మునుగోడు విజయం సింపుల్గా, సూటిగా, సుత్తిలేకుండా.. టీఆర్ఎస్కు బోనస్, బీఆర్ఎస్కు బ్లెస్ కమ్ కంట్రీవైడ్ టేకాఫ్కు ఆల్ ది బెస్ట్. ప్రజా జీవిత తాత్వికులు కేసీఆర్కు వయా మునుగోడు తెలంగాణ నిండు దీవెన. వర్తమాన, భవిష్యత్తుకు కోటి కాంతుల ఆవిష్కరణ. ఎన్నో అపోహలు, అనుమానాలు, సందేహాలకు సమాధానాల సమాహారం.
ఈ విజయం పుష్కలమైన ఆధిక్యంతో నిక్షేపంగా ఉన్న జనరంజక ప్రజా ప్ర భుత్వాలపై వేధింపులు, కూల్చివేతల కుట్రలపై ధ ర్మాగ్రహ ప్రతిధ్వని. న్యాయం మోగించిన తాజా నగారా. వేవ్ క్రియేట్ అనే వ్యామోహంతో వెర్రివేషాల లొడలొడ, గడబిడ పార్టీల భ్రమలకు గుణపాఠం.
ప్రస్తుత టీఆర్ఎస్, రేపటి బీఆర్ఎస్ తెలంగాణకూ యావత్ దేశానికీ అంతిమంగా శ్రీరామరక్ష అంటూ మునుగోడు ఇచ్చిన తీర్పును మునుగోడుకే పరిమితం చేయదల్చుకుంటే తమను తాము భ్రమల్లోకి తోసుకున్నట్టే. ఇంకా చెప్పాలంటే తమను తాము మోసపుచ్చుకోవడమే. ఎలాగంటే, మునుగోడు శాసనసభ నియోజకవర్గం గ్రామీణమే కాదు, నగర నాడికి ప్రతిబింబం.
తెలంగాణ సమాజంలోని విభిన్నవర్గాల వారి అంతరంగం.. సమూల సమగ్ర సందేశం.. విస్పష్ట సంకేతం. అచేతన కాంగ్రెస్ అయినా, బాతాల బీజేపీ అయినా రెండో స్థానం కోసమే పోటీపడేవని తేల్చిచెప్పిన సమకాలీన, సమీప కాలపు సన్నివేశం. నిజానికి అవాంఛనీయమైనది ఈ ఉప ఎన్నిక. రాష్ట్రంలోని అధికార పార్టీకి ఆవగింజంత అయినా ప్రమేయం, జోక్యం లేని ఉప ఎన్నిక. నిష్టూరమైన యధార్థం ఏమంటే తెలంగాణ మట్టి, నేల స్వభావం ఎరుగని ఢిల్లీ పాలక పార్టీ పైత్యానికి పరాకాష్టే ఈ ఉప ఎన్నిక. వాస్తవానికి మునుగోడు స్థానం ప్రతిపక్ష కాంగ్రెస్ది.
అటు సిట్టింగ్ కాంగ్రెస్ను కాదనీ, దిక్కుమాలిన ఊహలతో ఇటు అనవసర ఉప ఎన్నికకు మూల కారణమైన బీజేపీకి బరాబర్ బిస్తర్ కట్టి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ సంక్షేమ, సమగ్రాభివృద్ధి పాలనకు బోనస్గా మునుగోడును ప్రజలు కట్టబెట్టారు. అన్నం ఉడికిన స్థితిని ఒక మెతుకు నిర్ధారణ చేసినట్టు రాష్ట్రంలోని జనం మనోభావాలకు అద్దంపట్టింది. భారత్ రాష్ట్ర సమితిని నిండు మనసుతో బ్లెస్ చేసింది. సగర్వంగా తలెత్తుకునేలా తెలంగాణ జాతి ఖ్యాతిని దశదిశలా ఎవరెస్ట్ శిఖర సమానంగా నిలబెట్టిన కేసీఆర్ పట్ల తన తిరుగులేని విశ్వాసాన్ని, మద్దతును, గౌరవాన్ని, కృతజ్ఞతను పునరుద్ఘాటించింది.
లెక్క కు అందని కుటిల వ్యూహాలు, సకల కుట్ర వేషాలే కాదు, అంతర్లీనంగా నాగపూర్ భావజాలాన్ని మోహరించి, ఎంతగా రుద్దజూసినా మునుగోడు తన మొక్కవోని దక్షతకు ఆచరణలో దర్పణమైంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది. ఏ పార్టీ స్థాయి ఏమిటో గట్టిగా నొక్కిచెప్పింది. తతిమ్మా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు స్ఫూర్తి, ఆదర్శాన్ని పంచింది. పౌరులుగా మన బాధ్యత, కర్తవ్యం ఏమిటో చాటింది. రానున్న సాధారణ ఎన్నికలకు దృఢంగా కార్యోన్ముఖం చేసింది. తెలంగాణపై గుజరాతీ బాపతు ద్వయం బీజేపీ దండయాత్రపై అలెర్ట్ చేసింది. మరోసారి జంగ్సైరన్ మోగించింది. చైతన్య సమరశంఖం పూరించింది.
స్వచ్ఛమైన అంకిత భావంతో..: టీఆర్ఎస్ను స్థాపించిన తొలినాళ్ల నుంచి కేసీఆర్కు సిద్దిపేట ఎట్లా సంపూర్ణ అండగా నిలుస్తున్నదో లోకం ఎరుకలో ఉన్నది. అట్లే, సుసంపన్న తెలంగాణ నమూనా దేశవ్యాప్తం చేసేందుకు బయల్దేరుతున్న నేపథ్యంలో కేసీఆర్కు మునుగోడు శుభారంభం పలికింది. సిద్దిపేట మాదిరి అవకాశం తనకు దక్కడంతో పులకించింది. జాతీయపార్టీ బీఆర్ఎస్గా టీఆర్ఎస్ రూపాంతరం మునుగోడు ఉప ఎన్నికకు ముందు యాదృచ్ఛికం.
టీఆర్ఎస్ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ సారథి కేసీఆర్ అత్యంత సాహసోపేతంగా ఏది తలపెట్టినా అది విజయవంతమవుతుందని యావన్మంది ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే, ప్రజాహితం, సమసమాజ స్థాపన, చిట్టచివరి పౌరుల దాకా సమగ్ర అభ్యున్నతే కేసీఆర్ ఆశా, శ్వాస. కాబట్టే సమస్త ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉంటుంది. ఆయన ఏది చేసినా తమ మంచికోసం అనేది ఆల్రెడీ తెలంగాణ సమాజం అనుభవంలో ఉన్నది. అందుకే కేసీఆర్ పాలన రాష్ర్టానికే కాకుండా, యావత్ దేశానికీ సమీప కాలంలో విస్తృతం కావాలనే నిఖార్సయిన ఆకాంక్ష మునుగోడు తీర్పులో ప్రతిఫలించింది.
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
ఇల్లెందుల దుర్గాప్రసాద్ 94408 50384