ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్న భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్నారు. 2020-21లో 1.63 లక్షల మంది భారతీయులు ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకొన్నారు. ఐదేండ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే ఇది రెట్టింపు అయ్యింది. మనం ‘అమృత కాలం’లోకి ప్రవేశించిన సందర్భంలోనే ఈ వలసలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి వలస వెళ్లేవారు చెబుతున్న సమాధానాలు…సంపాదనకు ఎక్కువ అవకాశాలు ఉండడం, తక్కువ వ్యక్తిగత పన్ను రేట్లు, ఉన్నత జీవన ప్రమాణాలు.
ఎవరో కొందరిని మినహాయిస్తే వలస వెళ్లాలనుకుంటున్నవారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, ధనవంతులు, అనేక సౌకర్యాలు కలిగి ఉన్నవారే. ఈ సంవత్సరం 8 వేల మంది భారతీయులు దేశాన్ని వీడతారని అంచనా. భారత పౌరసత్వాన్ని వదులుకొన్న సంపన్న భారతీయులు ఈ దేశ ప్రజాస్వామ్యం ద్వారా చాలా ప్రయోజనం పొందారు. వలస వెళ్లిన వారంతా చక్కని సౌకర్యాలతో సుఖంగా జీవిస్తున్నారు కాబట్టి మేమూ వలస వెళ్తున్నామని చాలా మంది చెప్తున్నారు. విదేశాల్లో సంపాదనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నది మరో కారణం. పాశ్చాత్య దేశాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు, తక్కువ కాలుష్యం ఉండడం మిగతా కారణాలు. యూఏఈ, సింగపూర్ లాంటి దేశాల్లో వ్యక్తిగత పన్ను రేట్లు భారత్లో కన్నా తక్కువ ఉండటంతో చాలా మంది విదేశాలకు వలస బాట పడుతున్నారు.
బడుగు, అల్పాదాయ వర్గాలకు ఆదాయాన్ని కల్పించే భారత ప్రభుత్వ విధానాలు కూడా సంపన్నుల వలసకు కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ది ఎకానమిస్ట్ సంస్థ ప్రకారం ప్రభుత్వ విధానాల కారణంగా ఒక సామాజిక వర్గం బలవంతంగా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వాదన పూర్తిగా సహేతుకమైనది కాదు. ఎందుకంటే భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కల్పించారు. మొత్తం జాబ్ మార్కెట్లో ఈ ఉద్యోగాలు అత్యల్పం. అధిక వేతనాలు గల ఉద్యోగాల్లో ఆ రిజర్వేషన్ల శాతం మరింత తక్కువ. ఇదే సమయంలో భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు కాబట్టి చాలా మంది భారతీయులు తమ హెచ్1బీ వీసాలను మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల విదేశీ వలసలకు నేను ఒక కారణం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే… ధనవంతులు, వ్యాపారులు, ఉన్నత ఉద్యోగులకు విదేశాల్లో స్థిరపడాలనే కోరిక సహజంగానే బలంగా ఉంటోంది.
పట్టణాలు, నగరాల్లోని ధనిక వర్గాల నివాసాలను చూస్తే ఈ ‘వేర్పాటు’ ధోరణులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో సంపన్న వర్గాల కాలనీలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉంటాయి. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలన్నీ దాదాపుగా వారే ఏర్పాటు చేసుకుంటారు. దీన్ని బట్టి భారత దేశంలో ఒక వర్గం స్వయం ప్రతిపత్తి కలిగినదిగా తయారైందని చెప్పవచ్చు. భారత్లో ఇలాంటి భావనతో బతుకుతున్నవారే తమకు వచ్చిన మొదటి అవకాశంలోనే విదేశాలకు వలస వెళుతున్నారు. బడుగు వర్గాల వారు కూడా ఈ సౌకర్యాలను అనుభవించాలని కోరుకుంటున్నారు. ఈ అసంతృప్తి వారిలో కొత్త ఆశలను కల్పిస్తోంది. ‘సంతృపి’్త అనే పదాన్ని నేను అసహ్యించుకుంటాను. సమస్యంతా నెహ్రూ అవలంబించిన సామ్యవాద విధానాల వల్లే వచ్చిందని నా అభిప్రాయం.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు దేశీయ పెట్టుబడిదారులకు పరిమితులు విధించారు. దీంతో దేశ ఆర్థిక ప్రగతి మంద గమనంలో సాగింది. సామ్యవాద విధానం పేదరికాన్ని పంచేదిగా మారిపోయింది. 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణల వల్ల కూడా మధ్య తరగతి సంఖ్యలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఈ విషయాన్ని ప్రస్తుత పాలకులు తీవ్రంగా పరిగణించాలి. విదేశాల్లో స్థిరపడాలనే ఆకాంక్షను నెరవేర్చుకొనే అవకాశం భారతీయులందరికీ ఉండాలంటే దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరగాల్సిందే. పేదలందరూ మధ్య తరగతి ప్రజలుగా మారే అవకాశం కల్పించాలి.
ఇప్పుడిది మన ముందుకు మరో ప్రశ్నను తెస్తుంది. మరి మధ్య తరగతి వారందరికీ వలస వెళ్లే అవకాశం ఉందా అని? పాశ్చాత్య ప్రపంచం, ముఖ్యంగా భారతీయుల కలల గమ్య స్థానాలైన అయిదు అగ్ర దేశాలు ఇటీవల పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేశాయి. నిర్దిష్టమైన ఆర్థిక స్థోమత, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారినే తమ దేశానికి వలస రావడానికి ఒప్పుకుంటున్నాయి. ఈ నిబంధన వల్ల కేవలం ఒక్క శాతం భారతీయ సంపన్న వర్గం మాత్రమే వలస వెళ్లడానికి అవకాశం కలుగుతున్నది. ముఖ్యంగా అమెరికాకు వలస వెళుతున్న భారతీయుల్లో అత్యధిక నైపుణ్యాలు, అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే హెచ్1బీ వీసా లేదా దీర్ఘకాలం నివసించే వీలు, శాశ్వత నివాస సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నిబంధన అమెరికాకు వలస వెళ్లాలనుకునే చాలా మంది భారతీయులకు అవరోధంగా మారింది. ఒక వేళ సంపన్న భారతీయులకు విదేశాల్లో స్థిరపడటానికి మొదటిసారి అవకాశం వచ్చినప్పుడే భారతీయ పౌరసత్వాన్ని త్యజించాలనుకుంటే ఎవరూ వద్దనరు. అయితే ఆ సమయంలో ‘ప్రవాస భారతీయులు దేశానికి గర్వ కారణం’, ‘వారికి స్వదేశం అంటే ఎంతో ప్రేమ’ లాంటి పవిత్రమైన మాటల అర్థాన్ని మనం పునర్ నిర్వచించుకోవాల్సిందే! అప్పటి వరకు పేదలు, అణగారిన వర్గాలు మన జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ మన జాతి వైభవ భారాన్ని మోస్తూ ఉండాల్సిందే. వారికి ఆదర్శంగా నిలిచినవారు మాత్రం ఈ దేశాన్ని విడిచి వెళుతున్నారు.
(వ్యాసకర్త: ‘ఇండియా టుడే’ మాజీ ఎడిటర్ ) (‘ది ప్రింట్’ సౌజన్యంతో..)
దిలీప్ మండల్