దేశంలో సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ బరితెగిస్తున్నది. అన్నివిధాలుగా ప్రజాస్వామ్య సంప్రదాయాలను, విలువలను కాలరాస్తున్నది. సంపూర్ణ మెజారిటీతో సుస్థిర పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుటిలయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో కొనేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని చూసింది. ఇది సాధారణ రాజకీయం కాదు. ప్రజా ప్రతినిధుల కొనుగోలు వ్యవహారం బీజేపీ ఆధిపత్య అసంబద్ధ విషక్రీడ. ప్రజాస్వామ్య వ్యవస్థ, విలువలపైనే వికృతదాడి.
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మోదీ తన నిజ రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. హిందుత్వ పేరిట విభజన రాజకీయంతో అధికారాన్ని కైవసం చేసుకున్న మోదీ.. ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. మెజారిటీ ఆధిపత్యవాదంతో అందలమెక్కిన మోదీ ఇప్పుడు మరింత దూకుడుగా మత రాజకీయంతో పాటు, ధన రాజకీయం చేస్తున్నారు.
గత కొంతకాలంగా మోదీ డబ్బు మూటలనే నమ్ముకున్నట్లు కనిపిస్తున్నది. ధన రాశులతోనే రాజకీయాన్ని నడుపుతున్నారు. ఎన్నికల్లో ప్రజాభిమానంతో గెలువలేని రాష్ర్టాల్లో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజా ప్రభుత్వాలను కూల్చుతున్నారు. ఏదోవిధంగా అధికారం కైవసం చేసుకొని అదే బీజేపీ బలంగా ప్రపంచానికి చాటాలనుకుంటున్నారు! అందుకోసం ఎంతటి నీచపు పనికైనా తెగపడుతున్నారు.
ఈ క్రమంలోనే దశాబ్దకాలంగా వివిధ రాష్ర్టాల్లో ఎన్నికైన విపక్ష పార్టీ ప్రభుత్వాలను కూల్చటమే పనిగా పెట్టుకున్నారు. 2011లో అరుణాచల్ప్రదేశ్లోని మొత్తం 60 స్థానాల్లో.. 47 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇక్కడ బీజేపీ కేవలం 11 మందినే గెలుచుకున్నది. మూడేండ్లు తిరగకముందే 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ అధికారాన్ని దొడ్డిదారిన చేజిక్కించుకున్నది. 2019లో కర్ణాటకలో 40 మంది జేడీ(ఎస్) ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని పడగొట్టింది. 2017లో మణిపూర్లో 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్. అయినా కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు లాక్కొని అధికారాన్ని కైవసం చేసుకున్నది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంటే.. కేవలం 13 మందినే కలిగి ఉన్న బీజేపీ 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారపీఠాన్ని స్వాధీనం చేసుకున్నది. 2019లో సిక్కింలో బీజేపీ ఒక్క సీటూ గెలువలేదు. ఇప్పుడు అక్కడ 12 మందితో అధికారాన్ని వెలగబెడుతున్నది. ఇలాంటి ఉదంతాలు, ఫలించిన కుట్రలు, విఫలమైన కుయుక్తులెన్నో.
గోద్రా అల్లర్లు, గుజరాత్ మారణకాండ మీదుగా ఢిల్లీదాకా ఎదిగివచ్చిన మోదీ అధికారానికి మతాన్ని, మెజారిటీవాదాన్ని ప్రధాన వాహకంగా చేసుకుంటున్నారు. ఉత్తర భారతాన మెజారిటీవాద రాజకీయం పనిచేసినట్లుగా, దేశవ్యాప్తంగా అంతటా ఆశించిన ఫలితాన్నివ్వదు. ముఖ్యంగా దక్షిణాదిన మెజారిటీవాద మత రాజకీయం అసలే పనిచేయదు. కాబట్టి రెండో అస్త్రమైన ధన రాజకీయాన్ని అనుసరిస్తున్నారు.
గత ఎన్నికల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై బీజేపీ తన పట్టు కోల్పోవటం జీర్ణించుకోలేకపోయింది. శివసేనతో కలిసి ఆధికారం చెలాయించాలని చూసినా బీజేపీ అనుసరించే పెద్దన్న పాత్ర ధోరణితో విసిగిపోయిన శివసేన బీజేపీని దూరం పెట్టింది. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ శివసేన నేత షిండేను బుట్టలో వేసుకొని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చింది. షిండే దన్నుతో తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ నేపథ్యంలోంచే బీజేపీ నేతల కన్ను తెలంగాణపై పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా విషపూరిత విమర్శలకు దిగుతూనే నేతలను ప్రలోభాలకు గురిచేసేందుకు పడరాని పాట్లు పడుతున్నది. ఆ దుష్ట పన్నాగాల్లోంచి తెరమీదికి వచ్చిందే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక బీజేపీ రెండు లక్ష్యాలు పెట్టుకున్నట్లు కనపడుతున్నది. రాష్ర్టాన్ని ఎప్పు డూ ఏదో ఒక ఎన్నికలో మునిగిపోయేట్లు చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కుంటుపడేట్లు చేయాలని చూస్తున్నది. తద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచాలనుకుంటున్నది. కాలక్రమంలో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే తన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే కుట్ర ఉన్నది. మరొక లక్ష్యం ఏమంటే.. టీఆర్ఎస్లో ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయించేట్లు చేసి తద్వారా బీజేపీ వైపు నాయకులు, ప్రజలు చూస్తున్నారని ప్రజలకు చూపాలనుకుంటున్నది. అంతేగాక, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేయాలనే దుర్బుద్ధి ఉన్నది. అయితే.. తెలంగాణ విషయంలో బీజేపీ నేతలు ఆశించినవన్నీ ఆనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే.. టీఆర్ఎస్ మిగతా రాజకీయపార్టీల మాదిరి అధికారం కోసం పురుడుపోసుకొని ఎదిగింది కాదు. దానికో సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల చరిత్ర ఉన్నది. తెలంగాణ ప్రజలకూ తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచీ నేటి తెలంగాణ రాష్ట్ర సాధన దాకా చైతన్యపూరిత త్యాగాల చరిత్ర ఉన్నది. కాబట్టే… ‘మోదీ-షా’ ద్వయం పన్నిన వలలో చిక్కకుండా వారినే ఉచ్చుల్లో బంధించి చైతన్య ప్రతీకలుగా నిలిచారు మన ఎమ్మెల్యేలు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జేజేలు.
ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వంగా వ్యవహరిస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలోనే వామపక్షపార్టీలు కూడా చేతులు కలపటం ఆహ్వానించదగిన పరిణామం. మోదీ ప్రజావ్యతిరేక ఫాసిస్టు విధానాలకు పాతర వేసేందుకు అన్ని శక్తులు ఏకమై మునుగోడు ఎన్నికలో బీజేపీని ఓడించాలి. బీజేపీ మెజారిటీవాద మత రాజకీయాలను కట్టడి చేసి లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి. దేశ సమాఖ్య, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించుకోవాలి.
(వ్యాసకర్త: గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817