రాబోయే ఎన్నికల ముందు ముచ్చటగా మూడో కోరికైన యూసీసీని తప్పనిసరిగా ప్రవేశపెట్టాలనే పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నాడు. ఆ హేయమైన ప్రణాళికను వింటుంటే చాలా ఆశ్చర్యంగానూ, బాధాకరంగానూ ఉన్నది. ఏడ్వ లేక నవ్వు వచ్చే విషయం కూడా. పైకి చూస్తే సమతా దృష్టి ఉన్నట్టు కనబడుతున్నది. పేదల అప్పులను ముక్కుపిండి వసూలు చేయిస్తున్న మన దేశాధినేత మోదీ పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మగా మారి విజయ్ మాల్యా మొదలుకొని నీరవ్ మోదీ, లలిత్ మోదీల పరంపరల అప్పుల వసూళ్ల విషయంలో ఎంత బాధ్యతగానిర్వర్తిస్తున్నాడో ప్రపంచం ప్రత్యక్షంగా చూస్తున్నది.
కేవలం ఒక ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే ఉద్దేశంతో అణగారిన జనాన్ని తరిమికొట్టేందుకు గుళ్లోనే పూజారి పర్యవేక్షణలో ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన వారికి సన్మానాలు కూడా జరిగినట్టు వార్తలు. హత్రాస్లో ఠాగూర్లు పంతొమ్మిదేండ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి నాలుక తెగ్గోసి, నడ్డివిరచి హత్యచేసినా రక్షించే నాథుడు లేడు. క్రూరులు, బలవంతులైన నేరస్తులను రక్షించే క్రమంలో బాధితురాలి పార్థివదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం, నిజ నిర్ధారణకు పోయినవారిని అడ్డుకోవడం, తమ పార్టీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లు తెస్తామని పబ్లిక్గా బెదిరించడం ఎంత బరితెగింపో, వారి పైశాచికత్వానికి పరాకాష్ఠ కాదా!
స్త్రీలను గౌరవిస్తామని మువ్వన్నెల జెండా సాక్షిగా చెప్తూనే గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై, ఆమె కుటుంబసభ్యులపై అత్యాచారం చేసి హత్యలు కూడా చేసిన 11 మంది నిందితులను అమృతోత్సవాల పేరిట సత్ప్రవర్తన పూచీగా జైలు నుంచి విముక్తులను చేసిన రెండునాల్కల ధోరణి, అదేపనిగా తల్లికి దండాలు పెడ్తున్న మోదీకి బాగానే చెల్లుబాటు ఔతున్నది. నిందితులకు స్వేచ్ఛ లభించడంతో బాధితురాలి కుటుంబం అబ్స్కాండ్ కాక తప్పని పరిస్థితి.
మోదీ పాలనలో ఒక మహద్విశేషం.. భారతదేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్న మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేంద్రమంత్రిని రక్షించి పార్లమెంటు మెట్లెక్కించడమూ ఒక దుర్మార్గమైన చర్య. మోదీ విద్యార్హతల గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాచార హక్కుగా పిల్ వేస్తే ప్రధాని గురించి తెలుసుకునే హక్కు ఎవరికీ లేదని, ఆ ప్రయత్నం చేసినందుకు గాను ఫైన్ వేయడం సత్యాన్ని దాచే తెగింపే కదా!
ఇక ప్రస్తుతానికి వస్తే మార్చి 3 నుంచి మణిపూర్లో వర్గ విభేదాలతో.. స్త్రీలను కిరాతకంగా, నగ్నంగా ఊరేగిస్తూ.. వారి ప్రైవేట్ పార్ట్స్ను తాకుతూ పైశాచికానందాన్ని పొందుతూ సామూహిక అత్యాచారం చేసి చంపడం, తల తెగనరికి తడికలకు వేళ్లాడదీయడం.. ఇండ్లను ధ్వంసం చేయడం.. కాల్చడం వంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రేక్షకపాత్ర వహిస్తూనే ఆ ఘోరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ ఆపేయడం ఎంతటి దుర్మార్గం? యావత్ ప్రపంచాన్ని చుట్టివస్తున్న ప్రధాని ఈ వార్తలు, ఈ విషయాలు ముందు నుంచి తెలిసినా స్పందించకపోవడం అటుంచి, వీడియో బయటికి వచ్చినతర్వాత కూడా మొక్కుబడిగా నిరసన వాక్యాలు తెలుపుతూ, ఆ ఘోరాలకు కేవలం బీజేపీ పాలక రాష్ట్రమే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలూ ఉన్నవిగా అని ఉదహరించడం అంటే ఈ సంఘటన కేవలం బీజేపీ పాలిత రాష్ర్టానికి సంబంధించినది కాదని చెప్పే ప్రయత్నమే కదా? ఆ విషయాన్ని అంగీకరించడమంటే తన దేశంలో జరిగే అత్యాచారాలను ఒప్పుకున్నట్టే కదా! అందుకు బాధ్యత వహించాల్సిది తనే అనే విషయాన్ని విస్మరించడం సమర్థపాలకుని లక్షణమా? ఈ సంఘటన దృష్ట్యా మణిపూర్ ముఖ్యమంత్రి (ఆయనే ఇలాంటి సంఘటనలు అనేకం అని స్వయంగా చెప్పుకొంటున్నారు) రాజీనామా చేయవలసి ఉన్నది. అతనిపై వేటు వేయవలసిన బాధ్యత ప్రధానిపై ఉన్నది. ఇదేం జరగడం లేదు. సరికదా పార్లమెంట్లో నోరు విప్పడానికి ఆయన సిద్ధంగా లేరు.
ఈ తతంగమంతా పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఉన్నది. ప్రధాని తొడగిల్లుతూ జోల పాడుతున్నాడు. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు పరచాలని పట్టుబడుతున్న వ్యక్తి ఈ నేరస్థులను ఎందుకు కాపాడుతున్నట్టు? నేరాల విషయంలో యునీఫామిటీ సాధించని దేశాధినేత మొత్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ను తేవలసిందే అని పట్టుబట్డడం ఒక కుట్రలో భాగమే.
నేరాల విషయాన్ని పక్కనపెడితే కుటుంబాలకు, కులాలకు మతాలకు, ప్రాంతాలకు, సంప్రదాయాల్లో, సంస్కృతిలో భిన్నత్వం ఉంటుంది. అందుకే మతాలననుసరించి చట్టాలున్నయి. చట్టాలతో సంబంధం లేకుండా సంస్కృతీ, సంప్రదాయాల విషయాల్లో ఎన్నో విభేదాలు వచ్చి తగాదాలు పడుతుంటారు. వీటన్నింటినీ గాలికి వదిలి యూసీసీ తేవాలనుకోవడం మతపరమైన కుతంత్రం. సెక్యులర్ దేశాన్ని అప్రతిష్ఠ పాలు చేయడమే సుమా!
తిరునగరి దేవకీ దేవి
9949636515