? : ‘మీరు దేవుడిని చూసిన్రా?’
! : ‘అరెరే మీరు మళ్ళీ దేవుడిని కోల్పోయిన్రా?’
మత ప్రచారకుడొకరు ఓ గృహస్థును అడిగిన ప్రశ్నకు జవాబు అది! వెర్రి తలలు వేసే మత ప్రచారం, వ్యాపారంలా చేసే మత మార్పిడులు, ప్రభుత్వ పాలనలోకి చొచ్చుకు వస్తున్న మతంపై పశ్చిమ దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న సెటైర్ అది. దేవుడిని పావులా వాడుకోవడం మొదలుపెడితే ఇంక ఆయన వాళ్లకు దూరం జరుగుతడు అని సారాంశం!
సర్వమునకు కర్త నీవు సర్వమునకు భోక్త నీవు సర్వమునకు ఆర్త నీవు పరమపురుష భవా శివా
– అంటూనే…
వరదపద్మ బాల శంభో బిరుదులన్నీ కలవు నీకు కరుణ తోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలన్నా‘నిన్ను విడచి ఉండలేనయా కైలాసవాసా’ అనే తత్వంలో నిగ్గదీస్తడు తత్వకారుడు.
దైవం, లేదా దైవమనే భావన, లేదా ఆ భావన కలిగించే ఆధ్యాత్మిక వికాసం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. సర్వమునకు నీవే కర్త కాబట్టి, కరుణతో కాపాడకపోతే ఆ బిరుదులన్నీ ఉత్తివే అనడం ధిక్కారం కాదు, దైవ దూషణ కాదు. ఆధ్యాత్మిక భావంతో చూస్తే ఇది దైవానికి తానేమిటో గుర్తుచేయడం. దైవం మానుష రూపేణా అంటూ సాటి మనుషులకూ గుర్తు చేయడం.
భారత ప్రజల జీవితాలను దైవం ఎంతో ప్రభావితం చేస్తూనే ఉన్నది అనాదిగా. పాప పుణ్యాలు, కర్మ సిద్ధాంతాలు మన జనానికి ఒకరు నేర్పాల్సిన పనిలేదు. భావదారిద్య్ర, సర్వభ్రష్ట బీజేపీకి అసలు అర్హత లేదు ఈ విషయంలో. ఇతర ఖండాల నుంచి దండెత్తి వచ్చిన క్రైస్తవ, ముస్లిం పాలకులు ఇక్కడ వందల ఏండ్లు రాజ్యం చేసినా ఇక్కడ ఆధ్యాత్మికతను ముట్టుకోలేకపోయిన్రు. తెల్ల పాలకులు ఇక్కడి వనరులను కొల్లగొట్టి తరలించుకుపోయిన్రు కానీ అంతకుముందు 11వ శతాబ్దంలో గుర్రాల మీద వచ్చిన ముస్లిం పురుషులు (ముస్లిం స్త్రీలు రాలేదు ఇక్కడికి) మాత్రం ఈ నేలను తమది చేసుకున్నరు. ఇక్కడి వారిని పెండ్లి చేసుకున్నరు. ఈ నేలతో మమేకమైన్రు. తమ సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూనే హిందువుల ఆనందాల్లో పాలుపంచుకుంటూ ఉన్నరు. ఇది సహించలేకపోతున్నది బీజేపీ.
ఏ.హెచ్.విశ్వనాథ్ అనే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ ఆ మధ్య ఏమన్నరో గుర్తున్నది కదా? హైందవ ఆలయాల పరిసరాల్లో ముస్లింలు వ్యాపారం చేయకూడదని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే తిరుగుబాటు చేసిండు ఈయన. ‘ఇదేమి ధర్మం? ఇదేమి సంస్కృతి? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి ఈ దేశ చరిత్ర ఎంతో ఘనమైనది. హ్రస్వదృష్టితో దానిని నాశనం చేయకండి. ఐదు వందలు, వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టి కర్పూరం, అగర్బత్తీలు, పువ్వులు అమ్ముకుంటున్నవారిని రోడ్డుకీడుస్తరా? ప్రభుత్వం అంటే ప్రజలు, రాజ్యాంగం, ఆదేశిక సూత్రాల అమలు అని మనం మరువరాదు’ అంటూ సొంత పార్టీ మత ఛాందస విధానాన్ని ఏకిపారేసిండు. ఇది కదా మన సర్వ సమత!
