‘భారత్ రాష్ట్ర సమితి’గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్పైనా కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేస్తున్నది. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అన్న రీతిలో వ్యవహరిస్తున్నది. దేశంలో కేవలం 200 లోక్సభ స్థానాల్లోనే బీజేపీకి పోటీ ఇవ్వగలిగిన కాంగ్రెస్తో మిగతా రాజకీయపార్టీలు ఎందుకు జతకట్టాలి? వారిని దేశమంతా మోయడమంటే అసమర్థుని అందలమెక్కించుకొని యుద్ధం చేయడం లాంటిదే.
దేశ శ్రేయస్సు, అభివృద్ధి కోసం ‘టీఆర్ఎస్’ ‘బీఆర్ఎస్’గా రూపాంతరం చెందింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు పేలుతున్నది. బీఆర్ఎస్ను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నేను కొన్ని ప్రశ్నలు సంధించాలనుకుంటున్నా. ఈ దేశ రాజకీయాలను మీరేమైనా గంపగుత్తకు తీసుకున్నారా? బీఆర్ఎస్ను మీకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారా? దేశంలో ఎక్కడైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉన్న రాజకీయపార్టీలు మీతోనే ఉండి, మీ కోసమే పని చేయాలనే షరతులేమైనా ఉన్నాయా? అసలు మీ దృష్టిలో జాతీయ రాజకీయ పార్టీలంటే కేవలం ఉత్తరాది పార్టీలేనా? దేశాన్ని కేవలం ఉత్తరాది పార్టీలు, ఉత్తరాది నాయకులే పాలించాలా ? దక్షిణాది ప్రజలు ఈ దేశ పౌరులు కారా? మీ వరుస వైఫల్యాల వల్లనే కదా కొత్త నాయకత్వం, కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరు కాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను నిరంకుశంగా 356 అధికరణను ఉపయోగించి కూల్చివేసిన ఘనత మీది కాదా? దేశానికి మొదటి హోంమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ పటేల్ నాటి హైదరాబాద్ రాజ్యంలో ఆపరేషన్ పోలోను కమ్యూనిస్టుల అణచివేత కోసం, భూస్వాముల మద్దతు కోసం నిర్వహించలేదా? సుమారు 2 లక్షల మంది ముస్లింలను, భూములు పంచాలని పోరాటం చేసిన 4 వేల మంది కమ్యూనిస్టులను నాటి పోలీస్ చర్య పొట్టనబెట్టుకుందని సుందర్లాల్ కమిషన్ చెప్పింది. ఈ దారుణాలపై మీ పార్టీ ఎప్పుడైనా క్షమాపణ చెప్పిందా? ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 4 వేల మంది సిక్కుల ఊచకోతకు మీ పార్టీ ఎప్పుడైనా సమాధానం చెప్పిందా?
రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే, అప్పుడు మీకు సంఖ్యా బలం లేకపోతే, కేసీఆర్ దగ్గర ఆ బలం ఉంటే మీరు ఆయన మద్దతు అడగరా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సూటిగా సమాధానం చెప్పాలి.
100 ఎలుకలను తిన్న పిల్లి కాశీకి పోయినట్లు కాంగ్రెస్ పార్టీ నీతులు వల్లిస్తే వినేవారు ఎవరూ లేరు ఇక్కడ. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? గుజరాత్ అల్లర్లలో 4 వేల మంది ముస్లింల ఊచకోతకు కారణమైన వారిని మీరు జైల్లో పెట్టి ఉంటే ఈ దేశం సురక్షితంగా ఉండేది కదా? ఈ తప్పులన్నింటిపైనా ఏనాడైనా సమీక్ష చేసుకున్నారా? గత సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని మొత్తం 545 సీట్లలో మీ పార్టీ గెలుచుకున్నది 54 సీట్లే. కేవలం 200 లోక్ సభ సీట్లలోనే మీ పార్టీ బీజేపీకి పోటీ ఇవ్వగలదు. మిగిలిన 345 సీట్లలో బీజేపీని ఎవరు ఓడించాలి? అందుకోసం కొత్త జాతీయపార్టీలు పుట్టుకువస్తే మీరు సహించలేరా? దేశంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరైనా ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని చూరగొనేటప్పుడు ఒక పురాతన రాజకీయపార్టీగా మీరు దాన్ని స్వాగతించలేరా?
మీరు బీజేపీపై పూర్తిస్థాయిలో పోరాడకపోతే మిగిలిన పార్టీలు కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలా? బీజేపీ దేశంలో బలపడటానికి ఈవీఎంలు కారణమని చాలా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. వాటిని ప్రవేశపెట్టింది మీరే కదా? ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడాన్ని రద్దుచేయాలని మీరు ఎప్పుడైనా డిమాండ్ చేశారా? ఈ విషయంలో మీకు, బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందమేమిటి? చివరగా ఒక విషయం అడుగుతాను. రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో ఫాసిస్టు బీజేపీని అధికారంలోనికి రానివ్వకుండా ఇతరపార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే మీరు మద్దతు ఇవ్వరా?
ఇవాళ తెలంగాణను అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపారు కేసీఆర్ . వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ మంచినీరు… ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్నాయి. ఇలాంటి తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశానికి అందించాలని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రధానిగా సేవలందించాలని దక్షిణాదితో పాటు ఉత్తరాది రైతులు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మరింత ప్రజా మద్దతు లభించనున్నది.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
బీరయ్య యాదవ్
91777 57440