భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. పూర్తిపేరు సయ్యద్ అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అహ్మద్ ఆజాద్. తండ్రిముద్దుగా ఫిరోజ్ బఖ్త్ అని పిలుచుకునేవారు. అబుల్ కలాం అనేది బిరుదు. కలం పేరు ఆజాద్. ఆయన 1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక సంపన్న ధార్మిక కుటుంబంలో జన్మించారు. ఆలియా బేగం, మౌలానా ఖైరుద్దీన్ అహ్మద్లు తల్లిదండ్రులు. ఆజాద్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు.
తత్వవేత్త, సాహితీవేత్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, ఆధునిక భారత విద్యావ్యవస్థ నిర్మాత. అనేక భాషల్లో ఆయన నిష్ణాతుడు. 1940 నుంచి 1946 వరకు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉన్నారు. 35 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ఆయన జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులు అయ్యారు. 1947 నుంచి 52 వరకు కేంద్ర విద్యాశాఖమంత్రిగా, 1952 నుంచి 58 వరకు విద్యా, ప్రకృతి వనరులు, శాస్త్ర సాంకేతిక మంత్రిగా, 1956లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసిన మౌలానా ఆజాద్ అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి కృషిచేశారు. విద్యారంగంలో శాస్త్ర, సాంకేతికతను పెంపొందించడానికి విశేష కృషి చేశారు. 1951లో ఖరగ్పూర్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టెక్నాలజీని స్థాపించిన ఘనత మౌలానా ఆజాద్దే.
ఆయన గౌరవారర్థం దేశంలో అనేక విద్యాసంస్థలకు ఆయన పేరు పెట్టారు. 1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. పదేండ్లకు పైగా జైలు జీవితం అనుభవించారు. 1890లో ఆయన కుటుంబం కలకత్తా వచ్చి స్థిరపడింది. ప్రాథమిక విద్య ఇంటి దగ్గరే నేర్చుకున్నారు. పన్నెండేండ్ల వయసులోనే ఆయనకు ప్రత్యేకంగా రీడింగ్ రూమ్, సొంత లైబ్రరీ ఉండేవి. మొదట పార్శీ, అరబ్బీ విద్యలు ఔపోసన పట్టారు. తరువాత ఫ్రెంచి, ఇంగ్లీషు గ్రంథాల విస్తృత అధ్యయనం ప్రారంభించారు.
మౌలానా విభిన్న రంగాల్లో అవగాహన, ఆసక్తి, నైపుణ్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పండిట్ నెహ్రూ మౌలానా రాజకీయ, సామాజిక పరిణతి గురించి గొప్పగా ప్రశంసించారు. మౌలానా నిష్టాగరిష్ఠుడైన ధార్మిక పండితుడు. పరమత ప్రేమికుడు. నిఖార్సయిన మానవతావాది. హిందూ-ముస్లింల ఐక్యతను పెంపొందించడమే ధ్యేయంగా ‘అల్ – హిలాల్’ పత్రికను స్థాపించారు. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించడంతో ‘అల్ – బలాగ్’ పేరుతో మరో పత్రికను ప్రారంభించారు. ఆయన మొట్టమొదట రాసిన గజల్ ‘అర్మగానె ఫర్ఖ్’ పత్రికలో ప్రచురితమైంది. తరువాత లక్నోనుంచి వెలువడే ‘ఖుదంగె నజర్,‘పయామెయార్’ పత్రికల్లో ఆయన కవిత్వం క్రమం తప్పకుండా ప్రచురితమయ్యేది.
ఆయన మొట్టమొదట ‘నైరంగ్ ఆలం’ పేరుతో ఓ సాహిత్య పత్రికను కూడా ప్రారంభించారు. తర్జుమానుల్ ఖురాన్ పేరుతో పవిత్ర ఖురాన్ గ్రంథానికి వ్యాఖ్యానం రాశారు. గుబార్ – ఎ ఖాతిర్, ఇండియా విన్స్ ఫ్రీడం, అల్ బయాన్ , అల్ బసాయిర్, జామిఉష్షవాహిద్, ఖిలాఫత్, జజీరుల్ అరబ్, ఖుత్బాత్ గ్రంథాలు రచించారు. అల్ మతీన్, వకీల్, జమీందార్, హందర్ద్, ముస్లిం గెజిట్, అల్ హాకిమ్, అల్ హఖ్, కామ్రేడ్ వంటి ప్రముఖ పత్రికలకు వ్యాసాలు రాశారు. భారత్ , పాకిస్థాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. జిన్నాతో విభేదించారు. మౌలానా ఆజాద్ మరణానంతరం 1992 లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఆయనకు లభించింది.
లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1958 ఫిబ్రవరి 22న ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. మౌలానా గౌరవార్థ్ధం ఆయన పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే రోజు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్టు)
యండీ ఉస్మాన్ ఖాన్
9912508645