మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి పబ్లిక్రంగ సంస్థలను బజారులో అమ్మకానికి పెడుతూనే ఉన్నది. ఇప్పుడు వరుసలో మినీ రత్న ‘లైఫ్ కేర్ లిమిటెడ్’ సంస్థనూ చేర్చిం ది. ఈ సంస్థ నష్టాల్లో నడువడం లేదు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది. మరి ఈ సంస్థను కేంద్రం ఎందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు?
లైఫ్ కేర్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) అనేది ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ. ఇది కొన్ని దశాబ్దాల తరబడి తక్కువ ధరలకు వైద్య ఉత్పత్తులను అందిస్తున్నది.సంక్షేమ కార్యకలాపాలను నిర్వహించడంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కీలకపాత్ర పోషిస్తున్నది. గర్భ నిరోధకాల తయారీకి సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా, దేశవ్యాప్తంగా గర్భ నిరోధకాలను, ఇతర ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను పంపిణీ చేయడం కోసం ఔట్లెట్ల నెట్వర్క్ను ఏర్పాటుచేసింది.
హెచ్ఎల్ఎల్ నికర విలువ రూ.300 కోట్లు. ఇది 2020-21లలో రూ.112.33 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కరోనా మూలంగా మందగమనం ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో రూ.110.48 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఏండ్ల తరబడి హెచ్ఎల్ఎల్ పరిశోధన, అభివృద్ధిలో భారీ పెట్టుబడులు పెట్టింది. మూడు అంతర్జాతీయ పేటెంట్లను పొంది, మరో ఎనిమిదింటిని పొందేందుకు వరుసలో ఉంది. ఆరోగ్య రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, కేంద్రం హెచ్ఎల్ఎల్ను ప్రైవేటీకరించాలని యోచించడం విడ్డూరం. ప్రైవేటీకరణ తర్వాత దాని ప్రస్తుత సేవలను కొనసాగిస్తుందా లేదా అన్నది కూడా అనుమానమే.
హెచ్ఎల్ఎల్ ప్రైవేట్ హెల్త్కేర్ ప్లేయర్లకు గొప్ప విలువ కలిగిన పెద్ద ఆస్తులు, నెట్వర్క్ను సృష్టించింది. 2017-18లోనే ఈ సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. 2022 జనవరిలో ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు ఆసక్తిదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. నాలుగు హెచ్ఎల్ఎల్ ఉత్పత్తి యూనిట్లకు కేరళ ప్రభుత్వం భూమిని అందించి ఉన్నందున, ఈ సంస్థ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరింది. దీంతో పాటు తమను గ్లోబల్ బిడ్లోకి ప్రవేశించడానికి అనుమతించాలని కూడా అభ్యర్థించింది. కానీ కేరళ అభ్యర్థనను కేంద్రం నిరాకరించింది. అర్హత ప్రమాణాల ప్రకారం బిడ్డర్లు ఫార్మా/ హెల్త్కేర్ ఉత్పత్తి తయారీ వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, యూపీలలో హెచ్ఎల్ఎల్ ఫ్యాక్టరీలు, కార్యాలయాలు గల ఆరు ఫ్రీహోల్డ్ ప్లాట్లున్నాయి. కేరళ, మహారాష్ట్ర, గోవా, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ అంతటా 10 లీజు హోల్డ్ ఆస్తులున్నాయి. ఇవన్నీ అమ్మకంలో భాగంగా అన్యాక్రాంతం కానున్నాయి.
ఈ సంస్థ ప్రైవేటీకరణతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగనున్నది. పైవేటుపరం చేసిన తర్వాత హెచ్ఎల్ఎల్ భారీ ఆస్తులు లాభార్జన కోసమే ఉపయోగపడతాయి. లక్షలాది మంది ప్రజలకు మందులు చౌకగా లభించవు. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత దిగజార్చుతుంది. ఇప్పటికే వైద్యరంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. హెచ్ఎల్ఎల్ అమ్మకం వల్ల ఈ ప్రైవేటీకరణకు మరింత ఊతం ఇచ్చినట్టవుతుంది. ఈ సంస్థ ప్రైవేటీకరణ వల్ల ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరిగి ప్రజలు పేదరికంలో మగ్గుతారు. హెచ్ఎల్ఎల్ ప్రజల సొమ్ముతో, ప్రజారోగ్యం కోసం ఏర్పాటయిన సంస్థ. ఇది ప్రైవేటుపరం కాకుండా ప్రజలు అడ్డుకోవాలి.
ఆళవందార్ ,వేణుమాధవ్
86860 51752