ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నది. విభజించి పాలించు నినాదంతో ప్రజల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నది. హిందుత్వ ఎజెండా పేరుతో కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నది. తెలుగు రాష్ర్టాలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెర వేర్చడం లేదని మోదీని తెలుగు ప్రజలు సమైక్యంగా నిగ్గదీసి అడగాలి.
మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం చేజిక్కించుకోవడం బీజేపీకీ అలవాటు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉసిగొల్పి ప్రతిపక్ష పార్టీల నాయకులను బెదిరించడం ఆ పార్టీ నైజం. తాము అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చడం ఆ పార్టీకి సరదా! తమ చేతిలో కీలు బొమ్మలుగా ఉన్న గవర్నర్ల ద్వారా ప్రతి పక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడం ఆ పార్టీకి అలవాటు.
ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతల ఆస్తులపై ఈడీ సోదాలు చేయడం; కేరళ, తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో పేచీలు పెట్టుకోవడం ఇందుకు నిదర్శనం. తమ అధికారాన్ని ప్రశ్నించే వారిపై బీజేపీ అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నది. దేశ సమస్యలు పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా పాలన సాగిస్తున్న కమలం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది.
రోజు రోజుకూ బీజేపీపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దేశ ప్రజలకు విశ్వాసం తగ్గిపోతున్నది. ప్రజలు తమను చివాట్లు పెడుతున్నా బీజేపీ నాయకత్వంలో మార్పు రావడం లేదు. అలాంటి బీజేపీకి సరైన గుణపాఠం చెప్పాలంటే తెలుగు రాష్ర్టాల్లో పర్యటిస్తున్న ప్రధానికి ఇరు రాష్ర్టాల ప్రజలు నిరసన గళం వినిపించాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్ర ప్రజలు బీజేపీని చిత్తుగా ఓడించాలి.
నరేంద్ర మోదీ (2014-2022) పాలనలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో సుమారుగా 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలపైనే నమోదయ్యాయి. ఒకవేళ ఈ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే మరుసటి రోజే వారిపైన ఉండే కేసుల విచారణ పక్కకు వెళ్లి పోతుంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్లో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ ఆయన నివాసంలో సోదాలు చేసి ఈడీ అభియోగాలు నిజమేనని తేల్చింది. కానీ ఆయన బీజేపీలో చేరగానే ఆ కేసు విచారణ పత్తా లేకుండా పోయింది.
పశ్చిమ బెంగాల్లోనూ ఇలాగే జరిగింది. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటంటే మోదీ ప్రభుత్వం అవినీతి సహించబోమని చెప్పి, రాజకీయ అధికారం కోసం అవినీతికి పాల్పడిన నేతలనే భయ పెట్టి అక్కున చేర్చుకుంటున్నదని. ఇప్పటి వరకు బీజేపీ పాలనలో నమోదైన ఈడీ కేసులు 115. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 24 మంది, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 19 మంది, ఎన్సీపీ వారు 11 మంది, శివసేన నాయకులు 8 మంది, డీఎంకే లీడర్లు ఆరుగురు, ఆర్జేడీ నేతలు ఐదు మంది, ఎస్పీ నుండి ఐదు మంది, టీడీపీ నుండి ఐదు మంది, ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారు. అంటే పెద్ద పార్టీలతో పాటు చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేసి దేశం మొత్తం ఏలాలనేది బీజేపీ ఆలోచన.
మరోవైపు తమ పార్టీ ప్రాబల్యం లేని చోట అక్రమ మార్గంలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నది. పాలక పార్టీలోనే వర్గ విభేదాలను సృష్టిస్తున్నది. మహారాష్ట్ర శివసేన పార్టీని చీల్చడమే ఇందుకు ఉదాహరణ. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను టార్గెట్ చేసి లిక్కర్ స్కాములో ఇరికించింది బీజేపీ. తద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నించింది. ప్రజాస్వామ్యంలో ఇంతటి దుర్మార్గమైన చర్య ఇప్పటివరకు మరొకటి జరిగి ఉండదు. ఇటీవల టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఎర వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. అది విఫలం కావడంతో ఇప్పుడు ఢిల్లీ దూతలు విచారణ ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల నిధుల కోసం బీజేపీ అడ్డ దారులు తొక్కుతున్నది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలను పొడగించింది. కార్పొరేట్ వర్గాల నుంచి వచ్చిన విరాళాలను ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి వెచ్చిస్తున్నది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రూ.175.1 కోట్లు, 2022 ఎన్నికల్లో రూ.221.32 కోట్లు ఖర్చు చేసింది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 2017లో రూ.7.86 కోట్లు, 2022లో రూ.23.52 కోట్లు ఖర్చు చేసింది. పంజాబ్ ఎన్నికల్లో 2017లో రూ.7.43 కోట్లు, 2022లో రూ.36.7 కోట్లు ఖర్చు చేసింది. కేవలం పార్టీ తరపునే ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెడితే, ఇక వ్యక్తిగతంగా ఆ పార్టీ అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టి ఉంటారో ప్రజలే ఊహించుకోవాలి.
ఇటీవల ఆరు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ధన బలంతో మళ్ళీ గెలవాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ అన్ని చోట్ల సఫలం కాలేకపోయింది. తెలంగాణ, బీహార్, మహారాష్ట్రల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే బీజేపీ నేతల గారడీ ఆటలను, అన్యాయాలను ప్రజలందరూ ప్రశ్నించాల్సిందే. తెలుగు రాష్ర్టాల విభజన జరిగిన సమయంలో రెండు రాష్ర్టాలకూ కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. కానీ వాటిలో ఏవీ నెరవేర్చకుండా వాయిదా వేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల ప్రజలు బీజేపీపై కలిసి కట్టుగా పోరాటం చేయాలి. మోదీకి తెలుగు ప్రజల సత్తా ఏంటో చూపించి మన హక్కులను సాధించుకోవాలి. అందు కోసం తెలుగు రాష్ర్టాలకు వస్తున్న మోదీని నిలువరించాల్సిందే. ఒకవేళ వస్తే ఇచ్చిన హామీలపై ఆయననూ నిలదీయాల్సిందే.
మర్రి యాదవ రెడ్డి
73372 22461
(వ్యాసకర్త: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)