జానపద గేయ సాహిత్యంలో ఉయ్యాల (బతుకమ్మ) పాటలది ఒక ప్రక్రియ. ఉయ్యాల పాటలకు బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, దసరా పాటలు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి స్త్రీల పాటలే. అయితే ఇవి జోల పాటలు కావు. ఊయల ఊపులాగా ముందుకెళ్లి మళ్లీ వెనక్కి తిరిగివచ్చి, తిరిగి ముందుకు వెళ్తూ ఉంటుంది. అందుకే ఈ గేటు ప్రక్రియకు ఉయ్యాల పాట అని పేరు వచ్చింది. రెండుచేతులా చప్పట్లు కొడుతూ, గుండ్రంగా తిరుగుతూ ఈ పాటలు పాడుతారు. ప్రతి పాదం చివర ‘ఉయ్యాలో’ లేక ‘వలలో’..అనే వూత్, లేక వంత ఉంటూ లయానుగుణంగా పాట సాగుతుంది.
గ్రామీణ జానపదుల విశ్వాసాల నుంచి నిష్కల్మష నిర్మల హృదయక్షేత్రాల నుంచి మొగ్గ తొడిగినవే ఈ జానపద పాటలు. వీటికి మన తెలంగాణ నేలే పుట్టిళ్లు. ప్రజా జీవనంలో చైతన్యంలో భాగమైన ఈ ఉయ్యాల పాటలు నేటి ఆధునిక జీవనశైలి డిష్ యాంటెన్నా, నెట్ సంస్కృతి వలయంలో చిక్కుకొని తమ ఉనికినే కోల్పోతున్నాయి. అయితే మన ఆచార సంప్రదాయాలు, మనం చేసుకునే పండుగలు ఈ పాటలకు చిగురు తొడగటం ఆనందదాయకం.
తెలంగాణలో బతుకమ్మ పాటలు ప్రాచుర్యం పొందాయి. ‘శ్రీలక్ష్మీ దేవియు చందమామ- సృష్టి బతుకమ్మయ్యే చందమామ/ పుట్టినా రీతి చెప్పే చందమామ-భట్టు నరసిమ్హ కవి చందమామ’ అనే పాట బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలను తెలియజేస్తుంది. ఈ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకొంటారు. వెడల్పయిన పళ్లెం మీద గుమ్మడాకులు పరిచి వాటి మీద గునుగు, తంగేడు, బంతి వంటి రంగురంగుల పూలు గోపురాకారంగా పేర్చి స్త్రీలు పూజిస్తారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఈ పాటల్లోని పాదాలు త్రిశ్ర చతురస్ర గతిలో నడుస్తుంటాయి.
ఇలాంటివే కాక గౌరీపూజ సందర్భంలో ‘రుద్రాక్ష చెట్లల్ల ఆట చిలుకల్లారా, పాట చిలుకల్లారా, కలికి చిలుకల్లార, కొలికి చిలుకల్లారా.. కుందమ్మ గువ్వలు/ నీ నోము నీకిత్తునే గౌరమ్మ-నా నోము ఫలమివ్వవే’ అంటూ స్త్రీలు తమ పాటల్లో భక్తిని వ్యక్తం చేస్తారు. పండ్లు అమ్ముకునే సందర్భంలోనూ ‘బండికి తగ్గట్టు కోడెల మరిచి-కోడెలకు తగ్గట్టు గొలుసుల మరిచి/ గొలుసులకు తగ్గట్టు గజ్జెల మరిచి/ ఆ బండిబాయేనే భద్రాద్రి దనుక-భద్రాద్రి రాముల పండ్లోయి పండ్లు- చూసేవారే గాని కొనేవారు లేరూ’ అని పాడుతారు. ఉయ్యాల పాటల్లో ‘శ్రీరామ నీ తల్లి ఉయ్యాలో.. ప్రేమతో శాంతమ్మ ఉయ్యాలో.. పిలిచి దెగ్గర తీసి ఉయ్యాలో.. సతి ధర్మముకొన్ని ఉయ్యాలో/ చెప్పను ఈ రీతి ఉయ్యాలో- చెవులకు ఇంపుగా ఉయ్యాలో’ అంటూ ఇలా జానపదులు తమ ఉయ్యాల పాటల్లో దేవతలను స్తుతిస్తారు. ఉయ్యాల పాటల్లో అనేక విషయాలతో పాటు సామాజిక జీవనచిత్రణ సైతం ఆయా సందర్భాల్లో కనబడుతుంది. వీర కృత్యాల వల్ల, దొమ్మిల వల్ల, నిరంకుశత్వాన్ని ఎదిరించటం వల్ల, సహగమనాధికారాలను నెరవేర్చడం వల్ల ప్రసిద్ధమై, హృదయాలను ఆకర్షించిన సంఘటనలను కథా వస్తువుగా గైకొని గానం చేసిన సందర్భాలు కనిపిస్తాయి.
పితృ, మాతృస్వామ్యాల మధ్య చెలరేగిన ఘర్షణలు కొన్ని గేయాలు ప్రచ్ఛన్నంగా తెలుపగా, అతి ప్రాచీన మాతృస్వామ్య వ్యవస్థ ఉత్పత్తి పరిణామ పతనాలు శివశంఖు కథలోని ఉయ్యాల పాటలో వ్యక్తమవుతాయి. ‘తెల్లని గుడ్లాకు ఉయ్యాలో-తెచ్చే రగుతాలు/ ఎర్రనీ గుడ్లకు-ఎత్తేసే కోపాలు/ నిలువునా పానంబు/..’ అంటూ సాగుతుంది. వారికి జీతభత్యాలు రాజులిచ్చేవారు. ఈ వివరణలు ఇలా ‘కామయ్యా గాద ఉయ్యాలో.. దండు యెల్లేనమ్మ ఉయ్యాలో’ అంటూ వాస్తవికతను వివరిస్తుంది. అత్తగారి ఆరడికి ఒకానొక కోడలు పడే ఆక్రందనను ఈ జానపద సాహిత్యంలోని పాట చక్కగా విశదపరుస్తుంది. ‘కోడలా కోడలా కొలికి ముత్యమా/ పచ్చనీ పాలమీది మీగడేమాయే- కడిపాల మీది వెన్నెలేమాయే/ తేనె కుండ మీది తెప్పలేమాయే- నూనె కుండ మీది నురుగులేమాయే’ అంటూ సాగుతుంది. ఉయ్యాల పాటలు నాటి పరిస్థితులకు అద్దం పట్టాయి. గనుకనే బతుకమ్మ పాటలు సాంస్కృతిక చిహ్నంగానే కాకుండాతెలంగాణ ఉద్యమానికి ఊపిరయ్యాయి.
సామాజిక జీవనంలో ఉయ్యాల పాటలు ప్రధా న భూమికను పోషించాయి. యక్షగానాలు, చిరుతల రామాయణం, కోలాటాలు, చిందు భాగవ తం, ఒగ్గుకథ, బుర్రకథ, హరికథ వంటివి జానపద సాహిత్యంలో గుర్తుంచుకోదగినవి. సామ్రాజ్యవాద విష సంస్కృతి ప్రభావంతో నేడు ఈ కళా సంపద కనుమరుగయ్యే ప్రమాదం వాటిల్లుతున్నది. ఈ జానపద సాహిత్యాన్ని విపత్కరమైన ఈ కాలంలోనూ కాపాడుకోవల్సిన అవసరం తెలంగాణ బిడ్డలుగా మనందరిపై ఉన్నది.
డాక్టర్ ,కటుకోఝ్వల రమేష్
99490 83327