ఔదార్యం అంటే ఉదార గుణం కలిగి ఉండటం అని అర్థం. దానం, త్యాగం, దయ మొదలైనవన్నీ ఉదార గుణాలుగా చెప్పవచ్చు. సత్కార్యాలు చేయడం వల్ల మనిషి జన్మ సార్థకమవుతుంది. చేసే దానం ఎంత స్వల్పమైనా అది మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే, ఏ దానం చేయాలన్నా మొదట శ్రద్ధ ఉండాలి. వినయంతో, జ్ఞానంతో యోగ్యత తెలిసి దానం ఇవ్వాలని తైత్తిరీయ ఉపనిషత్ చెప్తున్నది. ‘కంకణాది భూషణాలు ధరించడం వల్ల కాదు… దానధర్మాల వల్ల చేతులు ప్రకాశిస్తాయ’ని భర్తృహరి పేర్కొన్నాడు. ‘జపం, దానం, స్వాధ్యాయం- ఇవి మనం జీవితాంతం ఆచరించాల్సిన విధులు’ అని నీతిశాస్త్ర కథనం. దానం కోసమే ధనార్జన చేయాలని ఆదిశంకరులు ఉద్బోధించారు.
నలమహారాజు కల్పవృక్షం కన్నా గొప్ప దాత అని కావ్యాలు వర్ణించాయి. ఒకసారి నలుడి దగ్గరికి ఇంద్రుడు, అగ్ని, యము డు, వరుణుడు కలిసివచ్చి ‘ఆర్తులమై వచ్చాం, మమ్మల్ని ఆదరించు’ అన్నారట. ‘మీరు ఏం కోరుకున్నా ఇస్తాన’ని నలుడు వారికి వాగ్దానం చేశాడు. ఇచ్చిన మాటను నిలుపుకొన్నాడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తికి బలి చక్రవర్తి మూడు అడుగులు దానం చేసి గొప్పదాతగా చరిత్రలో నిలిచిపోయాడు. తనను శరణు కోరి వచ్చిన పావురాన్ని కాపాడటానికి తన శరీరంలోని మాంస ఖండాన్ని కోసి డేగకు ఇచ్చిన శిబి చక్రవర్తి త్యాగనిరతిని నేటికీ స్మరించుకుంటున్నాం. అలాగే వజ్రాయుధం కోసం దధీచి తన వెన్నెముకను త్యాగం చేశాడు. ఉదారగుణం, త్యాగశీలతను ప్రకృతి నుంచి, పశుపక్ష్యాదుల నుంచి నేర్చుకోవచ్చు. వృక్షాలు, నదులు మొదలైనవి ఫలాపేక్ష లేకుం డా అనేక ప్రాణుల అవసరాలను తీరుస్తున్నాయి. ప్రతిఫలం ఆశించి, కీర్తి కాక్షించి దానాలు చేయకూడదు. ఏదో ఆశించి చేసే దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఉదారత్వం అనేది ఒక వ్రతం, ఒక దీక్ష. త్యాగశీలతను తపస్సులా భావించాలని ఆర్ష ధర్మం బోధిస్తున్నది. అన్నదానం, విద్యాదానం, భూదానం, నేత్రదానం మొదలైనవి మనిషి ఔదార్యానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. మరణించిన వ్యక్తి అవయదానం వల్ల మరెందరికో ప్రాణాలు నిలబడుతున్నాయి కదా! అంతకన్నా గొప్ప పుణ్యం మరేం ఉంటుంది? అందుకే, ప్రతి మనిషి ఔదార్యాన్ని చాటుతూ, తనకు ఉన్నంతలో సాటివారికి సాయపడుతూ ఉండాలి. సంపాదించిన దానిలో కొంత భాగమైనా దానం చేయాలి. మన శక్తియుక్తులను ఇతరుల బాగుకోసం వినియోగించడం కర్తవ్యంగా భావించాలి.
– వేదార్థం మధుసూదన శర్మ