ప్రజలకు దారిచూపే శక్తిమంతమైన సిద్ధాంతం ఉన్నవారు తడబడరు. త్యాగాలకు వెనుదీయరు. తమకు అండగా నిలిచినవారిని, సంక్షేమాన్ని ఆచరణలో చూపించిన వారిని ప్రజలు అక్కున చేర్చుకుంటారు. మునుగోడు ఫలితం దీనిని రుజువు చేసింది. బిడ్డ ఏడుపు వినగానే తల్లి ఎలా పరుగున వెళ్లి లాలిస్తుందో, తమకు ఆపద వస్తే కాపాడే నిజమైన ప్రజా సేవకుడు కేసీఆర్ మాత్రమేనని ప్రజలు తేల్చేశారు. తమ స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులకు, పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని తీర్పునిచ్చారు.
ప్రపంచానికే నాగరికత నేర్పిన భారతజాతిని మళ్లీ ఆటవిక సంస్కృతి వైపు మళ్లించడానికి సంఘ్పరివార్ పనిచేస్తున్నది. ఈ విద్వేషపు వేషగాళ్లు, తిరోగమన గుంపుల అసలు రూపాన్ని భారత సమాజం ముందుంచడం చారిత్రక అవసరం. భారతదేశానికి బహుళత్వం, సమాఖ్యతత్వం, సహనం, సహ జీవన సంస్కృతి ప్రాణాధారాలు. వీటిని పౌర సమాజం కొనసాగించాలి.
మతోన్మాద నియంతలపై పోరులో గర్వించే విజయాన్ని కేసీఆర్ సొంతం చేసుకున్నారు. మునుగోడు విజయం ఉజ్వల భవిష్యత్ను వాగ్దానం చేస్తున్నదని నిరూపించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది దేశవ్యాప్త కార్యాచరణకు ఉపక్రమించిన తరుణంలో మునుగోడు శుభారంభాన్నిచ్చింది. భారత రాజకీయ చరిత్రను గొప్ప ముందడుగు వేయించడంలో మునుగోడు ప్రజలు ఉత్తేజకర పాత్రను పోషించారు. శాంతి కాముక ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు ఐక్యంగా ఉంటే పైశాచిక తిరోగమన శక్తులను ఎలా నిర్వీర్యం చేయవచ్చో మునుగోడు ఉపఎన్నిక చాటిచెప్పింది.
అసలు ఈ ఉపఎన్నిక వచ్చిన తీరు హాస్యాస్పదంగా, ఆక్షేపణీయంగా ఉంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి తీరు దొంగే దొంగ.. దొంగ అని అరచినట్లుంది. అన్నం పెట్టిన ఇంటికి కన్నం పెట్టినట్లు ఆయన తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు. తన రాజకీయ ప్రస్థానానికి, వ్యాపారాభివృద్ధికి తోడ్పడిన కాంగ్రెస్ పార్టీని ఆయన వీడిన తీరు దిగజారిన నైతికతకు నిదర్శనం. ఆయనకు రాజకీయ పరిణితి, జ్ఞానం తక్కువని ఆయన మాటతీరే తెలియజేస్తున్నది. రైతుల పట్ల ప్రేమ కలిగిన కేసీఆర్ వారి కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. రైతుబంధు తదితర పథకాలతో వ్యవసాయాభివృద్ధికి కృషి చేశారు. కానీ కేసీఆర్ ఎరువుల ధరలు పెంచడం వల్ల రైతులు ఆగమయ్యారని రాజగోపాల్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎరువుల ధరల నిర్ణయం కేంద్రం పరిధిలో ఉంటుందన్న కనీస జ్ఞానం ఆయనకు లేకపోవడంతో రైతులు ఆయనను అసహ్యించుకున్నారు.
