స్య రంగం సాధించిన ప్రధాన విజయాలు.
తెలంగాణ మత్స్య రంగంలో జరుగుతున్న పురోగతి ఈ రంగం మీద ఆధారపడిన సంప్రదాయ మత్స్యకారుల అభివృద్ధిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా సంప్రదాయ మత్స్యకారులకు సంబంధించిన జీవనోపాధి ఆదాయ వనరుగానే చూస్తున్నది. మిగతా రాష్ర్టాల్లో ఆక్వా రంగంలో కార్పొరేట్ కంపెనీలను అనుమతిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభ పరిస్థితుల నుంచి వివిధ వృత్తి రంగాలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ మత్స్య రంగానికి రూ.22 వేల కోట్లు కేటాయించింది.
కానీ అన్ని కులాలవారిని మత్స్య రంగంలో వ్యాపారానికి అనుతించింది. కానీ దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే మత్స్యకారులను మాత్రమే మత్స్య రంగంలో పెట్టుబడులకు, వ్యాపారానికి ప్రోత్సహిస్తున్నది. మత్స్యకారులు మాత్రమే సభ్యులుగా కొనసాగుతున్న ప్రాథమిక సహకార సంఘాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. వీటిలో లక్షలాది మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆలంబనతో అమలు పరుస్తున్న ఈ విధానాన్ని అందిపుచ్చుకుని స్వీయ నియంత్రణ పద్ధతిలో విభేదాలను విస్మరించి పరస్పర పురోభివృద్ధికి దోహదం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం మూడంచెల విధానాన్ని అమలు పరుస్తున్నది. ప్రధానమైన జల వనరులను అభివృద్ధి పరచడం ద్వారా చేపల ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నది. రాష్ట్రంలో చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్న నీటి వనరులను గరిష్ఠంగా వినియోగించుకొనే అవకాశాలను కల్పిస్తున్నది. మత్స్య రంగానికి వెన్నెముక లాంటి ప్రాథమిక మత్స్య సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుబంధంగా నిర్మించుకున్న జలాశయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జల కళ ఉట్టి పడుతున్నది. ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 2.5 లక్షల టన్నులుగా నమోదైన వార్షిక చేపల ఉత్పత్తి ఇవాళ సుమారు 4 లక్షల టన్నులకు చేరుకున్నది. ఈ మొత్తం చేపల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయమంతా సాంప్రదాయ మత్స్యకారుల కుటుంబాలకే చెందుతున్నది.
తెలంగాణ మత్స్య రంగం అభివృద్ధిలో ప్రధాన భూమికను పోషించే ప్రాథమిక మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా చేయూతనిస్తున్నది. గత ఆరేండ్లుగా ఏటా కోట్లాది రూపాయల ఖర్చుతో ‘ఉచిత చేప పిల్లల పంపిణీ’ పథకాన్ని విమర్శలకు అతీతంగా అమలు చేస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది. కేంద్ర స్థాయి ఆర్థిక సంస్థ సహకారంతో సుమారు రూ.1000 కోట్ల భారీ నిధులతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ అమలు చేస్తూ ప్రాథమిక మత్స్య సహకార సంఘాలతో పాటు మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టికి ఇతోధికంగా దోహదపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న మత్స్య రంగ ఉద్దీపన పథకాల ఫలితంగా దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కడి మత్స్య సహకార సంఘాల్లో ‘సభ్యత్వం’ పొందడం ఒక ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో నూతనంగా మత్స్యకారుల సభ్యత్వ నమోదును, కొత్త మత్స్య సహకార సంఘాల ఏర్పాటును ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు.
నీటి పారుదల ప్రాజెక్టుల ఫలితంగా చేపల పెంపకానికి అనువైన నీటి వనరుల విస్తీర్ణం 6 లక్షల హెక్టార్ల నుంచి 7.5 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాకారంతోనే సాధ్యమైంది. ఉపరితల జల వనరుల (ఇన్ ల్యాండ్ ఫిషరీస్) నీటి విస్తీర్ణంలో తెలంగాణ దేశంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకున్నది.
తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ మత్స్యకారులుగా కొన్ని ప్రధానమైన కులాలవారు మాత్రమే కొనసాగుతున్నారు. అందులో గంగపుత్రులు, ముదిరాజ్లు అతి ప్రధానమైనవారు. ఈ రెండు కులాల మధ్యన వృత్తి పరంగా పొడసూపే ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు ఈ రెండు కులాల్లోని గుర్తింపు పొందిన ప్రతినిధులతో ప్రభుత్వం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలంగా పేరుకుపోయిన అనేక క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమన్వయ కమిటీ కృషి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో సుమారు 4 వేల ప్రాథమిక మత్స్య సహకార సంఘాల్లో 2.5 లక్షల మత్స్యకారులు సభ్యులుగా నమోదయ్యారు. ఈ సంవత్సరం అక్టోబర్ చివరినాటికి సంఘాల సంఖ్య 5028కి, వాటి సభ్యుల సంఖ్య 3,56,450కి పెరిగింది.
రానున్న కాలంలో మత్స్య సహకార సంఘాలకు అనుబంధంగా కొత్తగా మత్స్య మార్కెటింగ్ సొసైటీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో మరో లక్ష మంది మత్స్యకారులకు సభ్యత్వం లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆక్వా కల్చర్ రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా విద్యావంతులైన యువతీ యువకులకు స్వయం ఉపాధితో పాటు ఇతర ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్య రంగం భవిష్యత్తు గురించి కన్న కలలు సాకారమయ్యేందుకు బలమైన పునాదులు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
(వ్యాసకర్త: వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ)
పిట్టల రవీందర్
99630 62266