తమ అనుంగు కార్పొరేట్ మిత్రులకు వేల కోట్లలో దోచిపెడుతూ, దివాళా తీసిన బొక్కసాన్ని నింపుకోవడానికి ఎడాపెడా ధరలు పెంచేసి, బతుకులు బుగ్గిచేసి, తామే చెప్పే 80 శాతం హిందువుల జీవితాలను ఆర్థిక అక్రమ శిక్షణతో అల్లకల్లోలం చేసిన బీజేపీ… కట్టే బట్ట, తినే తిండి విషయాల్లో దౌర్జన్యంగా దూరుతూ సమాజాన్ని పాతాళానికి తీసుకుపోతున్నది. మన పక్కనే ఉన్న కర్ణాటకలో ఎన్నో దారుణాలు చూస్తున్నం. ‘హలాల్ మాంసం ఆర్థిక జీహాద్ అంటూ మరో విష ప్రచారం అందుకున్నది బీజేపీ. మొన్నటిదాకా హిజాబ్ అంటూ, ఇప్పుడు హలాల్ అంటూ ప్రజలను తమ దైనందిన జీవిత సమస్యల కారకుల నుంచి భావోద్వేగాల వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నది. ఈ గుజరాత్ మోడల్ను, ఈ యూపీ మోడల్ను మనం సాగనివ్వరాదు.
మరోవైపు యోగా నేర్పే రాందేవ్ బాబా గతంలో ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’ అని చెప్పాడు. నేడు ప్రతిరోజూ రూపాయి చొప్పున పెంచుతూ పోతున్న బీజేపీ ప్రభుత్వానికి మరి ఏమి చెపుతారు అని ఒక విలేకరి అడిగితే కయ్యిమని లేసిండు. యోగులు, ఋషులు అని చెప్పుకునేవారు కొందరు రాజకీయ నాయకులను మించి వికృతరూపం దాలుస్తున్నరు. ప్రతి అడ్డమైన దరిద్రాన్నీ ‘దేశం కోసం ధర్మం కోసం’ అంటూ వెనుకేసుకొస్తున్నరు. సమతా మూర్తుల సాక్షిగా సాంస్కృతికాధిపత్యాన్ని పొగుడుతున్నరు. కుహనా హిందుత్వవాదుల స్వార్థపూరిత ఎజెండాలో పావులైతున్నరు. ఇది సమాజానికి ఏ మాత్రమూ క్షేమకరం కాదు.
ఎవరేమనుకున్నా సరే.. ధర్మం నిలవాలి. రాజధర్మం కూడా నిలవాలి! ఈ దేశ పాలకుడు దాన్ని నిలుపుకోకపోతే ఈ దేశమే ఆయనను నిలేస్తది. చెవులు మెలేస్తది. మొదటే చెప్పినట్టు చేవ చచ్చిపోయి లేదు ఈ దేశం. భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తితో, నవనవోన్మేషంతో మెరుస్తున్న భరతసింహాలు మేల్కొని చీల్చి చెండాడుతయి వారిని!
‘కంచి మఠానికి ఎదురుగా గోడపై పెరియార్ నాస్తిక ప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్ద కాలానికి పై నుంచీ ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూ వచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండటం కంచి పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తను మేలుకునేవాడినని ఆయన చెప్పుకొన్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతిగొప్ప ప్రతీకలలో ఇదొకటి. ఈ వైవిధ్యాన్ని, ఈ సహజీవనాన్ని చెరిపివేసి ఒకే మూస భావజాలాన్ని, మూర్తులను, చరిత్రలను ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా యావద్భారతవ్యాప్తం చేసే ఎత్తుగడలు సాగవు’ అంటారు సీనియర్ జర్నలిస్టు, భారతదేశ సంస్కృతిపై పురాణేతిహాసాలపై లోతైన అధ్యయనం చేసిన కల్లూరి భాస్కరం. అసలైన హిందువుగా ఉండటం అంటే ఇదీ!
