ఒక దేశానికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్న ప్రాంతం తెలంగాణ. విభిన్న మతాలు, అన్ని భాషలకు చెందిన ప్రజలు జీవిస్తున్న వైవిధ్య భరితమైన జీవన విధానం తెలంగాణ ప్రత్యేకం. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఉపఖండంగా పిలుచుకుంటాం. సరిగ్గా ఇవే లక్షణాలను పుణికిపుచ్చుకున్న తెలంగాణం మనదేశంలోనే గొప్ప ప్రత్యేకతను సంతరించుకున్నది. తెలంగాణలో గ్రామదేవతలను, ప్రకృతిని పూజించే సంప్రదాయం ఉంది, మతం విషయానికి వస్తే హిందూ, ముస్లింలు అన్నదమ్ముల వలె పండుగలను కూడా కలిసి జరుపుకునే సాంస్కృతిక ఐక్యమత్యం ఉన్న ప్రాంతం ఇది.
ఒకప్పుడు రాజరిక వ్యవస్థ ఉన్నప్పటికీ, ఆ తర్వాత వలసపాలకులైన డచ్, ఫ్రెంచ్, మొగలాయిలు, బ్రిటిష్ వాళ్ల అనంతరం ఆంధ్రపాలకులు తమ ఆధిపత్యాలను రుద్దడానికి ప్రయత్నించినా విచ్ఛిన్నం కాని దృఢమైన, భిన్నమైన సంస్కృతి మన తెలంగాణది. కానీ, నేడు ఉత్తరాదీ వలసవాదులు మన సంస్కృతిపై ఆధిపత్యం చెలాయించాలనే అత్యాశతో మత విద్వేషాలను రెచ్చగొట్టి, తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేయాలని, ప్రజల సంపదను కొల్లగొట్టాలనే పన్నాగాలు పన్నుతున్నారు.
తెలంగాణ పల్లెల్లో ఎల్లమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, గౌరమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, పోషమ్మ, పంట లచ్చువమ్మ, లింగమయ్య, కాటమయ్య, మడేళ్లు, బోనాలు, బతుకమ్మ వంటి గ్రామదేవతలను, పూలను, ప్రకృతిని కొలిచే సంస్కృతి తరతరాలుగా ఉన్నది. బతుకమ్మను ఆడవాళ్లు ఆడుతూ తమ తమ బాధలను తోటి ఆడవాళ్ళతో పంచుకొని సాంత్వన పొందే వారు, కానీ, నేడు ఆడ మగ కలిసి ఆడే గుజరాతీ సంస్కృతి తోడై దాని అస్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం కొనసాగుతున్నది.
బోనాలు వంటి పండుగలలో సైతం డీజేల రణగొణ ధ్వనులతోసాంస్కృతిక విధ్వ ంసం చేస్తున్నారు. మన తెలంగాణ పెండ్లిండ్లలో మెహందీ, హల్దీ వంటి మార్వాడీ కల్చర్ విస్తరిస్తున్నది. అదేవిధంగా మన పెండ్లిండ్లలో మాంసాహార బంతి భోజనాలుండేవి, ఇప్పు డు కొత్తగా శాఖాహారం పెడుతూ బలవంతం గా ఉత్తరాది సంస్కృతివైపు మళ్లిస్తున్నారు. వ్యాపార రంగంలో చాపకింద నీరులా గ్రామీ ణ ప్రాంతాలోనూ ఉత్తరాదివారి దుకాణాలు వెలిసి మన షావుకారుల పొట్టకొడుతున్నా యి. ఉత్తరాది బ్రాహ్మణులు ఇక్కడికి వలస వచ్చి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. మన బ్రాహ్మణులు అంత్యక్రియలు, దినాలు, వ్రతాలకే పరిమితమయ్యారు. పొద్దున్నే లేస్తే మతం గురించి మొత్తుకునే తెలంగాణ బీజేపీ నేతల కండ్లకు ఇది కనపడదు.
మన ప్రాంతపు ఉద్యమ కారులైన కుమ్రం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్యలను విస్మరించి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయిలా విగ్రహాల పేర వారి ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా రాజకీయ పబ్బం గడుపుతున్న బీజేపీ వారి బానిస మనస్తత్వాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి.
