ఏ దేశంలోనైనా రాజకీయాల వల్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమం జరగాలి. అలాగే మౌలిక సమస్యల పరిష్కారం, భావి తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాలన సాగాలి. అలా జరగనప్పుడు అధికారంలో ఉన్న పార్టీలను గద్దె దించడానికి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తాయి. దేశంలో అధికారం సాగించిన కాంగ్రెస్, బీజేపీలు, రకరకాల ఫ్రంట్లు దేశాన్ని అనుకున్నంతగా అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు కావాల్సింది ప్రజల ఫ్రంట్. ప్రజల భాగస్వామ్యం కలిగిన రాజకీయాలు. అలాంటి రాజకీయాలకు ‘భారత్ రాష్ట్ర సమితి’ చిరునామాగా నిలుస్తున్నది.
దేశంలో రాజకీయ మార్పు ఎందుకు జరగాలి, ఎవరి కోసం జరగాలి? అనే విషయాన్ని మనం చర్చించుకోవాలి. దేశ ప్రజల జీవన స్థితిగతుల్లో ఆశించినంత మార్పు తీసుకు రావడానికే రాజకీయ మార్పు జరగాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ప్రత్యామ్నాయ, అభివృద్ధి, సంక్షేమ నమూనాతో ఈ దేశ ప్రజల స్థితిగతులు మార్చాలని గత 10 ఏండ్లుగా కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేశమంతటా వారు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేకపోయారు. ఈ నేపథ్యంలో గత రెండేండ్లుగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో తీసుకురావాల్సిన మౌలిక మార్పులపై సీరియస్గా దృష్టి సారించారు.
సహజ వనరులు, మానవ వనరులు సమృద్ధిగా గల మన దేశంలో అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఎలా అభివృద్ధి చేయవచ్చునో సవివరంగా సూచిస్తున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర స్థాయిలో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్తో కలిస్తే తప్ప ఈ దేశంలో బీజేపీని ఓడించలేమనే పాత వాదననే వల్లె వేస్తున్నారు. నాయకులు ఇలా ఉంటే దేశానికి కొత్తగా ఎవరు నాయకత్వం వహిస్తారు? దేశం పట్ల నిబద్ధత, నిజాయితీ, సాహసం, అపార అధ్యయనం, దార్శనికత ఉండే నాయకుడు కావాలి కదా. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ధైర్యంగా ముందుకు వచ్చారు.
ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండుసార్లు కూల దోసే కుట్రలు జరిగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వాటికి భయపడకుండా కేసీఆర్ సాహసం చేస్తున్నారు. ఎవరు కలిసొచ్చినా, రాకున్నా కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ సిద్ధపడ్డారు. అందుకే పెద్ద పెద్ద జాతీయ నేతలను పక్కకు నెట్టి దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కాబోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వ్యూహ రచన, రాజకీయ చతురతతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఉద్యమిస్తున్నారు.
కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ కూటమి దేశంలో సాధ్యం కాదని, ‘బీఆర్ఎస్’ విఫల ప్రయోగమని కొందరు అపహాస్యం చేయడం మొదలు పెట్టారు. అయితే దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ విషయమై ఒక్కసారి ఆలోచించాలి. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు మారాల్సిన అవసరం ఏమున్నదని తమను తాము ప్రశ్నించుకోవాలి. అప్పుడే ప్రభుత్వం మారాలన్న డిమాండ్ సమంజసమా? కాదా? అన్న విషయం స్పష్టం అవుతుంది. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీలు, ప్రజలు అసంతృప్తితో 2014, 2019లో మోదీ సారథ్యంలోని బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ఆ పార్టీ దేశంలో అనేక రాజకీయ ప్రయోగాలు చేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. ప్రజలకు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించక పోగా విద్వేష రాజకీయాలు చేస్తూ, ప్రజల్లో అనైక్యతను సృష్టిస్తూ దేశాన్ని అస్థిర పరుస్తున్నది.
రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ గద్దె ఎక్కుతున్నది. అధికారం కోసం అవసరమైతే తమ మిత్రపక్షంగా ఉన్న వారినైనా గద్దె దింపడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు అధికార మార్పిడి కోసం జరగాలా? లేదా దేశాభివృద్ధిలో, ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు కోసం జరగాలా? అనే విషయంపై చర్చ జరగాలి.
ఇన్నాళ్లు జాతీయ రాజకీయాలు కాంగ్రెస్, బీజేపీకే సాధ్యమన్న సూత్రీకరణతో ప్రజలు రాజీ పడాల్సి వచ్చింది. జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించినా ఎక్కువ కాలం మనలేకపోయింది. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి దేశానికి అవసరమైంది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలను ఓడించడానికి కాకుండా దేశ ప్రజలను గెలిపించడానికి అంటూ ప్రత్యామ్నాయ రాజకీయాలను, అభివృద్ధి విధానాలను తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. దురదృష్టమేమిటంటే చాలా మంది జాతీయ రాజకీయాల్లో పార్టీల గెలుపోటములు, ఓట్లు, సీట్ల సాధ్యాసాధ్యాల మీద చర్చలు చేస్తున్నారు తప్ప కేసీఆర్ చెబుతున్న పాలనా విధానాలపై చర్చ చేయటం లేదు. వ్యవసాయ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల గురించి ఆయన కొన్ని విధానాలు చెబుతున్నారు.
రైతు బంధు, ఆసరా పింఛన్లు, సాగునీటి సదుపాయం లాంటివి దేశమంతటా అమలు చేయాలనుకుంటున్నారు. వీటి గురించి దేశం చర్చించాలని కోరుతున్నారు. కేసీఆర్ చెబుతున్న విషయాలు ఆచరణలో అసాధ్యమనో, ఇంకేదో కారణం చెప్పో రాజకీయ పార్టీలు దాటవేయవచ్చు. కానీ దేశ ప్రజలు అలాంటి సుపరిపాలనే కోరుకుంటున్నారు. రేపు రాజకీయ పార్టీలు ఈ సుపరిపాలన అందించలేకపోతే దేశ ప్రజలంతా కేసీఆర్ వెంట నడుస్తారు. అది ఆయన విజయం అవుతుంది. దేశ భవిష్యత్తు రాజకీయాలను కేసీఆర్ మలుపు తిప్పబోతున్నందుకు తెలంగాణ ప్రజలంతా గర్వించాలి. ఆయన ప్రతిపాదిస్తున్న కొత్త రాజకీయాలను, గుణాత్మక మార్పును స్వాగతించాలి.
(వ్యాసకర్త: తెలంగాణ వికాససమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు)
మల్లవఝుల ,విజయానంద్
98495 39390