కొవిడ్ విపత్కర సమయంలో ఐటీ ఉద్యోగులు వరంలా భావించిన మూన్ లైటింగ్ నేడు కంపెనీలకు శాపంగా మారింది! ఇది నైతికమా, అనైతికమా అనే చర్చ జోరుగా సాగుతోంది. రెండు పక్షాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి. మూన్ లైటింగ్ వల్ల ఏ కంపెనీ ఉత్పాదకత, నాణ్యత దెబ్బ తినకుండా చూడటం ఉద్యోగుల బాధ్యత. అదే సమయంలో తమ సామాజిక సంబంధాలు, ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడమూ వారి బాధ్యతే. ఉద్యోగులు మూన్ లైటింగ్ పాల్పడకుండా నిరోధించేందుకు వారికి శ్రమకు తగిన వేతనాలు అందించడం కంపెనీల బాధ్యత.
కొవిడ్ సంక్షోభ సమయంలో ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచి నిర్ణీత పని వేళల కంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల కంపెనీల ఉత్పాదతక, లాభాలు పెరిగాయి. ఇదే సమయంలో ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు ఐటీ ఉద్యోగులు రెండు లేదా అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. దీన్ని ఐటీ పరి భాషలో ‘మూన్ లైటింగ్’ అని పిలుస్తున్నారు. ఇదే నేడు చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకూ విస్తృతమవుతున్న ఈ సంస్కృతిని ఐటీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నేడు కొవిడ్ సంక్షోభం అనంతరం ఐటీ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కంపెనీలు కోరుతున్నాయి. ఈ తరుణంలో మూన్ లైటింగ్పై చర్చ మరింత ఎక్కువైంది. ఐటీ కంపెనీల పరిశీలనలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు తమ పని వేళలు ముగిసిన తర్వాత మూన్ లైటింగ్ కొనసాగిస్తుంటే, కొందరు పని వేళల్లోనే వేరొక కంపెనీ కోసం పని చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి అయితే ఏకంగా ఒకేసారి ఏడు ఉద్యోగాలు చేస్తున్నట్లు అతని పీఎఫ్ ఖాతాల ద్వారా గుర్తించారు. కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ 400 మంది ఐటీ ఉద్యోగులను సర్వే చేయగా వారిలో 65 శాతం మంది ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరో కంపెనీలో ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఇలాంటి ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరిస్తున్నాయి.
కంపెనీల ఉత్పాదన, నాణ్యతపై మూన్ లైటింగ్ ప్రభావం చూపుతుందని ఐటీ కంపెనీలు వాదిస్తున్నాయి. కంపెనీల గోప్యతకు భంగం వాటిల్లుతుందని, ముఖ్యమైన సమాచారం(డేటా) బహిర్గతమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ కంపెనీ ఉద్యోగులు ఇంకో ఉద్యోగం చేయకూడదని, అలా చేస్తే వేటు తప్పదని వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పంపిస్తున్నాయి. ఉద్యోగుల నియామక పత్రంలోనూ ఈ నిబంధన పొందుపరుస్తున్నాయి. ఇటీవల విప్రో సంస్థ మూన్ లైటింగ్కు పాల్పడుతున్న 300 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించింది. ఇన్ఫోసిస్, ఐబీఎం మొదలైన కంపెనీలు తమ ఉద్యోగులకు ఇలాంటి హెచ్చరికలే చేశాయి. అయితే వాస్తవాలను పరిశీలిస్తే అధిక వేతనాలు పొందుతున్న ఐటీ ఉద్యోగికి కంపెనీ కేటాయించే పనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో ఉద్యోగం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటున్న ఉద్యోగులు, నిపుణులు ఆర్థిక అవసరాల కోసం ఒక కంపెనీకి తెలియకుండా మరో రెండు, మూడు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
తమను మూన్ లైటింగ్ గురించి ప్రశ్నించే ముందు తాము నైతికత పాటిస్తున్నామా లేదా అనే విషయాన్ని కంపెనీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఐటీ ఉద్యోగులు సూచిస్తున్నారు. చాలా కంపెనీలు నికర లాభాలు తగ్గాయని చెబుతూ తమ జీతాల పెంపును తగ్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చిన చాలా కంపెనీలు ఎక్కువ గంటలు తమతో పని చేయించుకుంటున్నాయని వారు వాపోతున్నారు. భారత రాజ్యాంగం అధికరణ 21లో కల్పించిన జీవనోపాధి హక్కు ప్రకారం ఆఫీసులో పని వేళలు అయిపోయిన తర్వాత తాము ఏ పని చేస్తే వారికెందుకని ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ వాదిస్తున్నది. తమ ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం ఇస్తున్నామా లేదా అన్న విషయాన్ని కంపెనీలు ఆలోచించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
మూన్ లైటింగ్ వల్ల కలిగే లాభ నష్టాల గురించి చర్చిస్తే… మూన్ లైటింగ్ చేసే బహు ముఖ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల వల్ల కంపెనీ ఉత్పాదకత, నాణ్యత పడిపోనప్పుడు, కంపెనీ డేటా చోరీకి గురి కానప్పుడు, అలాంటి ఉద్యోగులను కంపెనీలు ఉద్యోగం లోంచి తొలగించాలని అనుకోవు. పైగా వారి డిమాండ్ మేరకు వేతనం పెంచేందుకు ప్రయత్నిస్తాయి.
మూన్ లైటింగ్ చేయడం వల్ల ఐటీ ఉద్యోగులపై పడే ప్రతికూల ప్రభావాలు కూడా తక్కువేం కాదు. మల్టీ-టాస్కింగ్ పనులు, ఆలోచనల వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. పనిలో నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నిద్ర లేమి సమస్య వేధించే అవకాశం ఉంటుంది. ఫలితంగా జీవన నాణ్యత తగ్గుముఖం పడుతుంది.
బహుళ ఉద్యోగాల వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. కానీ సామాజిక, ఆత్మీయ సంబంధాల్లో లోటును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనా వృత్తి పరమైన సామ ర్థ్యం వినియోగించే విషయంలో వ్యక్తిగత-వృత్తిగత జీవన సమతుల్యత చాలా ముఖ్యమైనది. ఒక ఆర్థిక ప్రయోజనం కోసం తిరిగి పొందలేని సామాజిక, ఆత్మీయ ప్రయోజనాలను దూరం చేసుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. వయసులో ఉన్నప్పుడే బాగా సంపాదిస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్న విషయం వాస్తవమే కానీ యాంత్రిక జీవనం ఎప్పటికైనా చేటు చేస్తుందని గుర్తుంచుకోవాలి.
(వ్యాసకర్త : లెక్చరర్, ఐ.పోలవరం)
రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578