భౌగోళికంగా తెలంగాణ ఉత్తర-దక్షిణ భారత దేశానికి మధ్యస్థంగా ఉండటం వల్ల అటు అర్యావర్తన ఇటు ద్రావిడావర్తన ప్రభావం అనాదిగా తెలంగాణ ప్రాంతంపై ఉంది అనేది చరిత్ర చెబుతున్న సత్యం. తెలంగాణ సంస్కృతి ఈ రెండు సంస్కృతుల సమ్మిళితంగా వేల సంవత్సరాలుగా పరిఢవిల్లింది అని ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను పరిశీలించిన పరిశోధకులు తేల్చి చెప్పారు.
బుద్ధ భగవానుడు-జైన భగవానుడు జీవించి ఉన్నకాలంలోనే బౌద్ధ- జైనమతాలు తెలంగాణలో గోదావరీ తీరానికి వచ్చి స్థిరపడ్డాయని చరిత్రకారులు ఆధారాలు చూపిస్తున్నారు. సుమారు వెయ్యేండ్ల బౌద్ధ-జైన మతాలు తెలంగాణలోని వివిధ సంస్కృతులైన సనాతన ధర్మంతో, ద్రావిడ సంస్కృతితో మమేకమై పరిఢవిల్లిన ఆనవాళ్లు మనకు శాతవాహనకాలం నాటి చారిత్రక విషయాలను పరిశీలించినప్పుడు తెలుస్తుంది. శాతవాహన ప్రభువులు సనాతన ధర్మాన్ని అచరించినప్పటికీ బౌద్ధులను, జైనులను ఆదరించారు. ఈ విధంగా భిన్న సంస్కృతులు సహజీవనం సాగించే పరిస్థితులు సుమారు రెండు వేల ఏండ్లకు పూర్వమే అప్పటి శాతవాహన రాజ్యంలో (ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో) ఉన్నాయన్నది చారిత్రక సత్యం.
తెలంగాణలో ఉన్న సామాజిక సంబంధా లు, మతపరమైన విశ్వాసాలు వేదాలలో ఉన్న దేవతల ఆరాధనతోపాటు, పురాతన కాలం నాటి గ్రామదేవతల ఆరాధన విధానాలను కూడా కలిగి ఉండటాన్ని మనం గమనించవచ్చు. వేదాంగాలు, పురాణాలలో పేర్కొన్న బ్రహ్మ- విష్ణు- మహేశ్వరాది దేవతా మూర్తులతోపాటు ప్రాచీనకాలం నాటి గ్రామదేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, మహంకాళి, దుర్గమ్మ మొదలైన దేవతామూర్తులను పూజించటం నేటికీ తెలంగాణ ప్రజలలో కనిపిస్తుంది. ఎల్మోర్, దుబే అనే పరిశోధకులు తెలంగాణ ప్రజల ప్రాచీన ఆరాధన పద్ధతులు వైదిక పద్ధతులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నవని అభిప్రాయపడ్డారు. అంటే ప్రాచీన గ్రామ దేవతారాధన పద్ధతులు, వైదికారాధన పద్ధతులు వేల ఏండ్లుగా తెలంగాణలో సహజీవనం చేశాయని అర్థమవుతుంది.
నిజాం పరిపాలన సమయంలో అప్పటి ప్రభుత్వ యంత్రాంగమే బతుకమ్మ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేసేదనేది చారిత్రక సత్యం. వేల ఏండ్ల చరిత్రలో కొంతమంది వ్యక్తులో, రాజులో, సంస్థలో కొద్దికాలం పాటు మత సామరస్యం పాటించనప్పటికీ అది తెలంగాణ సంస్కృతిగా ఎన్నడూ లేదు.
కాకతీయులను ఎదిరించి వీరోచితంగా పోరాడిన కోయ గిరిజన తెగ మహిళలైన సమ్మ క్క, సారలమ్మలను సుమారు వెయ్యి సంవత్సరాలుగా దేవతలుగా పూజించే సంస్కృతి తెలంగాణ ప్రజలది. భద్రాచలంలో సీతారాములకు ఆలయం కట్టించిన రామదాసు శిస్తు కట్టనందుకు కుతుబ్ షాహీ సుల్తాన్ తానాషా మొదట బంధించాడు. ఆ తర్వాత రాముడు తన కలలోకి వచ్చినట్లు, శిస్తు చెల్లింపు జరిగినట్లు నిర్ధారించుకున్న వెంటనే రామదాసును విడుదల చేశాడు తానాషా. అంతేకాకుండా, భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి హైద్రాబాద్ పాలకులు ఏటా ముత్యాలు పంపే విధంగా ఫర్మాన్ జారీచేశారు. ఆ సంప్రదా యం సుమారు నాలుగు వందల ఏండ్లుగా కొనసాగడమే తెలంగాణ అసలు, సిసలు సంస్కృతికి నిదర్శనం. భిన్నత్వంలో ఏకత్వానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది?
తెలంగాణ సమ్మిళిత సంస్కృతి ఎల్లప్పుడు, ఒక నిరంతర ధారలాగా కొనసాగుతూనే వచ్చింది. వివిధ మత ఆచారాలు పాటించే ప్రజలు ఐక్యతతో కలిసిమెలిసి జీవించారు. అందువల్లనే, తెలంగాణ ప్రాంతంలో మహాత్మాగాంధీ పర్యటించినప్పుడు ఇక్కడి సంస్కృతిని గంగ-జెమునీ తెహజీబ్గా కొనియాడా రు. దీన్ని బట్టి ఇక్కడి ప్రజల గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.
వేల సంవత్సరాలుగా వివిధ కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు, జాతులకు చెందిన ప్రజలు తెలంగాణలో పరస్పరం గౌరవించుకుంటూ సహజీవనం చేస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థల వారు తమ స్వార్థ రాజకీయాలలో భాగంగా ఈ సం స్కృతికి విఘాతం కలిగించాలని చూస్తున్నా రు. సనాతన ధర్మ సంప్రదాయమైన ‘బహుజన సుఖాయ-బహుజన హితాయ’కు హిందుత్వ భావజాలం పేరిట విఘాతం కలిగించడానికి విఫలయత్నాలు జరుపుతున్నా రు. ఇతర మత ఛాందసవాదులు కూడా కొం తవరకు వీరితో మమేకమై ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న సంస్కృతి, సంప్రదాయాలను అవహేళన చేస్తూ చిల్లర రాజకీయాలకు తెర లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఇటువంటివాటిని ఇష్టపడరు. నిత్యచైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు ఇలాంటి వికృత కార్యాన్ని ఎదుర్కోవడమే కాకుండా, ఇలాంటి విద్వేష రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పడానికి సన్నద్ధులై ఉంటారు.
ఆకాశాత్ పతితం తోయం
యథా గచ్చతి సాగరం
సర్వదేవ నమస్కారాన్
కేశవం ప్రతిగచ్చతి
ఏ విధంగా అయితే ప్రతి వర్షపు చుక్క సముద్రాన్ని చేరుతుందో అదే విధంగా ఎవరిని కొలిచినను కేశవునికే చెందుతుంది అని విశ్వసించే సనాతన ధార్మికులు విద్వేష రాజకీయాలను ఎప్పటికీ స్వాగతించరు.
విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని మరొక్కసారి ఎలుగెత్తి చాటడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
పెండ్యాల
మంగళాదేవి