బీజేపీ చేస్తున్న దారుణాలు అడ్డుకోవాలంటే, నేడు అభివృద్ధి-సంక్షేమంతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాసం కూడా జరగవలసి ఉన్నది. 15, 16 శతాబ్దాలలో ఉత్తర భారతం ఈ దేశానికి ప్రసాదించిన భక్తి ఉద్యమం నేడు అదే ఉత్తర భారత దాష్టీకం నుంచి మొత్తం దేశాన్ని రక్షించుకోవడానికి అత్యవసరం. నాడు హిందూ మతంలో పెచ్చరిల్లిన అస్పృశ్యత, వర్ణ భేదాలు, దురాచారాల నిర్మూలన లక్ష్యంగా పనిచేసిన్రు భక్తి ఉద్యమకారులు. దేశ భాషల్లో సామాన్య జనానికి అర్థమయ్యే విధంగా దృష్టాంతాలతో కథలు బోధించిన్రు. నిమ్న జాతుల ఉద్ధరణ కోసం వర్ణ భేదాలను ఖండించిన్రు. సంత్ రవిదాస్ చమార్, శంకరాచార్య, రామానుజాచార్య, గురునానక్, తుకారాం, నామదేవుడు, వేమన లాంటి వారు భక్తి ఉద్యమాల ద్వారా, తత్వాల ద్వారా సర్వమానవ సమతను బోధించిన్రు. ‘మానవుడు ప్రేమతో భగవంతుడిలో లీనం కాగలడు’ అనే సిద్ధాంతంతో సూఫీతత్వం విరాజిల్లింది. ఇందులో మొయినుద్దీన్ చిస్తీ, అమీర్ ఖుస్రూ లాంటివాళ్లు భక్తి సంగీతంతో భగవంతుడి సాన్నిధ్యం పొందవచ్చునని విశ్వసించి న్రు. ఫిరదౌసి, నిజాముద్దీన్ అవులియా లాంటి సూఫీ త త్వవేత్తలు సమానత్వాన్ని ప్రవచించిన్రు. బడుగు వర్గాల కు చెందిన రైతులు, కార్మికు లు, కూలీలను ఆకర్షించిన్రు.
పాఠకులారా! ఇక్కడే మీకు
మన ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, కూలీలను ఎట్లా చూసిందో, చూస్తున్నదో గుర్తుకొచ్చి ఉండాలి. ప్రజలకు శాంతీ సౌఖ్యం కలిగించడమే అన్ని ఇజాల్లోకెల్లా గొప్ప ఇజం. సర్వ మానవ సమతను బోధించే, మన పురాజ్ఞానం ఇప్పుడు తక్షణావసరం.
సాంస్కృతిక పునరుజ్జీవనం ఒక్కటే రాజకీయ ప్రేరేపిత కుహనా హిందూవాద నాయకులకు మందు. కీలెరిగి పెట్టగల వాత!
పదకొండో శతాబ్దంలో ముస్లింలు ఈ దేశంలోకి అడుగు పెట్టకముందు శైవ-వైష్ణవ కలహాలు జరిగేవి. మనుషులకు ఎప్పుడూ శత్రువులుండాలి కాబోలు! ముస్లింల రూపంలో ‘కొత్త శత్రువు’ను వెతుక్కున్నాక అంతర్గత కలహాలు కొంచెం సద్దుమణిగినాయి. అయితే, ఎన్ని అవ లక్షణాలున్నా భారతదేశం పటిష్ఠంగా, పరిపుష్టంగా ఉన్నదంటే ఇక్కడి ప్రజల సామరస్య, సహనశీల జీవనవిధానమే కారణం. కాబట్టే, ఇది కంటగింపు అయిన బీజేపీ తమ పప్పులను ఉడికించుకోవడానికి మరలా ముస్లింలను శత్రువులుగా చూపుతున్నది. వివేచనతో వీరిని అడ్డుకోవాలి. అందుకు పనికొచ్చే ప్రతి పనిముట్టూ ఉపయోగించుకోవాలి. భక్తి ఉద్యమం మరలా లేవాలి. తెలంగాణ ఆ దిశలో పయనిస్తున్నది. శివకేశవ అభేదపు వెలుగు చూపుతున్న కేసీఆర్ దార్శనికతలో! దీనిని అందిపుచ్చుకొని, దేశవ్యాపితం చేయాల్సిన బాధ్యత దేశ ప్రేమికులదే!
నిర్మాణంలో విధ్వంసాన్ని ధ్వంసం చేయడమే అసలైన నిర్మాణం. బీజేపీ నిర్మిస్తున్న విధ్వంసాన్ని కూకటివేళ్లతో పెకిలిద్దాం. ఈ శుభసంకల్పానికి వచ్చే ‘విజయ దశమి’ కంటే మంచి ముహూర్తం మనకిక ఏమున్నది?
జై తెలంగాణ! జై హింద్!
‘కంచి మఠానికి ఎదురుగా గోడపై పెరియార్ నాస్తిక ప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్దానికి పైగా ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూ వచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండటం కంచి పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తను మేలుకునేవాడినని ఆయన చెప్పుకొన్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతిగొప్ప ప్రతీకలలో ఇదొకటి.
శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371