దేశానికి ఇప్పుడు ఎటువంటి పాలన రావాలి? ఎలాంటి రాజకీయాలు ఉండాలి? విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులు, భాషలు, యాసలు, వేషధారణ, ఆహారపు అలవాట్లు గల మనదేశంలో విద్వేష, విధ్వంసకర రాజకీయాలు పనికిరావు. 140 కోట్ల మంది ప్రజల మనసులను గెల్చుకునే నాయకుడు కావాలి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల భౌగోళిక, రాజకీయ, సామాజిక సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పాటు పరిష్కారం చేయగల సత్తా, శక్తి, సామర్థ్యం, దూరదృష్టి గల నేత నేటి భారతానికి అత్యంత అవసరం. ఇప్పుడు సిద్ధాంతాల రాద్ధ్దాంతాల కన్న మనిషి అభివృద్ధే కేంద్రంగా జరిగే సంక్షేమ పథకాలు అమలు జరగాలి. ఫేక్ గుజరాత్ మాడల్లా కాకుండా కాళేశ్వరంలాంటి అతి భారీ ప్రాజెక్టును నిర్మించి వ్యవసాయం, సాగునీటి రంగంలో, సంక్షేమ పథకాలలో దేశానికే రోల్ మాడల్గా తెలంగాణను నిలిపిన కేసీఆర్ నాయకత్వం కావాలి.
తెలంగాణ రోల్ మాడల్ దేశంలోని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలదని కేసీఆర్ నిరూపించారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి అవసరమైన వనరులు సమృద్ధ్దిగా ఉన్నాయని వాటిని వాడుకొనే సోయి లేదని కేసీఆర్ చాలా సందర్భాలలో కేంద్రంపై విమర్శలు కురిపించారు. కేసీఆర్ దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గం కూడా చెప్పారు. దేశంలో ఏటా 1.45 లక్షల టీఎంసీల వర్షపు నీరు వృథాగా పోతున్నదని, దాన్ని సరిగ్గా వినియోగిస్తే 70 వేల టీఎంసీల నీటిని ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకొని దేశాన్ని సస్యశ్యామలం చేయొచ్చని తేల్చి చెప్పారు. అలాగే విద్యుత్తును రైతులకు ఉచితంగా ఇస్తే 1.45 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం రైతులకు ఈ మేలు చేస్తే దేశ జీడీపీ మరింత పెరుగుతుందన్నారు.
మోదీ సారథ్యంలోని బీజేపీకి రెండు సార్లు కేంద్రంలో అధికారం ఇస్తే ఈ దేశాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి నిత్యావసరాలు మొదలుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. పెరిగిన నిరుద్యోగ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న మోదీ దాదాపు 2 కోట్ల ఉద్యోగాలను ఊడగొట్టారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో సుమారు 5 లక్షల చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్లైన్స్ లను అగ్గువకు తమ అనుకూల కార్పొరేట్లకు అప్పగించారు.
అభివృద్ధిని అటకెక్కించిన బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చడంలో మాత్రం ముందున్నది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొని తమ ప్రభుత్వాలను రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసుకొన్నది. దీనికి గవర్నర్ వ్యవస్థను వాడుకొని రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడింది. తమ మాట వినని ప్రభుత్వాలను, సీఎంలను ఐటీ, ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ పేర్లతో బెదిరిస్తూ దాడులు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది.
తమకు ఎమ్మెల్యేలు లేకున్నా కొని, పార్టీలను చీల్చి, బెదిరించి, ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొన్నది. ఎవరైనా అధికారంలోకి రావాలని కోరుకొంటే ప్రజాక్షేత్రం లోకి వెళ్లి వారి ఆమోదంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వాలను కూల్చడం ఏమిటి? దీనికి తోడు దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన పాలకులు కుల, మత, ప్రాంత, భాష విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విడదీయాలని చూస్తున్నారు. దళితులు, మైనారిటీలపై దాడులు, మహిళలపై లైంగికదాడులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దేశ సంపదకు మూల కారణమైన వ్యవసాయానికి చేయూత లేదు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి 750 మంది రైతులను పొట్టన బెట్టుకున్నారు. రైతుల తిరుగుబాటుతో చట్టాలను వెనుకకు తీసుకున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజలకు మేలు చేసే ఒక్క సంక్షేమ పథకం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పాలకులు 68 ఏండ్లలో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 56 ఇంచుల ఛాతీ ఉన్న విశ్వగురువు ఎనిమిదేండ్లలో లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ డబ్బంతా బడా పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వెళ్లిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అదానీ,అంబానీలను ప్రపంచ కుబేరులను చేసి ప్రజలకు చిప్ప చేతికిచ్చారు. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఎన్పీఏల పేరుతో రద్దు చేశారు.
పంజాబ్, ఢిల్లీలలో ప్రజలు ఎన్నుకొన్న ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేసి విఫలం చెందారు. ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనడానికి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది బీజేపీ. ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ముఖ్యమంత్రి చేస్తామని ఎర వేసింది. ఆయన లొంగకపోవడంతో ఈడీ కేసులో ఇరికించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీని బీఆర్ఎస్గా జాతీయ స్థాయిలో విస్తరించి దేశ ప్రజలకు తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు తీసుకు రావాలని సంకల్పించారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి బొక్కబోర్ల పడింది. బీజేపీ కుట్రను ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డలైన ఎమ్మెల్యేలు బయట పెట్టారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గుజరాతీ గులాంల పాలు కాకుండా కాపాడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ సమాజం రుణపడి ఉన్నది.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించడం తథ్యం. కేసీఆర్ దక్షిణాది నుంచి బలమైన నేతగా ఎదిగారు. తన రాజకీయ చాణక్యంతో స్ట్రాటజీతో కనీసం100 మంది ఎంపీలను కూడబెట్టగలరు. ఇప్పుడు దేశానికి కేసీఆర్ సారథ్యం.. సామర్థ్యం అవసరం ఎంతైనా ఉన్నది. కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసి 2024లో దక్షిణాది నుంచి దేశ ప్రధానిగా కేసీఆర్ ను పంపాలి.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
బీరయ్య యాదవ్
91777 57440