రాజగోపాల్రెడ్డి రాజీనామాలో ఆయన స్వార్థం తప్ప తమపై మమకారం లేదని తెలుసుకున్న ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు. దళితబంధును కించపర్చిన రాజగోపాల్కు ఓట్లతో తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికే ఈ పథకానికి 38,511 కుటుంబాలకు అర్హత ఉందని గుర్తించిన ప్రభుత్వం 11,835 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. నూలుపై జీఎస్టీ విధించిన కేంద్రంపై ఆగ్రహంగా ఉన్న చేనేత కార్మికులు తమకు అండగా నిలిచిన టీఆర్ఎస్కు పట్టం గట్టారు. మునుగోడులో అసలే అభివృద్ధి జరగలేదని బీజేపీ శ్రేణులు గోబెల్స్ ప్రచారం చేశాయి. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదని మునుగోడు ఉప ఎన్నిక రుజువు చేసింది.
తమ జీవితాలను ఛిద్రం చేసిన ఫ్లోరైడ్ రక్కసిని మిషన్ భగీరథ ద్వారా నిర్మూలించిన కేసీఆరే తమ నాయకుడని మునుగోడు ప్రజలు బలంగా నమ్మారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ల వంటి పథకాలు తమ జీవన ప్రమాణాలను ఎలా పెంచాయో గమనించారు. తమ సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలని, ఉచితాలని అపహాస్యం చేసి, వాటిని రద్దు చేయాలని చూస్తున్న బీజేపీ కుట్రలను అర్థం చేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ నియోజకవర్గంలోని 150 గ్రామాలను విద్యాసాగర్ డిండి ప్రాజెక్ట్ ద్వారా సస్యశ్యామలం చేయడం మునుగోడు ప్రజలు కండ్లారా చూశారు. చౌటుప్పల్ ప్రాంతంలో 580 ఎకరాల విస్తీర్ణంలో 200 కంపెనీలతో ప్రారంభమైన పారిశ్రామిక వాడ వేలాది మందికి ఉపాధి కల్పించబోతున్నదన్న కేటీఆర్ హామీని యువత నమ్మారు. కేసీఆర్ సర్కార్ సంక్షోభిత మునుగోడును సుభిక్ష ప్రాంతంగా మార్చిన తీరును గమనించిన ఓటర్లు ఆ పార్టీని ఆదరించారు. బీజేపీ సంపన్నులను ఆదరించే బడా వ్యాపారుల పార్టీ అని తెలుసుకొని ఛీ కొట్టారు.
వ్యక్తిగత స్వార్థం కోసం ఓటర్లను పావులుగా ఉపయోగించే ధోరణిని ప్రజలు ఈసడించుకున్నారని మునుగోడు తీరు స్పష్టం చేస్తున్నది. అదే సమయంలో తెలంగాణ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియచేస్తున్నది. బడా పెట్టుబడిదారులతో మిలాఖత్ అయిన బీజేపీ, లౌకిక విధానాలను అవలంబిస్తున్న దక్షిణాది రాష్ర్టాలపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నది. రాజ్యాంగస్ఫూర్తిని విధ్వంసం చేస్తూ అనేక రాష్ర్టాల్లో అనైతిక ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో విషం నింపి విద్యారంగంలో ఫాసిజాన్ని వ్యాప్తిచేస్తున్న ది. ప్రపంచానికే నాగరికత నేర్పిన భారతజాతిని మళ్లీ ఆటవిక సంస్కృతి వైపు మళ్లించడానికి సంఘ్పరివార్ పనిచేస్తున్నది. ఈ విద్వేషపు వేషగాళ్లు, తిరోగమన గుంపుల అసలు రూపాన్ని భారత సమాజం ముందుంచడం చారిత్రక అవసరం. భారతదేశానికి బహుళత్వం, సమాఖ్యత త్వం, సహనం, సహ జీవన సంస్కృతి ప్రాణాధారాలు. వీటిని పౌర సమాజం కొనసాగించాలి. దీనికోసం కేసీర్ అన్నట్లు సమాజంలో పురోగతిని సాధించాలని కోరుకుంటున్న మేధావులు, ప్రజా సంఘాలు, సంస్థలు ఐక్య సంఘటనలో భాగమవ్వాలి. ఒక సరికొత్త నడవడికను దేశానికి ఇవ్వాలి. దీనికి తెలంగాణ దీప స్తంభంగా నిలవాలి.
అస్నాల శ్రీనివాస్
96522 75560