చార్మినార్ పక్కనే ఐదు వందల ఏండ్ల నాటి శివుని గుడి ఉంటే అక్కడ కొబ్బరికాయలు అమ్మేది ముస్లిం వ్యక్తి. ‘ఇక్కడి శివుడు చాలా శక్తిమంతుడు రెండు కొబ్బరికాయలు కొట్టండి’ అని భక్తులకు చెప్తుంటాడు. ఇలా కలిసి బతికే జనాల మధ్య చిచ్చుపెట్టడానికి పక్కనే ఉన్న శివుణ్ణి కాదని మత రాజకీయాల కోసం చార్మినార్ కింద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక పాలన విషయానికొస్తే మోదీని ఆకాశానికి ఎత్తే నేతలు కనీసం బీజేపీ పాలిత రాష్ర్టాలు తెలంగాణ అభివృద్ధిలో ఎంత వరకు సరితూగుతాయో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరిహద్దుల్లో ఉన్న రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో అమలయ్యే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మాకు కూడా కావాలని మీడియా ముఖంగా వేడుకుంటున్నారు. ఇక్కడి పనితనానికి, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు కూడా వారి కండ్లకు కనబడటం లేదా..!?
పాదయాత్రలు చేస్తూ ప్రాంతాల పేరు మారుస్తామని, బుల్ డోజర్ల పాలన తెస్తామని, మతం ప్రమాదంలో ఉన్నదని బువ్వకు కూరకు బతుకుదెరువుకసలే అక్కరకు రాని పనికిమాలిన ప్రసంగాలతో ప్రజల విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు.
ఐటీ, సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా మార్చుకొన్న కేంద్రం తన మాట వినని, ప్రాంతీ య పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నది. ఇటీవల లోకసభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5422 ఈడీ కేసులు నమోదు చేయగా 23 మందిని అంటే కేవలం 0.5 శాతం మందిపైనే నేరారోపణ రుజువు చేయగలిగిందని తేలింది. అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్న మోదీ, ధనాన్ని తీసుకురాకపోగా బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వారిని ఇక్కడికి రప్పించలేకపోయారు. మోదీ అధికారంలోకి వచ్చాక విదేశాలకు పారిపోయిన వారిలో 35 మంది ఆయన గుజరాతీ సోదరగణం ఉండడం గమనార్హం.!
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సూచిస్తే ఇంతవరకూ స్పందన లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి స్థానికతను పట్టించుకోలేదు కానీ, తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నార్థ్ధకం కాబోతున్న తరుణంలో ఆమె స్థానికతను ప్రశ్నించాల్సిందే. అలాగే బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చిన రాజస్థానీయుడైన రాజాసింగ్ మన ప్రాంతంలో మతచిచ్చు రేపుతున్నాడు. అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం మంచి నిర్ణయం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ నటి జీవితా రాజశేఖర్కు తెలంగాణ బీజేపీ టికెట్ ఇవ్వాలని చూస్తున్న పరిస్థితులను గమనిస్తుంటే రాజకీయ దురుద్దేశంతో తెలంగాణను ఆంధ్రలో కలిపే ప్రమాదమూ లేకపోలేదు..!
’పరిపాలన’ అనే పదంలోని పరుల పాలన మనకు వద్దు అని స్వరాష్ట్రం సాధించుకున్న మనం మళ్ళీ పరాయి పాలనలో పడే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే పార్టీ వంటి నీచపు, నికృష్టపు కుటిల బుద్ధితో మతం మాటున దేశ సంపదను గుజరాతీయులకు బానిసలకు అప్పనంగా అప్పజెప్పాలని చూస్తున్నారు. భారత సమాజపు ప్రధాన లక్షణమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంతరించిపోయి సాంస్కృతిక నియంతృత్వం, నిరంకుశత్వం దిశగా దేశాన్ని తీసుకెళుతున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న ఫాసిస్టు పాలకుల నుండి నిజమైన భారతీయతను కాపాడుకోవడం మనందరి ముందున్న కింకర్తవ్యం.
ముఖేష్ సామల
97039 73946